Bhatti Padayatra 1000 తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యంపై పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 500 పైగా గ్రామాల్లో సాగిన పాదయాత్ర. దేవరకొండ నియోజకవర్గం గుమ్మడవెల్లి లో పైలాన్ ఆవిష్కరణ కాంగ్రెస్ పార్టీని గెలుపుతీరాలకు చేర్చే చుక్కానిలా భట్టి పాదయాత్ర విధాత: భగభగ మండుతున్న ఎండలను, ఆకస్మికంగా విరుచుకుపడిన వానలను సైతం లెక్కచేయకుండా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చే లక్ష్యం తో రాహుల్ గాంధీ హాత్ సే హాత్ జూడో పాదయాత్రకు కొనసాగింపుగా సిఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన […]
విధాత: భగభగ మండుతున్న ఎండలను, ఆకస్మికంగా విరుచుకుపడిన వానలను సైతం లెక్కచేయకుండా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చే లక్ష్యం తో రాహుల్ గాంధీ హాత్ సే హాత్ జూడో పాదయాత్రకు కొనసాగింపుగా సిఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఆదివారం 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకోనుంది.
ఉద్యమాల ఖిల్లా.. పోరాటాల గడ్డ నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజక వర్గం గుమ్మడవెల్లిలో భట్టి పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకోనుండడం విశేషం. పాదయాత్ర వేయి కిలోమీటర్ల మైలురాయి చేరుకున్న ప్రతీకగా గుమ్మడవెల్లిలో పైలాన్ ను రేపు ఆవిష్కరించనున్నారు. కాంగ్రెసు తిరిగి అధికారంలోకి తెచ్చే లక్ష్యంతో భట్టి చేపట్టిన పాదయాత్ర కర్ణాటక ఎన్నికల ఫలితాల పిదప మరింత ఊపుతో, ఉత్సాహంతో కొనసాగుతుంది.
పాదయాత్రకు వస్తున్న స్పందనతో రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా కాంగ్రెస్ ను పరిగణిస్తూ, భట్టి విక్రమార్క పాదయాత్ర చేసిన ప్రాంతాల్లో సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మంత్రులు ముమ్మరంగా పర్యటిస్తుండటం గమనార్హం.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజాప్రస్థానం పాదయాత్రలో రైతుల ఆత్మహత్యలకు గల కారణాలను తెలుసుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం ఉచిత కరెంటుపై చేసి రైతు సంక్షేమం. “కోసం అనేక పథకాలు తీసుకువచ్చిన తరహాలోనే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన పాదయాత్రలో పోడు భూములు, ధరణి సమస్యలతో ఎదుర్కొంటున్న రైతుల ఇబ్బందులను నేరుగా తెలుసుకోవడంతో పాటు ఆ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో కూడా గట్టిగా చెబుతున్నారు.
భట్టి పాదయాత్ర తెలంగాణలో కాంగ్రెస్ పూర్వ వైభవానికి దారితీస్తుందని కాంగ్రెస్ శ్రేణులు నమ్ముతున్నాయి. మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా, బోథ్ నియోజకవర్గం బజరహాత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో మొదలైన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిరాటంకంగా ముందుకు సాగుతూ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి పోస్తోంది.
ఇప్పటి వరకూ 14 జిల్లాల్లోని బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, రామగుండం, ధర్మపురి, పెద్దపల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్, వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్, స్టేషన్ ఘన్ పూర్, జనగామ, అలేరు, భువనగిరి, ఇబ్రహీం పట్నం, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్ నగర్, పరిగి, జడ్చెర్ల, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, దేవరకొండ నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగింది.
29 నియోజకవర్గాలు పూర్తి చేసుకుని తాజాగా దేవరకొండ నియోజకవర్గంలో భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతోంది. ఇక్కడే భట్టి పాదయాత్ర 1000 కిలో మీటర్ల మైలు రాయిని చేరడం విశేషం.
గాలి దుమారాలు.. విపరీత ఎండలు.. ఊహించన భారీ వర్షాలు.. అయినా కూడా తనతో నడిచే కార్యకర్తలతో సమానంగా టెంట్ లో ఉంటూ.. వారితో కలిసి తింటూ.. కలియ తిరుగుతున్న భట్టి విక్రమార్క సరికొత్త నాయకత్వానికి ట్రెండ్ సెట్టర్ గా మారారు. కాంగ్రెస్ నౌకను గెలుపు తీరాలకు చేర్చే.. తెరచాపలా.. భట్టి విక్రమార్క ముందుకు సాగుతున్నారు.
