విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో యాచకులు, బ్లేడ్ బ్యాచ్ వీరంగం చేశారు. వేకువజామున 4 గంటల ప్రాంతంలో అక్కడి పోలీసులు, ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేశారు
విధాత : విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో యాచకులు, బ్లేడ్ బ్యాచ్ వీరంగం చేశారు. వేకువజామున 4 గంటల ప్రాంతంలో అక్కడి పోలీసులు, ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేశారు. మద్యం తాగిన యాచకులు, బ్లేడ్ బ్యాచ్ బస్టాండ్లోని బెంచీలను ఆక్రమించుకుని నిద్రించారు. ప్రయాణికుల ఫిర్యాదుతో వారిని అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వారిని లేపడానికి ప్రయత్నించగా వారిపై దాడికి దిగారు.
ఒక్కసారిగా సుమారు వందమందికి పైగా పోలీసులపైకి, ఆర్టీసీ సిబ్బందిపైకి దూసుకువచ్చారు. బ్లేడ్లతో దాడికి యత్నించడంతో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది పరుగులు పెట్టారు. ఈ ఘటనలో సాంబయ్య అనే ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ గొడవ సమాచారం అందుకుని, అదనపు పోలీసు బలగాలు అక్కడికి చేరుకోగా నిందితులు పరారయ్యారు. దాడికి పాల్పడిన వారిలో కొందరిని పట్టుకుని స్టేషన్కు తరలించారు. రైల్వేస్టేషన్లోకి రైల్వే పోలీసులు యాచకులను, బ్లేడ్ బ్యాచ్ ను రానివ్వకపోవడంతో వారంతా బస్టాండ్కు వస్తున్నారు. అక్కడి నుంచి కూడా తమను బయటకు పంపడాన్ని నిరసిస్తూ వారు దాడికి దిగారు.