KTR: ఒక్క నిరుద్యోగికి కూడా అన్యాయం జరగొద్దనే గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు: మంత్రి కేటీఆర్
విధాత: రాష్ట్రంలోని ఒక్క నిరుద్యోగికి కూడా అన్యాయం జరగనివ్వం అని, యువత ప్రయోజనాలను కాపాడటమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులు ఎవరూ కూడా నష్టపోవద్దనే ఉద్దేశంతో గ్రూప్-1 ప్రిలిమ్స్ను రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుందని కేటీఆర్ పేర్కొన్నారు. నిరుద్యోగుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్న రాజకీయ పార్టీల అసలు నైజాన్ని గుర్తించి యువత, విద్యార్థులు చైతన్యంతో వ్యవహరించాలని కేటీఆర్ సూచించారు. పేపర్ల లీకేజీ.. బాధ్యులను అరెస్టు చేశాం.. […]

విధాత: రాష్ట్రంలోని ఒక్క నిరుద్యోగికి కూడా అన్యాయం జరగనివ్వం అని, యువత ప్రయోజనాలను కాపాడటమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులు ఎవరూ కూడా నష్టపోవద్దనే ఉద్దేశంతో గ్రూప్-1 ప్రిలిమ్స్ను రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుందని కేటీఆర్ పేర్కొన్నారు. నిరుద్యోగుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్న రాజకీయ పార్టీల అసలు నైజాన్ని గుర్తించి యువత, విద్యార్థులు చైతన్యంతో వ్యవహరించాలని కేటీఆర్ సూచించారు.
పేపర్ల లీకేజీ.. బాధ్యులను అరెస్టు చేశాం..
ఎప్పుడైనా ఎక్కడైనా లోపం జరిగితే.. ప్రభుత్వం వెంటనే ఎంత వేగంగా స్పందించి… ఎలాంటి చర్యలు తీసుకుందనేదే ముఖ్యమని ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తిచేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి రాగానే ప్రభుత్వం మెరుపువేగంతో సిట్ను నియమించి.. బాధ్యులైన వారందరినీ అరెస్టు చేసిందని తెలిపారు. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకూడదని గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దుచేయాలని కీలక నిర్ణయం తీసుకుందని అన్నారు.
ఇది బాధాకరమైన నిర్ణయం అయినప్పటికీ తప్పలేదని.. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఒకవైపు ప్రభుత్వం స్పందించిన పారదర్శక తీరును పట్టించుకోకుండా కేవలం మొత్తం వ్యవహారాన్ని స్వార్థ రాజకీయాలకు వాడుకోవాలని దుర్మార్గమైన ప్రయత్నాన్ని బీజేపీ మానుకోవాలని కేటీఆర్ హెచ్చరించారు. ప్రతిసారి తమ స్వార్ధ రాజకీయాలకు సమాజంలో చిచ్చుపెట్టే అలవాటు బీజేపీకి కొత్త కాదని, ఈ వ్యవహారాన్ని సైతం బీజేపీ శాంతి భద్రతల సమస్యగా మార్చే కుట్ర చేస్తోందని కేటీఆర్ అన్నారు.
యువతను ఉద్యోగాలకు దూరం చేయాలని బండి సంజయ్ కుట్ర
ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లపై కోటి ఆశలతో విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతుంటే.. వారిని పరీక్షలు పక్కన పడేసి తనతో కలిసి రావాలన్న దగుల్బాజీ నాయకుడు బండి సంజయ్కు అసలు యువత గురించి మాట్లాడే అర్హత లేదని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లను విడుదల చేస్తే తమ పార్టీకి యువకులను దూరం చేసే కుట్ర అన్న దుర్మార్గుడు బండి సంజయ్ వ్యాఖ్యలను రాష్ట్ర యువత మర్చిపోలేదన్నారు.
ఒక వ్యక్తి చేసిన తప్పును బూచిగా చూపించి మొత్తం పబ్లిక్ సర్వీసు కమిషన్ నే రద్దుచేయాలన్న అడ్డగోలు వాదన వెనక యువతను ఉద్యోగాలకు దూరం చేయాలన్న కుట్ర దాగి ఉందని మండిపడ్డారు. ఈ కేసులోని నిందితులు బీజేపీ యాక్టివ్ కార్యకర్తలనే విషయం విచారణలో తేలిందని, తన రాజకీయాల కోసం లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టి పేపర్ ను లీక్ చేయించిన కుట్ర ముమ్మాటికీ బీజేపీదే అన్నారు.
శరవేగంగా చేపట్టిన నియామక ప్రక్రియ పూర్తయితే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న అక్కసుతోనే బీజేపీ ఇంత దుర్మార్గానికి, నీచానికి పాల్పడినట్టు మంత్రి కేటిఆర్ ఆరోపించారు. ఇలా రాజకీయాల కోసం యువత భవితతో ఆడుకుంటున్న బండి సంజయ్ వంటి మోసగాళ్ల పట్ల రాష్ట్రంలోని యువతీ యువకులు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు.
ఆందోళన అవసరం లేదు.. అన్యాయం జరగనివ్వం..
తెలంగాణ రాష్ట్రంలోని యువకులు, విద్యార్థులు టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీ విషయంలో ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మరొకసారి కేటీఆర్ విజ్ఞప్తిచేశారు. ఇప్పటికే మా ప్రభుత్వం ఇచ్చిన హామీ కన్నా రెండింతలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తూ నిరుద్యోగ యువత పట్ల తన నిబద్ధతను చాటుకున్నదన్నారు. తెలంగాణ యువతకే 95 శాతం ఉద్యోగాలు దక్కాలన్న సమున్నతమైన ఆశయంతో ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చిందని, యువత పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని మంత్రి తెలిపారు.
ఒక వ్యక్తి వలన జరిగిన దురదృష్టకరమైన సంఘటన బాధాకరమన్నారు. ఎనిమిద సంవత్సరాలుగా ఒక్క ఆరోపణ లేకుండా వేలాది ఉద్యోగాలు భర్తీ చేసిన మన పబ్లిక్ సర్వీసు కమిషన్ యూపీఎస్సీతో పాటు అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని విజ్ఞప్తిచేశారు. ఉద్యోగాల నియామక ప్రక్రియలో ఒక్క నిరుద్యోగికి కూడా అన్యాయం జరగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని భరోసా ఇస్తున్నామన్నారు.
భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వం..
అయితే ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులిమి పబ్బం గడుపుకోవాలనుకుంటున్న కుటిల రాజకీయ పార్టీల అసలు నైజాన్ని, మొసలి కన్నీరుని గుర్తించి చైతన్యంతో వ్యవహరించాలని విద్యార్థికి, యువతకు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన మరోసారి పునరావృతం కాకుండా, అవసరమైన కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాలని, ఇందుకు సంబంధించి అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్కు అందిస్తామని కేటీఆర్ తెలిపారు. తమ ప్రభుత్వం రాష్ట్ర యువత ప్రయోజనాలు కాపాడటం కోసం అత్యంత జాగ్రత్తతో వ్యవహరిస్తుందని, వారిపట్ల తమ నిబద్ధతను గుర్తించాలని కేటీఆర్ కోరారు.