బీబీసీ వివాదాస్పద డాక్యుమెంటరీపై కేంద్రం నిషేధం.. నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు..
BBC Documentary Row | ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. మూడువారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను వచ్చే ఏప్రిల్ నెలలో చేపట్టనున్నట్లు పేర్కొంది. కాగా, గుజరాత్లో 2002లో చోటుచేసుకున్న అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించిన విషయం తెలిసిందే. రెండు పిటిషన్లపై విచారణ […]

BBC Documentary Row | ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. మూడువారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను వచ్చే ఏప్రిల్ నెలలో చేపట్టనున్నట్లు పేర్కొంది. కాగా, గుజరాత్లో 2002లో చోటుచేసుకున్న అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించిన విషయం తెలిసిందే.
రెండు పిటిషన్లపై విచారణ జరిపిన సీజీఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం డాక్యుమెంటరీని పబ్లిక్ డొమైన్ నుంచి తొలగించాలని ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన అసలైన రికార్డులను తమ ముందు ఉంచాలని చెప్పింది. అయితే, డాక్యుమెంటరీని బ్లాక్ చేయడానికి, సోషల్ మీడియా నుంచి తొలగించడానికి ఉన్న అత్యవసర అధికారాలను కేంద్రం ఉపయోగించడాన్ని న్యాయవాది ఎంఎల్ శర్మ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. నిషేధిత ఉత్తర్వులను కేంద్రం ఎన్నడూ అధికారికంగా ప్రచురించలేదని, రెండు భాగాలుగా ఉన్న డాక్యుమెంటరీపై నిషేధం ఏకపక్షమని, రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. అలాగే టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్తో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్లు మరో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ క్రమంలో పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. డాక్యుమెంటరీని స్వయంగా వీక్షించి గుజరాత్ అల్లర్లకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషినర్లు సుప్రీంకోర్టును కోరారు. గుజరాత్లో 2002లో చోటుచేసుకున్న అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించిన విషయం తెలిసిందే. అయితే, కేంద్రం జనవరి 21న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021 కింద అత్యవసర నిబంధనలను ఉపయోగించి వివాదాస్పద డాక్యుమెంటరీని నిషేధించింది. సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.