తాను బీజేపీలోకి చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై బీఆరెస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. తాను బీజేపీలో చేరుతున్నాననడం అవాస్తవమని స్పష్టం చేశారు
విధాత : తాను బీజేపీలోకి చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై బీఆరెస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. తాను బీజేపీలో చేరుతున్నాననడం అవాస్తవమని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యమాన్ని నమ్ముకొని, పార్టీని నమ్ముకొని ముందడుగు వేశామని తెలిపారు. ఆ రోజుల్లో బెదిరించినా భయపడకుండా పోరాటాలు చేశామని గుర్తు చేశారు.
ఎంతోమంది తెలంగాణ ఉద్యమాన్ని నాయకత్వాన్ని అణచివేయాలని చూశారన్నారు. తెలంగాణ గడ్డపై ఎన్నో ఉద్యమాలు పుట్టాయని.. రాబోయే రోజుల్లో బహుజన ఉద్యమం కూడా పుట్టబోతుందని తెలిపారు. బహుజనులకు అండగా ఉండే పార్టీ బీఆరెస్ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కుట్రలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని, కొందరు పార్టీ నుంచి లాభం పొంది ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారని తెలిపారు. మూడు నెలలుగా బహుజన నాయకులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. కేసీఆర్ను టార్గెట్ చేయడంలో భాగంగానే కవితను అరెస్టు చేశారన్నారు. ప్రలోభాలు పెట్టినప్పటికీ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ లొంగలేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బీఆరెస్ పార్టీ బహుజనుల కోసం పోరాడుతుందనే ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బీఆర్ఎస్లో చేరారని పేర్కొన్నారు.