బీజేపీ తన సిద్ధాంతాలను పక్కన పెట్టిందా? మోదీ నాయకత్వంపై విశ్వాసం సన్నగిల్లిందా? ఎన్నికల్లో గెలుపే ముఖ్యమని, అభ్యర్థి ఎవరైనా ఫరవాలేదని అనుకుంటున్నదా?
బీజేపీ తన సిద్ధాంతాలను పక్కన పెట్టిందా? మోదీ నాయకత్వంపై విశ్వాసం సన్నగిల్లిందా? ఎన్నికల్లో గెలుపే ముఖ్యమని, అభ్యర్థి ఎవరైనా ఫరవాలేదని అనుకుంటున్నదా? ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి, ప్రాంతీయపార్టీలను అడ్డుకోవడానికి చిన్న చిన్న పార్టీల మద్దతు తీసుకుంటున్నదా? అవినీతి ఆరోపణలతో పక్కనపెట్టిన వారిని అక్కర కోసం చేరదీస్తున్నదా? అంటే ఔననే సమాధానాలే వస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లే లక్ష్యంగా బీజేపీ అన్ని అస్త్రాలను వాడుకుంటున్నది. ఆదివారం విడుదల చేసిన ఐదో జాబితాలో ఆ పార్టీ ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 402కు చేరింది. ఇందులో చాలావరకు పార్టీలో చేరిన గంటల్లోనే టికెట్లు దక్కించుకున్న వారు కొందరైతే.. మోడీ-షా భజన పరులకే పెద్దపీట వేసినట్టు కనిపిస్తున్నది.
రాజ్యాంగంలో రాసున్న లౌకిక అనే పదం వారికి మింగుడు పడని అంశం. అందుకే రాజ్యాంగంలో ఆ పదాన్ని తొలిగించాలన్నది ఆర్ఎస్ఎస్, బీజేపీల రహస్య అజెండా అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జై బజరంగ్బలి, హిజాబ్ అంశాలనే ఆ పార్టీ ఎక్కువగా ప్రచారం చేసింది. వాటిని కాంగ్రెస్ పార్టీతో పాటు అక్కడి ప్రజాసంఘాలు, ప్రజాస్వామికవాదులు తిప్పికొట్టారు. ప్రజలు కూడా విద్వేషాలకు తావులేదని కాషాయ నేతలు కంగు తినేలా తీర్పు చెప్పారు. అయినా భారత దేశాన్ని హిందుత్వ దేశంగా మార్చాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ స్థానిక నేతలు మొదలు జాతీయ నాయకుల వరకు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని కొందరు నాయకులు బహిరంగంగానే వెల్లడించారు. అలాంటి వారిలో అనంతకుమార్కు హెగ్డే ఒకరు. 400 పైగా సీట్లుసాధిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనకు టికెట్ నిరాకరించింది. ఆయన వ్యాఖ్యలను పార్టీ ఖండించలేదు. ఆయనపై చర్యలు తీసుకోలేదు. కానీ టికెట్ మాత్రం ఇవ్వలేదు. కర్ణాటకలో యడ్యూరప్పపై లైంగిక వేధింపు ఆరోపణలు, బీజేపీ ప్రభుత్వ హయాంలో కమీషన్ల ఆరోపణలు, నేతలపై అవినీతి ఆరోపణలన్నీ సీట్లకు గండి కొడతాయనే అంచనాతో అనంతకుమార్ హెగ్డేను తాత్కాలికంగా పక్కనపెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా విపక్షాల విమర్శల నుంచి తప్పించుకోవడానికి, ప్రజలను ఏమార్చడానికి చేసే ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే ‘అవినీతిపరులను ఉపేక్షించం’ అని ఉపన్యాసాలు దంచుతూనే అక్రమ గనుల తవ్వకాల కేసులో బెయిల్పై ఉన్న గాలి జనార్దనరెడ్డి వంటివారిని పార్టీలో చేర్చుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో బళ్లారి, కొప్పళ, రాయచూరు, గదగ, హవేరీ జిల్లాల్లో ఓట్ల కోసం ఆయనను తిరిగి పార్టీలో చేర్చుకుంటున్నారన్నది బహిరంగ రహస్యమే.
కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేసిన వరుణ్ గాంధీని ఫిలిభీత్ స్థానం నుంచి బీజేపీ తప్పించింది. ఆదివారమే పార్టీలో చేరిన పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్కు హరియానాలోని కురుక్షేత్ర స్థానం కేటాయించింది. రామ మందిర ప్రారంభ సమయంలోనూ రాష్ట్రపతి, ఇంకా పార్టీలోని సీనియర్లను ప్రాధాన్యం ఇవ్వకుండా సినీ నటులకే ఎక్కువగా ప్రాముఖ్యం ఇచ్చిందనే విమర్శలున్నాయి. వాటికి బలం చేకూర్చే విధంగా హిందుత్వంపై బీజేపీకి మద్దతుగా మాట్లాడిన, కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రౌనౌత్కు టికెట్ ఇచ్చింది. అలాగే ఇటీవల జేఎంఎం నుంచి బీజేపీలో చేరిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్ను ఆ రాష్ట్రంలోని డుంకా స్థానం నుంచి రంగంలోకి దింపింది. ఆమెను పార్టీలోకి తీసుకోవడం వెనుక అక్కడి రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడంతో పాటు, ఆ రాష్ట్రంలోని ఎస్టీ ఓటర్లను బీజేపీ వైపు మళ్లించడం కోసమే అన్న విమర్శలున్నాయి.
బలమైన అభ్యర్థి ఏ పార్టీలో ఉన్నా నయానో భయానో పార్టీలో చేర్చుకోవడం, టికెట్ ఇవ్వడం అన్న మార్గాన్ని ఈసారి బీజేపీ అవలంబించిందనే అభిప్రాయాలు ఉన్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదన్నర ముందు నుంచి పార్టీలో చేరికలపై దృష్టి సారించి, ఎన్నికల్లో 25-30 సీట్లు దక్కించుకుంటే ప్రభుత్వంలో చేరే అవకాశాలు వస్తాయని ఆ పార్టీ పెద్దలు ఆశపడినా.. అవి సఫలం కాలేదు. దీంతో ఇక్కడ పాత, కొత్త నేతల మధ్య సమన్వయం సాధించడం, పార్టీని విజయతీరాలకు నడిపించడం సాధ్యం కాదని అర్థమైంది. అందుకే జహీరాబాద్, నాగర్కర్నూల్, ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబాబాద్, వరంగల్ స్థానాలకు బీఆర్ఎస్ నుంచి వచ్చిన అభ్యర్థులు, పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థే దిక్కయ్యారు.
బీజేపీలో చేరికలపై ఎన్సీపీ నేత సుప్రియా సూలే చేసిన వ్యాఖ్యలు వాస్తవమే అన్నట్టు ఉన్నాయి. ఆ పార్టీలో చేరుతున్న వారు ఇష్టంగా వెళ్లడం లేదని, ఐసీఈ.. ఇన్కం ట్యాక్స్, సీబీఐ, ఈడీ వల్లే చేరుతున్నారని అన్నారు. దానికి ఉదాహరణగా కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ ఆ పార్టీని వీడి బీజేపీలో చేరడాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. ఒకప్పుడు ఆయనపై బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఆయనను ఆ పార్టీలో చేర్చుకున్నారు. ఇలా వాళ్లు పార్టీలను చీల్చుతున్నారని, ఇది రాజకీయం కాదు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అని సుప్రియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యానించినట్టుగానే బీజేపీలో ఇప్పటివరకు ప్రకటించిన 400 పైగా అభ్యర్థుల్లో ఆ పార్టీ గతంలో అవినీతి ఆరోపణలు చేసిన వాళ్లు కొంతమంది, ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టుకోగలిగే నేతలు కొంతమందికి పెద్దపీట వేసిందనే ఆరోపణలున్నా అధికారం కోసం తప్పదు అన్నట్టు బీజేపీ అధిష్ఠాన పెద్దల ఆలోచనగా కనిపిస్తున్నదని అంటున్నారు.