గిరిజనులు, ఆదివాసీలు, బడుగు, బలహీన వర్గాలు, మైనారీటీలు, అట్టడుగు వర్గాలు, అణగారిన ప్రజల నుండి భట్టి విక్రమార్కకు అనూహ్య ప్రజాధరణ లభిస్తుండటం విశేషం. కాంగ్రెస్ పార్టీకి దూరమైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అట్టడుగు, అణగారిన వర్గాలు తిరిగి పార్టీకి దగ్గర చేయడంలో భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర విజయం సాధించిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మొదలైనప్పటి నుంచి వచ్చిన పండుగలను భట్టి పాదయాత్ర ప్రాంతాలలోని ప్రజలతోనే జరుపుకోవడం గమనార్హం. మార్చి 22న ఉగాది పండుగను భట్టి కెరిమెరి మండలం ఝరి గ్రామం వద్ద ఆదివాసులు, గిరిజనులతో కలిసి కుటుంబసమేతంగా జరుపుకున్నారు. ఆదివాసులు, గిరిజనులు, దళితులు, ఇతర అన్ని వర్గాలతో కలసి సహంపక్తి భోజనాలు చేశారు.
మార్చి 30న బెల్లంపల్లి పట్టణంలో శ్రీరామనవమి వేడుకలను స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక కోదండ రామాలమాన్ని సందర్శించి స్వామివారికి విశేషం పూజలు నిర్వహించారు. శ్రీరామ కళ్యాణోత్సవంలో ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఏప్రిల్ 21న రంజాన్ పండుగను హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం శాంతి నగర్ శివారు ప్రాంతంలో ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక మసీదులో ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా ఇఫ్తార్ విందు ఇచ్చారు.
మార్చి 16న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పిప్పిరి గ్రామంలో ప్రారంభమైంది. మార్చి 22న కెరిమెరి మండలం ఝరి గ్రామంలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 125 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఏప్రిల్ 14న మంచిర్యాల పట్టణంలో పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా నిర్వహించిన సత్యాగ్రహ సభ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభం తెచ్చేలా జరిగింది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ముఖ్యఅతిథిగా హాజరుకాగా.. దాదాపు లక్షమంది ప్రజలు ఈ సభలో స్వచ్ఛందంగా పాల్గొనడం విశేషం.
ఏప్రిల్ 16న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టువద్ద 300 కిలోమీటర్ల మైల్ స్టోన్ ను తాకిన పీపుల్స్ మార్చ్.. మార్చి 29 జనగామ జిల్లా నర్మెట్టలో 500 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. మే 5న భువనగిరి నియోజకవర్గం మగ్గంపల్లి గ్రామంలో 600 కిలోమీటర్లు, చేవెళ్ల నియోజకవర్గం రామానుజాపూర్ లో 700 కిలోమీటర్ల పాదయాత్రను పీపుల్స్ మార్చ్ అందుకుంది.
జడ్చెర్ల నియోజకవర్గం కేశవరాంపల్లిలో 800 కిలోమీటర్ల చేరుకోవడంతో పాటుగా.. అదేనెల 25న జడ్చెర్ల పట్టణంలో పీపుల్స్ మార్చ్ భారీ భహిరంగ సభ విజయవంతమైంది. ఈ సభకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుఖు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈనెల 11న దేవరకొండ నియోజకవర్గం గుమ్మడవెల్లికి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రవేశించడంతో.. వెయ్యి కిలోమీటర్ల మార్క్ ను చేరుకుంది. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు రంజిత్ రంజన్, ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఇక్కడ జరిగే కార్నర్ మీటింగ్లో పాల్గొననున్నారు.
మండే ఎండల్లో నడవడం వల్ల మే 18న మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల నియోజకవర్గం నవాబ్ పేట మండలం రుక్కంపల్లి గ్రామంలో వడదెబ్బ, డీ హైడ్రేషన్ తో స్వల్ప అస్వస్థతకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గురయ్యారు. వైద్యుల సూచనతో 5 రోజులు విశ్రాంతి తరువాత మళ్లీ పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ఆయన మొదలు పెట్టారు.
అసలైన పాదయాత్ర
పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రారంభించిన నాటి నుంచీ ఇప్పటి వరకూ.. ఒక్కసారి కూడా వాహనాన్ని వినియోగించకుండా.. అసలైన పాదయాత్ర చేస్తూ కాంగ్రెస్ పార్టీకి కొత్త జవసత్వాలు కల్పిస్తున్నారు. భట్టి పాదయాత్రతో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోన్న తీరు కొంత బి ఆర్ ఎస్, బిజేపి లకు ఆందోళనకరంగా మారుతుంది. తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత కలహాలను వదిలి సీనియర్ నేతలంతా భట్టి పాదయాత్రలో ఒకే వేదికపై కనిపిస్తుండడం మరో విశేషం.