Chada vs. Kancherla విధాత: నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో బిఆర్ఎస్ సీటింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి, వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న నాయకులు చాడా కిషన్ రెడ్డి, పిల్లి రామరాజులకు మధ్య రగులుతున్న గ్రూప్ వార్ తరచూ ఫ్లెక్సీ వార్, వాల్ రైటింగ్, వాల్ పోస్టర్ల వార్ రూపంలో రచ్చకెక్కుతుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యర్శి చాడా కిషన్ రెడ్డి నల్గొండ పట్టణంతోపాటు నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రచార […]
Chada vs. Kancherla
విధాత: నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో బిఆర్ఎస్ సీటింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి, వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న నాయకులు చాడా కిషన్ రెడ్డి, పిల్లి రామరాజులకు మధ్య రగులుతున్న గ్రూప్ వార్ తరచూ ఫ్లెక్సీ వార్, వాల్ రైటింగ్, వాల్ పోస్టర్ల వార్ రూపంలో రచ్చకెక్కుతుంది.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యర్శి చాడా కిషన్ రెడ్డి నల్గొండ పట్టణంతోపాటు నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రచార పోస్టర్లను వేయించారు. చాడా పోస్టర్లపై తాజాగా ఓ ప్రైవేట్ క్లినిక్ కు సంబంధించిన పోస్టర్లను అతికించారు. చాడ పోస్టర్లు ఉన్న జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గ గ్రామాల్లోనూ అన్ని చోట్ల చాడ పోస్టర్లపై ప్రైవేట్ క్లినిక్ పోస్టర్లు వేశారు.
ఈ వ్యవహారం పనిగట్టుకుని చేసిందేనని, దీని వెనక చాడా రాజకీయ ఎదుగుదల ఓర్వలేని ఎమ్మెల్యే కంచర్ల వర్గీయుల ప్రమేయం ఉండవచ్చని చాడా అనుచరులు అనుమానిస్తున్నారు. గతంలోనూ తమ నాయకుడు చాడా జన్మదిన వేడుకల వేళ వేసిన పోస్టర్లపై ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల పోస్టర్ల ను వేయించారని, ఇటీవల తమ వాల్ రైటింగ్స్ పై కలర్లు వేసి కంచర్ల వాల్ రైటింగ్స్ చేశారని, ఇదంతా రాజకీయ దురుద్దేశంతో కంచర్ల వర్గీయులు జరిపిస్తున్నారని చాడ వర్గీయులు మండిపడుతున్నారు.
గతంలో బిఆర్ఎస్ నేత పిల్లి రామరాజు పోస్టర్ల పైన, వాల్ రేటింగ్స్ పైన కూడా కంచర్ల వర్గం ఇదే రీతిలో రాజకీయ అక్కసు వెళ్లగక్కిందని, మళ్లీ చాడ పోస్టర్లపై కూడా అదే రీతిలో వ్యవహరించారని చాడా వర్గీయులు ఆరోపిస్తున్నారు.
ఇటీవల రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల మున్సిపాలిటీ ప్రచార ఫ్లెక్సీలోనూ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటో లేకుండా ఏర్పాటు చేయడం, దీనిపై వివాదం రేగడంతో గుత్తా ఫోటోతో మరో ప్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది.
పార్టీ ఆవిర్భావం నుండి క్రమశిక్షణ గల సైనికుడిగా, పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కు విధేయుడుగా ఉంటూ… ఎవరికి ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ ఇచ్చినా పార్టీ గెలుపు కోసం పనిచేస్తూ వచ్చామని చాడా వర్గీయులు గుర్తు చేస్తున్నారు.
పక్క పార్టీ నుండి వచ్చి, బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కంచర్లను అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు గెలిపించడంలో చాడా, ఆయన వర్గం తమ వంతు కృషి చేశారని, అలాంటి తమ నాయకుడు కిషన్ రెడ్డి ప్రచార పోస్టర్ల పట్ల కంచర్ల వర్గీయుల దిగజారుడు వైఖరి సహించలేకపోతున్నామన్నారు. కంచర్ల వర్గీయులు తమ తీరు మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామంటూ చాడా వర్గీయులు హెచ్చరిస్తున్నారు.