Telangana | మేం కలిసే పోటీ చేస్తాం.. సీపీఐ, సీపీఎం ఉమ్మడి భేటీలో నిర్ణయం

Telangana అక్టోబర్ 1న మళ్లీ సమావేశం వెల్లడించిన కూనంనేని.. తమ్మినేని విధాత : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఐ(ఎం) కలిసే పోటీ చేస్తాయని, ప్రజా సమస్యలపైనా ఉమ్మడి పోరాటం చేస్తాయని ఆయా పార్టీల రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం చెప్పారు. గురువారం హైద్రాబాద్‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో రెండు పార్టీల ఉమ్మడి సమావేశం నిర్వహించగా ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వైఖరి, పొత్తులపై చర్చించారు. అనంతరం సమావేశ వివరాలను మీడియాకు కూనంనేని, […]

  • By: Somu    latest    Sep 21, 2023 12:14 PM IST
Telangana | మేం కలిసే పోటీ చేస్తాం.. సీపీఐ, సీపీఎం ఉమ్మడి భేటీలో నిర్ణయం

Telangana

  • అక్టోబర్ 1న మళ్లీ సమావేశం
  • వెల్లడించిన కూనంనేని.. తమ్మినేని

విధాత : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఐ(ఎం) కలిసే పోటీ చేస్తాయని, ప్రజా సమస్యలపైనా ఉమ్మడి పోరాటం చేస్తాయని ఆయా పార్టీల రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం చెప్పారు. గురువారం హైద్రాబాద్‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో రెండు పార్టీల ఉమ్మడి సమావేశం నిర్వహించగా ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వైఖరి, పొత్తులపై చర్చించారు. అనంతరం సమావేశ వివరాలను మీడియాకు కూనంనేని, తమ్మినేనిలు వెల్లడించారు.

కూనంనేని మాట్లాడుతూ రెండు పార్టీలు ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయని, అయితే ఏయే సీట్లలో పోటీ చేయాలన్న చర్చలు కొలిక్కి రాలేదన్నారు. వచ్చేనెల ఒకటిన మళ్లీ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించామని, అందులో ఉమ్మడిగా పోటీ చేసే సీట్లపై చర్చించి ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌తో పొత్తు అంశం చర్చకు రాలేదని, అయితే ఆ పార్టీతో తాము పొత్తు వద్దనుకోవడం లేదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ సీట్లు ఇస్తుందంటూ ఊహాగానాలు వద్దనీ, కలిసి మాట్లాడినప్పుడు చర్చ వస్తుందన్నారు. అంగన్వాడీ కార్మికులపై పోలీసులు దాడి చేయడం సరైంది కాదన్నారు. సమ్మె చేస్తే కొడతారా? అని ప్రశ్నించారు. సమ్మె చేస్తే ఉద్యోగంలోకి తీసుకోబోమంటూ ప్రభుత్వం చెప్పడం దారుణమని అన్నారు. ఉద్యమాల ద్వారా ఏర్పడిన తెలంగాణలో ఉద్యమాలు చేస్తున్న వారిని అణచివేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఎంఐఎంతో కేసీఆర్ కు మంచి సఖ్యత ఉందన్నారు.

సమైక్యతా దినోత్సవమంటే ఏమిటో ఎంఐఎం నేతలు, కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. థర్డ్ ఫ్రంట్ పెట్టాలంటూ కేసీఆర్ ను ఎంఐఎం అడుగుతుందన్నారు. అందరి మీద దాడులు చేసే బీజేపీ ప్రభుత్వం ఎంఐఎం మీద ఒక్క కేసు ఎందుకు పెట్టడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను మోసం చేయడంలో బీజేపీ ఆరితేరిందని విమర్శించారు. జనాలను మభ్యపెట్టడానికే మహిళా బిల్లును తెచ్చిందన్నారు.

రాష్ట్రపతి విధవ కావడం వల్లే కొత్త పార్లమెంటు ఆమెతో ప్రారంభించలేదని చెప్పారు. రాజ్యాంగ పీఠిక గుండెకాయలాంటిదని అన్నారు. అందులో నుంచి సామ్యవాదం, లౌకికవాదం పదాలను ఎలా తొలగిస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయు ప్రశ్నించారు. హిందూరాజ్యంగా చేయడం కోసమే బీజేపీ ఇలాంటివి చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. బీజేపీ కూటమి వచ్చే ఎన్నికల్లో ఓటమిపాలవుతుందన్నారు.

తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ మహిళా బిల్లు వెంటనే అమల్లోకి వచ్చేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అమలు చేయడమంటే ఎన్నికల్లో లబ్దికోసమే మహిళా బిల్లును తెచ్చినట్టుగా ఉందన్నారు. మహిళలను ఉద్దరించే ఉద్దేశం మోడీ ప్రభుత్వానికి లేదని విమర్శించారు.

మహిళా బిల్లులో ఓబీసీ కోటా ఉండాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించారు. సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి సమ్మె విరమణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం మూడో ఫ్రంట్ ఆలోచన అంతా బీజేపీ కోసమేనని విమర్శించారు. వివిధ రాష్ట్రాల్లో ఎంఐఎం కావాలనే పోటీ చేసి ఓట్లను చీల్చిందన్నారు.

బీజేపీకి సహకరించేలా సీఎం కేసీఆర్ ఆలోచన ఉందని చెప్పారు. గతంలో కేసీఆర్ వారందరూ ఇండియా కూటమిలో ఉన్నారని గుర్తు చేశారు. కానీ ఆయన మాత్రం ఇండియా లేదా ఎన్డీఏ కూటమిలో చేరకుండా పరోక్షంగా బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారన్నారు. తాము బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి కోసమే పనిచేస్తామని చెప్పారు.

ఈ సమావేశంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్, జాన్ వెస్లీ, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేణి శంకర్, హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.