కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ పాలనలో అన్ని రకాల ధరలు పెరిగిపోయాయని, ఓట్ల కోసం వచ్చే ఆ పార్టీ నేతలను ప్రజలు నిలదీయాలని బీఆరెస్ మాజీ మంంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే టి. హరీశ్రావు పిలుపునిచ్చారు
హామీలు చేయని కాంగ్రెస్ను ఓడించండి
బీఆరెస్ మాజీ మంత్రి టి.హరీశ్రావు
విధాత : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ పాలనలో అన్ని రకాల ధరలు పెరిగిపోయాయని, ఓట్ల కోసం వచ్చే ఆ పార్టీ నేతలను ప్రజలు నిలదీయాలని బీఆరెస్ మాజీ మంంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే టి. హరీశ్రావు పిలుపునిచ్చారు. కొడంగల్లో ఏర్పాటు చేసిన మహబూబ్నగర్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో హరీశ్రావు పాల్గొని ప్రసంగించారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వ పాలనలో పెట్రోల్ డిజీల్ ధర పెంచిందని,అదే విధంగా గ్యాస్ సిలిండర్ ధర రూ. 1000 పెంచారని, ఎన్నికలు వచ్చాయని ఇటీవల 100తగ్గించారని, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని విమర్శించారు.
దేశంలో ఆకలి నిరుద్యోగం, పేదరికం పెరిగిందన,ఇ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఇవ్వలేదని, నల్లధనం తెచ్చి పేదల్లో ఖాతాల్లో వేస్తామని వేయలేదన్నారు. నల్లచట్టాలతో రైతుల మరణాలకు కారణమైందని దుయ్యబట్టారు. బీజేపీ నాయకులకు చెప్పుకోవడానికి పథకాలు లేవు కనుక రాముడి చిత్రపటాలు, క్యాలెండర్లు, బ్యాగులు, చీరలు పంచుతున్నారని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు ఇస్తే.. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదని, దేశంలోని ఆయా రాష్ట్రాలకు 157 నర్సింగ్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు మొండి చేయి చూపించారన్నారు.
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకుండా మోసం చేసిందని ఆరోపించారు. గత ఎంపీ ఎన్నికల్లో ప్రధాని మోదీ మహబూబ్నగర్ వచ్చి పాలమూరు – రంగారెడ్డి పూర్తి చేస్తామని చెప్పి కనీసం అనుమతి ఇవ్వలేదని, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, బీజేపీ నాయకులు మాటలతో మాయ చేయాలని చూస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు హరీశ్రావు సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, 420హామీలతో అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. కరువు, సాగుతాగునీటితో రైతులు, ప్రజలు ఇబ్బంది పడుతుంటే చర్యలు తీసుకోకుండా అసమర్ధ పాలన సాగిస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు సాగక మద్ధతు ధర లభించక రైతులు తిప్పలు పడుతున్నారని విమర్శించారు.
పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించడం ద్వారా వారు ఇచ్చిన హామీలు చేసేలా చేయాలన్నారు. గెలిచినా.. ఓడినా ప్రజల మధ్య ఉండే పార్టీ బీఆరెస్ పార్టీ అని, ఓడిపోతే ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు పోరాడుతున్నామన్నారు. ప్రజల కోసం పని చేసే పార్టీ బీఆరెస్ను పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించాలన్నారు. పదేండ్ల బీఆరెస్ పాలన ప్రజలు చూశారని, బీఆరెస్ చేసింది అని అడిగితే 100 స్కీమ్లు చెప్తారని, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి.. ఇలా వంద పథకాల పేర్లు మీరు చెప్పగలుగుతారు అని హరీశ్రావు తెలిపారు. మరి బీజేపీ ఏం చేసిందో చెప్పగలుగుతారా అంటూ ప్రశ్నించాలని కోరారు.