సాగునీరు అందించలేని ప్రభుత్వం రైతన్నల ప్రాణాలను బలిగొంటున్నదని, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు.
వంద రోజుల్లో 50 టీఎంసీలు సముద్రంలో కలిపేశారు
యాసంగి పంటలకు నీళ్లు ఇవ్వడంలో విఫలం
పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
విధాత బ్యూరో,కరీంనగర్: సాగునీరు అందించలేని ప్రభుత్వం రైతన్నల ప్రాణాలను బలిగొంటున్నదని, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. బుధవారం పెద్దపల్లి మండలం చీకురాయి, భోజన్న పేట శివారులో నీళ్లు అందక ఎండిన వరి పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ రైతు ప్రభుత్వమని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను ఆగం చేస్తున్నదన్నారు. ఎండిపోయిన పంటలకు ఎకరాకు 25 వేల రూపాయల చొప్పున పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులను మోసగించిన కాంగ్రెస్ కు త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సాగునీటి సమస్యతో రైతులు ఆందోళన చెందుతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేకుండా పోయిందన్నారు. రైతులు ఎదుర్కొంటున్న బాధలు చూస్తుంటే తమకు గుండె తరుక్కుపోతుందన్నారు. యాసంగి పంటలకు సాగునీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నీటిపారుదల నిర్వహణ లోపం వల్ల 50 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిశాయన్నారు. ఎన్నికలకు ముందు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి, అరచేతిలో వైకుంఠం చూపించిందని ఆయన దుయ్యబట్టారు.
మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మూడు పిల్లర్లు కుంగితే దానిని సాకుగా చూపించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు లోని నీటిని మొత్తం దిగువకు వదిలేసి, సాగునీళ్లు ఇవ్వకుండా రైతులను కన్నీరు పెట్టిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే వంద మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని, రైతుభరోసా పథకం ద్వారా రైతులకు ఎకరాకు రూ.15,000ల సాయం, 2లక్షల రుణమాఫీ చేయాలన్నారు. రైతులను కన్నీరు పెట్టిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులుండవన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి , బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, మండల పార్టీ అధ్యక్షులు మార్కు లక్ష్మణ్ తో పాటు మాజీ సర్పంచులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.