BRS dominant in self defense ఆలస్యమైనా అవకాశాన్ని వదులుకోని బీఆర్ఎస్ నోరు జారినందుకు చెల్లించిన మూల్యం గులాబి ఎత్తుగడలో చిక్కుకున్న బండి గవర్నర్ను లాగిన మహిళా నాయకులు విధాత: ఆత్మ రక్షణలోనూ ఆధిపత్యాన్ని కొనసాగించడం అంటే ఎలాగో గులాబీ పార్టీ రుజువు చేస్తోంది. ముఖ్యమంత్రి బిడ్డ, ఎమ్మెల్సీ(MLC), భారత జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(KAVITHA) ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor scam)లో భాగస్వామ్యం ఉందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గత రెండు రోజులుగా గులాబీ […]
BRS dominant in self defense
విధాత: ఆత్మ రక్షణలోనూ ఆధిపత్యాన్ని కొనసాగించడం అంటే ఎలాగో గులాబీ పార్టీ రుజువు చేస్తోంది. ముఖ్యమంత్రి బిడ్డ, ఎమ్మెల్సీ(MLC), భారత జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(KAVITHA) ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor scam)లో భాగస్వామ్యం ఉందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గత రెండు రోజులుగా గులాబీ పార్టీ కాసింత డిఫెన్స్ లోకి వెళ్ళింది.
కవితపై ఆరోపణలు వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)గానీ మంత్రి కేటీఆర్(KTR) గానీ చాలా రోజులు ప్రతిస్పందించలేదు. ఈడీ(ED) విచారణ నేపథ్యంలో ముందు రోజు కేటీఆర్ నోరు విప్పారు. బిజెపిపై విమర్శలు చేశారు. సిబిఐ(CBI) మోడీ(Modi) చేతిలో కీలుబొమ్మ, ఈడి ప్రధాని చేతిలో తోలుబొమ్మ అంటూ ఆరోపించిన విషయం తెలిసిందే.
బిజెపి, బీఆర్ఎస్ మధ్య నెలకొన్న రాజకీయ ఆధిపత్య పోటీలో భాగంగానే కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరికించారనే ఆరోపణలు ఆ పార్టీ చేస్తున్నప్పటికీ లిక్కర్ స్కాం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఒక విధంగా ఆ పార్టీ ఆత్మరక్షణకు లోనయింది. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రధాన నాయకులు మాట్లాడేందుకు కూడా కాస్త వెనకంజ వేశారు.
పైకి బీజేపీని విమర్శిస్తున్నప్పటికీ, తమను తాము రక్షించుకునేందుకు నానా ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఈ స్థితిలో శనివారం ఈడి ముందు విచారణకు కవిత హాజరయ్యారు. శనివారం నాటికి కూడా ఆ పార్టీ నాయకుల ప్రకటనలు మేకపోతు గాంభీర్యాన్ని తలపించాయి. కవిత అరెస్టు తప్పదనే వార్తలు ఆ పార్టీ నాయకుల నుంచి వెలువడ్డాయి.
అంతకుముందు రోజు శుక్రవారం ఢిల్లీలో జరిగిన మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయాలని జాగృతి ధర్నాకు రాష్ట్ర మంత్రులు సబిత, సత్యవతి మరి కొంతమంది మహిళా నాయకులు హాజరయ్యారు. కవిత విచారణ నేపథ్యంలో వారు అక్కడే మకాం వేశారు. కవిత సోదరుడు రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరో మంత్రి హరీష్ రావు, మరికొందరు ముఖ్య నాయకులు, ప్రధానమైన లాయర్లు ఢిల్లీకి తరలి వెళ్లారు. ఈడీ విచారణ నేపథ్యంలో ఏం జరుగుతుందో అని ఆసక్తి నెలకొంది.
