Dharani ధరణి వెనుక మాఫియా విదేశీయుల చేతుల్లోకి తెలంగాణ… పౌరుల, భూముల జాబితా కేటీఆర్ సన్నిహితుడైన… శ్రీధర్ రాజు గుప్పిట్లో ధరణి కేసీఆర్ అంటేనే.. కిషన్ చంద్రశేఖర్ రావు అధికారమిస్తే టైటిల్ గ్యారంటీ చట్టం 100 రోజుల్లోనే రెవెన్యూ సదస్సులు మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణలో భూ సమస్యల పరిష్కారానికై 11 అంశాలతో కాంగ్రెస్ భూమి డిక్లరేషన్ విడుదల విధాత, హైదరాబాద్ ప్రతినిధి: ఈ నెల 15వ తేదీ నుంచి సీరియల్గా ధరణి […]
Dharani
విధాత, హైదరాబాద్ ప్రతినిధి: ఈ నెల 15వ తేదీ నుంచి సీరియల్గా ధరణి ఫైల్స్ను విడుదల చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ అన్నారు. ధరణి వెనుక పెద్ద మాఫీయా దాగుందన్నారు. కేటీఆర్ను ఉద్దేశించి యువరాజు అని సంబోధించిన రేవంత్ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నధరణి కేటీఆర్ స్వేహితుడైన శ్రీధార్ రాజు చేతుల్లో ఉందన్నారు.
ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలతో సీరియల్గా బయటపెడుతామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గురువారం గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి, నాయకులు కోదండ రెడ్డి, సంపత్ తదితరులు కాంగ్రెస్ పార్టీ భూమి డిక్లరేషన్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ధరణి వ్యవహారంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
ప్రజలకు, మీడియాకు ధరణికి సంబంధించి టెర్రాసిస్ కంపెనీ మాత్రమే కనిపిస్తోందన్నారు. కానీ ఇప్పటికే తెలంగాణ ప్రజల ఆస్తులు, భూములు, వ్యక్తిగత వివరాలు విదేశీయుల చేతుల్లోకి వెళ్తున్నాయన్నారు. ధరణిలో బ్రిటిష్ ఐల్యాండ్ కు సంబంధించిన పెట్టుబడులున్నాయన్నారు. దారిదోపిడీ దొంగలకంటే భయంకరమైన దోపిడీ ధరణితో జరుగుతోందన్నారు.
తెలంగాణలో లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు మాయం అవుతున్నాయని, అన్ని వివరాలు తమ వద్ద ఉన్నాయన్న రేవంత్ ధరణి పోర్టల్ నిర్వహణ విదేశీయుల చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యవహారం అన్నారు.
గజ్వేల్ లో 1500 ఎకరాల అసైన్డ్ భూములను చట్టవిరుద్దంగా ప్రభుత్వం తీసుకుందన్నారు. ఏపీలో వెళ్లగొట్టిన అమూల్ డైరీకి తెలంగాణలో వందల ఎకరాలను కట్టబెట్టారనన్నారు. అలాగే గంగుల కమలాకర్ కు భూములు కేటాయించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి రంగారెడ్డి జిల్లాలో దేవాదాయ భూములను ఫార్మా కంపెనీలకు కట్టబెట్టారన్నారు.
కాంగ్రెస్ పార్టీ ధరణిని రద్దు చేస్తామనగానే కేసీఆర్ పూర్వికులకు భూకంపం వచ్చినట్లుగా, సర్వం కోల్పోయినట్లుగా కేసీఆర్, కేటీఆర్ హృదయ విదారకంగా ఏడుస్తున్నారన్నారు. రైతుల మద్దతుతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ఒప్పుకున్నట్లేనని రేవంత్ అన్నారు. కేసీఆర్ చీకటి నేర సామ్రాజ్యంలో వ్యక్తుల ఒప్పందాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయని, ఆర్థిక ప్రాణ భయం ఉన్నట్లుగానే ధరణి రద్దు చేస్తామంటే తండ్రీ కొడుకులు పెడబొబ్బలు పెడుతున్నారని రేవంత్ ఎద్దేవ చేశారు.
ధరణి దోపిడీలపై అన్ని ఆధారాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానని తెలిపిన రేవంత్ ధరణిలో పెట్టుబడిదారులపై కేంద్ర ప్రభుత్వం నిగ్గు తేల్చాలని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, మాజీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. కేసీఆర్ అంటేనే.. కిషన్ చంద్రశేఖర్ రావు అని హేళన చేసిన రేవంత్ కేసీఆర్ ధరణి దోపిడీలపై స్పందించాలన్నారు.
