Nalgonda: రాక్షస పాలన సాగిస్తున్న బిజెపి: తమ్మినేని వీరభద్రం

మార్చి 17 నుండి 29 వరకు జ‌న‌చైత‌న్య యాత్ర‌లు.. మాడ్గుల‌ప‌ల్లిలో పార్టీ కార్య‌ల‌య భ‌వ‌నం ప్రారంభం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విధాత: కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తుందని, రాష్ట్రంలో అధికారం కోసం రాజకీయ వ్యభిచారానికి సిద్ధమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మాడుగులపల్లి మండల కేంద్రంలో నిర్మించిన నూతన సిపిఎం కార్యాలయ భవనాన్ని మంగళవారం ఆయ‌న ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వీరభద్రం మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి […]

Nalgonda: రాక్షస పాలన సాగిస్తున్న బిజెపి: తమ్మినేని వీరభద్రం
  • మార్చి 17 నుండి 29 వరకు జ‌న‌చైత‌న్య యాత్ర‌లు..
  • మాడ్గుల‌ప‌ల్లిలో పార్టీ కార్య‌ల‌య భ‌వ‌నం ప్రారంభం
  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

విధాత: కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తుందని, రాష్ట్రంలో అధికారం కోసం రాజకీయ వ్యభిచారానికి సిద్ధమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మాడుగులపల్లి మండల కేంద్రంలో నిర్మించిన నూతన సిపిఎం కార్యాలయ భవనాన్ని మంగళవారం ఆయ‌న ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వీరభద్రం మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశానికి ప్రమాదకరంగా మారిందన్నారు. మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతుందన్నారు.

బీజేపీది రాజకీయ వ్య‌భిచారం…

దేశాన్ని రావణకాష్టంగా మార్చాలన్న ఉద్దేశంతో కేంద్రం ఉందని ఈ ప్రమాదాన్ని కమ్యూనిస్టులు గుర్తించారన్నారు. కేంద్ర, రాష్ట్ర బీజేపీ నాయకులు తెలంగాణలో బిజెపి అధికారం చేపట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ నాయకులను బలంగా పనిచేయాలని, వివిధ పార్టీల నాయకులను లొంగదీసుకోని వారికి కాంట్రాక్టులు, డబ్బులు వంటి వాటిని అందించి పార్టీలో చేర్చుకోవాలని సూచించారని ఆరోపించారు. ఇలాంటి కార్యక్రమాలతో బీజేపీ రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతుందన్నారు. వివిధ పార్టీలలోని నాయకులను ఫిరాయింపులకు ప్రోత్సహించడానికి సిద్ధమైందన్నారు.

బీఆర్ ఎస్‌ను టార్గెట్ చేసిన బీజేపీ

బిజెపి అధికారంలోకి వస్తే వారి మనువాద సిద్ధాంతాలు అమలు చేస్తారన్నారు. వారి సిద్ధాంతం ప్రకారం దేశంలో హిందువులు మాత్రమే ఉండాలని మిగిలిన వారు రెండవ తరగతి పౌరులుగా గుర్తిస్తున్నారని అన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే హిందువుల దేశంగా ఉండాలని, మిగిలిన మతాల వారు ఉండే అవకాశంగా లేదని అన్నారు. ఈడి, సిబిఐలను ఉపయోగించి ప్రత్యక్షంగా ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారన్నారు. దానిలో భాగంగానే కవిత పై దాడి చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసిందన్నారు. బిజెపిని గద్దెదించాలని బిఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేయడంతో కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు.

15 రోజులు జ‌న‌చైత‌న్య యాత్ర‌లు..

మార్చి 17 నుండి 29 వరకు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వ బండారం బయట పెట్టడానికి 33 జిల్లాల్లో జన చైతన్య యాత్రలను 15 రోజులపాటు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఎర్రజెండా ప్రజా ఉద్యమాలు ప్రజాశక్తిగా ఎదుగుతున్నాయన్నారు. సిపిఎం కార్యాలయాలు ఉద్యమ కేంద్రాలుగా, పోరాటాల నిలయంగా, సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు సక్రమంగా జరిగేలా ప్రభుత్వంపై సీపీఎం ఒత్తిడి తెస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లో కమ్యూనిస్టుల పాత్ర ఎంతో అవసరం ఉందని, ఇటివల జరిగిన మునుగోడు ఎన్నికల ఫలితాలు రుజువు చేసిందన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలకు ప్రజలను చైతన్యం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చెరువుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, మండల కార్యదర్శి రొండు శ్రీనివాస్ జిల్లా నాయకులు డబ్బికార్ మల్లేశం, సయ్యద్ హశం, పాలడుగు నాగార్జున, ప్రభావతి, మహ్మద్ సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, నన్నూరి వెంకటరమణారెడ్డి, పద్మ, గోవర్ధన, గౌతమ్ రెడ్డి, రవి నాయక్, మంగారెడ్డి, రొండి శ్రీనివాస్, పుల్లెంల శ్రీకర్, మన్నెం బిక్షం, ఎర్ర కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.