ఈ స్థితిలో వారికి చేతి కందిన పండులా ఓ చక్కని అవకాశం అంది వచ్చింది. 8వ తేదీ మహిళా దినోత్సవం సందర్భంగా బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ కవితను అరెస్టు చేయకుంటే ముద్దు పెట్టుకుంటారా? అని కామెంట్ చేశారు. వాస్తవానికి 8వ తేదీ బిజెపి పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ మాటలు మాట్లాడారు. ఆ మాటలు మాట్లాడిన నాలుగవ రోజు అంటే 11వ తేదీన ఈడీ విచారణకు కల్వకుంట్ల కవిత హాజరయ్యారు.
ఒకవైపు ఢిల్లీలో ఈడీ విచారణతో ఏం జరుగుతుందనే రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఇదే అదునుగా ఎనిమిదో తేదీన బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఒక్కసారిగా బయటికి తీశారు. బిజెపి వ్యతిరేక ధర్నాలను ఆకస్మికంగా చేపట్టి సంజయ్ పై టిఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. కవిత విచారణ నేపథ్యంలో ఈ కుంభకోణంలో ఆమె పాత్ర తదితర అంశాలన్నీ పక్కకు వెళ్లి పోయాయి. బండి సంజయ్ మాట్లాడిన అంశాలను ప్రధానం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ చేపట్టిన ఆందోళనతో పరిస్థితిని ఒక్కసారిగా వేడెక్కింది.
ఈ విషయంలోకి గవర్నర్ను సైతం లాగే ప్రయత్నం చేశారు. తమ వినతిపత్రం తీసుకోవాలంటే రాజభవన్ ముందు టిఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్లు కొత్త ఆందోళనకు తెర తీశారు. ఇదే సమయంలో ప్రతి విషయంపై స్పందించే గవర్నర్ తమిళసై మహిళను కించపరుస్తూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడాలంటూ ఢిల్లీలో మంత్రి సత్యవతి మాట్లాడారు.
ఈ విషయంలో గవర్నర్ను కూడా తమ రాజకీయ ఆటలో పావుగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో గవర్నర్ కొన్ని విషయాల్లో వేగంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు బండి సంజయ్ కామెంట్ విషయంలో ఆమెను ఇరుకున పెట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఆ విషయాలను గుర్తు చేస్తూ ఈ సమయంలో ఆమె తీరును ప్రశ్నించడం గమనార్హం.
బండి సంజయ్ చేసిన కామెంట్ వాస్తవానికి ఒక సామెతగా చెప్పినప్పటికీ అవతలి వ్యక్తి మహిళ కావడం వల్ల వాడిన సందర్భం తప్పకుండా తప్పుకు దారితీస్తోంది. దీంతో బిజెపిలోని కొన్ని వర్గాలు కూడా సంజయ్ వ్యాఖ్యల పట్ల అసంతృప్తితో ఉన్నారు. మహిళను కించపరుస్తూ మాట్లాడడం సరైనది కాదని అభిప్రాయం లోలోపల వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంలో బేషజానికి పోకుండా బండి సంజయ్ స్పందిస్తే అధికార పక్షానికి అవకాశం లేకుండా పోయేది. కానీ రెండు రాజకీయ పార్టీల మధ్య నెలకొన్న తీవ్ర విభేదాల నేపథ్యంలో ఆయన కూడా తన కామెంట్ పట్ల ఆశించిన స్థాయిలో ముందుకు రాకపోవడం బి ఆర్ ఎస్ కు మరింత కలిసొచ్చింది. రేపటి వరకు పరిస్థితి ఎలా ఉన్నా ఈరోజుకు మాత్రం గులాబీల ఎత్తు ఫలించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బండి సంజయ్ వ్యాఖ్యలపై ముందు నిరసనలు హైదరాబాద్కు పరిమితం కాగా క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో బిజెపిని బండి సంజయ్ని టార్గెట్ చేస్తూ టిఆర్ఎస్ ఆందోళనకు సిద్ధం కావడం గమనార్హం. మొత్తంగా గులాబీ ఎత్తుల్లో కమలం నాయకుడు చిక్కుకొని గిలగిలలాడే పరిస్థితి నెలకొంది.