CM KCR విధాత ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రేపు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేయనున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవం చేయనున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆదివాసి గిరిజనులు ఎదురుచూస్తున్న పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుండి ప్రారంభించనున్నారు . ముఖ్యమంత్రి కేసీఆర్ కొమరం […]
CM KCR
విధాత ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రేపు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేయనున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవం చేయనున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆదివాసి గిరిజనులు ఎదురుచూస్తున్న పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుండి ప్రారంభించనున్నారు .
ముఖ్యమంత్రి కేసీఆర్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూముల పట్టాలు పంపిణీ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసి గిరిజనులు ఏ ఏ ప్రాంతాలలో పోడు వ్యవసాయం చేసుకుంటూ ఫల సాయం అనుభవిస్తున్నారో వారందరికీ రేపటినుండి ఆయా ప్రాంతాల ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు పోడు భూములకు సంబంధించిన పట్టాలు పంపిణీ చేయనున్నారు.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 15 479 మంది ఆదివాసి గిరిజనులు పోడు పట్టాల కోసం దరఖాస్తు చేసుకోగా 12474 మంది ఆదివాసులను అర్హులుగా ప్రకటించారు . వీరికి 35 వేల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇవ్వనున్నారు. గతంలో 12 వేల ఎకరాలకు పాత పట్టాలను ఇవ్వరున్నారు . మొత్తం 47 వేల ఎకరాల భూమికి పోడు పట్టాలిచ్చే సమయం ఆసన్నమైంది.
పోడు భూముల వ్యవసాయం ఆదివాసి గిరిజనులకు ప్రతి సంవత్సరం ఒక రణరంగాన్ని తలపించేది. ప్రతి వర్షాకాలంలో ఆదివాసీ గిరిజనులు పోడు భూముల్లోకి వ్యవసాయానికి వెళ్తున్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అడ్డు కోవడం పరిపాటిగా మారిపోయింది . ఇరువు వర్గాల మధ్య గొడవలు దాడులు నెలకొన్న సందర్భాలు ఉన్నాయి.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సారేగాన్ అనే గ్రామంలో అటవీశాఖ అధికారులపై చేసిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆదివాసీలు దాడి చేశారని పలువుర పై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేసి జైలుకు పంపిన దాఖలాలు ఉన్నాయి. ఆదివాసీలు ప్రతి వర్షాకాలం సీజన్ లో పోడు భూముల్లో వ్యవసాయం చేయడానికి అనేక ఇబ్బందులకు గురయ్యేవారు. ఎక్కడినుండి ఎవరు అటవీశాఖ అధికారులు అడ్డుకుంటారో అని ఆందోళన పడుతూ వ్యవసాయం చేసేవారు.
కొన్ని ప్రాంతాలలో పోడు వ్యవసాయాన్ని అటవీశాఖ అధికారులు అడ్డుకోవడం ఆదివాసీలు ప్రతి ఘటించడం అడవుల జిల్లా అదిలాబాదులో సర్వసాధారణంగా మారింది. ఏది ఏమైనప్పటికీ ఇన్ని సంవత్సరాల ఎదురుచూపుకు ఏట్టకేలకు పట్టాల పట్టాభిషేకం కలుగుతుందని ఆదివాసీ గిరిజనులు ఆనందంలో ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వేదికగా పలు నూతన సంక్షేమ పథకాలను ప్రకటించడం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వేదికగా ఆచరణలో పెట్టడం ఒక ఆనవాయితీగా కొనసాగుతుంది.
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వేదికగా ప్రకటించిన కొన్ని సంక్షేమ పథకాలు రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న నేపథ్యం కనబడుతుంది .ఇందులో భాగంగా గత నెల రోజుల క్రితం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ వేదికగా మంచిర్యాల నుండి కుల వృత్తులు చేసుకునే వారికి బీసీ బంద్ అనే సంక్షేమ పథకాన్ని ప్రారంభించడంతోపాటు అలాగే దివ్యాంగుల కు వెయ్యి రూపాయల పెన్షన్ అదనంగా పెంచుతున్నట్లు ప్రకటించడం రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల్లో ఆనందం నెలకొంది.
రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భాగమైన కొమురం భీం ఆసిఫాబాద్ లో ఆదివాసి గిరిజనులకు పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నుండే పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేయడం ప్రత్యేకత సంతరించుకుంది.
ఇక్కడ పోడు భూముల పట్టాల పంపిణీ జరిగిన మరుక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసి గిరిజనులు ఉన్న ప్రాంతంలో సంబంధిత ఎమ్మెల్యేలు పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయనున్నారు.. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని ఇక్కడ నుండే పలు కొత్త స్కీములకు అమలు చేయడం తో ఇక్కడి ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.