కేటీఆర్ ఢిల్లీ పర్యటనతో బీజేపీ, బీఆరెస్ ఫెవికాల్ బంధం మరింత బలోపేతమైందన్నారు. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎన్నికల అభ్యర్థులను మొట్టమొదట ప్రకటించాలని పార్టీలో చర్చలు జరిపామని తెలిపిన రేవంత్, పేదల పక్షాన కాంగ్రెస్ ఉందని, ఆ దిశగా అధిష్టానం ఆదేశాలు ఇచ్చిందన్నారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఫిరాయింపుల కమిటీ నుంచి ఎన్నికల కమిటీకి మార్చారని ఎద్దేవ చేసిన రేవంత్ ఈటలకు భద్రత పెంపుపై హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈటలకు అపాయం ఉందని చెప్పిన తెలంగాణ పోలీసులు అపాయం కలిగించే వ్యక్తులపై నేటి వరకు ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ను బీజేపీ మోసం చేసిందన్నారు.
ఎవ్వరి వల్ల అపాయం ఉందో రాజేందర్ స్పష్టంగా చెప్పారని, కానీ నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టలేదన్నారు. నా రక్షణ విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోని ప్రభుత్వం ఈటల రాజేందర్ కు భద్రత ఏర్పాటు చేయడం సంతోషం అన్నారు.
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే గ్రామ గ్రామాన రెవెన్యూ సదస్సులను నిర్వహించడంతో పాటు టైటిల్ గ్యారంటీ చట్టంను తీసుకువస్తామన్నారు. అలాగే తప్పుల తడకగా మారిన ధరణి ని రద్దు చేసి భూమి వాస్తవ పరిస్థితికి అద్దంపట్టేలా తప్పులు లేని కొత్త కంప్యూటర్ రికార్డును రూపొందించి రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
తెలంగాణలో భూ సమస్యల పరిష్కారం కోరకు 11 అంశాలతో కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ‘‘కాంగ్రెస్ భూమి డిక్లరేషన్’’ను గురువారం రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి విడుదల చేశారు.
– “ధరణి” లో తప్పుల వలన లక్షల మంది రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ధరణి వ్యవస్థను రద్దుచేసి నూతన కంప్యూటర్ రికార్డును రూపొందిస్తాం. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తాం.
– నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములను కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన 100 రోజుల్లోగా తొలగిస్తాం.
– అన్ని రకాల భూముల సమగ్ర సర్వే చేసి కొత్త రికార్డులు రూపొందిస్తాం. వ్యవసాయ భూములకు, ఇంటి స్థలాలకు కొత్త పట్టాలు ఇస్తాం. భద్రమైన హక్కులు కల్పిస్తాం.
– కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జరిగే తొలి శాసన సభా సమావేశం లోనే గతంలో యూపీఏ ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా మేరకు టైటిల్ గ్యారంటీ చట్టం చేసి ప్రభుత్వమే భూమి హక్కులకు పూర్తి హామీ ఇచ్చే వ్యవస్థను తెస్తాం.
– వందకు పైగా ఉన్న భూచట్టాల స్థానంలో ఒకే భూమి చట్టం తెస్తాం.
– కౌలుదారులకు ఋణ అర్హత కార్డులు ఇచ్చేందుకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన అధీకృత సాగుదారుల చట్టాన్ని అమలు చేస్తాం.
– కాంగ్రెస్ తెచ్చిన భూ సంస్కరణల ద్వారా ఇప్పటి వరకు పేదలకు పంచిన పాతిక లక్షల ఎకరాల భూములపై సంపూర్ణ హక్కులు కల్పిస్తాం.
– 2006 లో కాంగ్రెస్ తెచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి అర్హులందరికీ పోడు భూములకు పట్టాలు ఇస్తాం.
– కేంద్రం లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టాన్ని యధాతథంగా అమలు చేస్తాం.
– రైతుల అనుమతి లేకుండా భూములు సేకరించం. అసైన్డ్ భూములకు, పోడు భూములకు కూడా పట్టా భూములతో సమానంగా నష్ట పరిహారం చెల్లిస్తాం. ఇప్పటి వరకు అలా నష్ట పరిహారం రాని వారికి న్యాయం చెయ్యడానికి రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యం లో కమీషన్ ఏర్పాటు చేస్తాం..
– భూపరిపాలన వ్యవస్థను బలోపేతం చేస్తాం. గ్రామ నుండి రాష్ట్ర స్థాయి వరకు సిబ్బందిని నియమించి రైతులకు హక్కుల చిక్కులు లేకుండా చేస్తాం.
– భూ సమస్యల పరిష్కారానికి జిల్లాకొక భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం.