విధాత : బీఆరెస్ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో రహదారులు నిర్లక్ష్యానికి గురయ్యాయని,దాదాపు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ తిరిగి తెలంగాణాలో అధికారంలోకి వచ్చిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా రహదారుల అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సచివాలయంలోని 5 వ అంతస్తులోని రూమ్ నెంబర్ 11 లోని తన కార్యాలయంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
సోదరుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సహా కుటుంబ సభ్యుల మధ్య వెంకట్రెడ్డి తన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మొత్తం 9 దస్త్రాల పై సంతకాలు చేశారు. ఎమ్మెల్యేలు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, వేముల వీరేశం, కుందూరు జయవీర్, బాలూ నాయక్, కంభం అనీల్ కుమార్ రెడ్డి, రోడ్లుభవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస రాజు, స్పెషల్ సెక్రెటరీ విజయేంద్ర, సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ అశోక్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు మంత్రికి శుభాకాంక్షలు అందచేశారు.
ఈ సందర్బంగా తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ, హెరిటేజి భవనంగా ఉన్న శాసనసభ పాత భవనాన్ని పునర్ వ్యవస్తీకరించి దానిలో శాసన మండలి కార్యకలాపాలను నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
అదేవిధంగా ప్రస్తుతం ఉన్న సీఎల్పీ, ఇతర పార్టీల కార్యాలయాలున్న భవనాన్ని తొలగించి పబ్లిక్ గార్డెన్ నుండి లలితా కళా తోరణం వరకు సుందరీకరణ చేసి అసెంబ్లీ ప్రాంగణాన్ని ఒక ఉత్తమ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నట్టు వివరించారు. ఈ విషయంలో మరి కొన్ని రోజుల్లో ముఖ్యమంత్రి, శాసన మండలి చైర్మన్, సంబంధిత అధికారులతో కలసి పరిశీలించనున్నట్టు అన్నారు.
రాష్ట్రంలోని రహదారులన్నింటినీ నెలరోజుల్లోగా పూర్తి స్థాయి మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. రానున్న వంద రోజుల్లో తమ ప్రభుత్వం ప్రకటించిన ఆరు హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ప్రకటించారు.
నిన్న సీఎం ప్రారంభించిన మహాలక్ష్మి కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలనుండి అద్భుతమైన స్పందన వస్తోందని తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి న్యూ ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్గరీని కలువనున్నట్లు, అదేవిధంగా తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు ఢిల్లీకి వెళ్తున్నట్లు కోమటిరెడ్డి చెప్పారు.
రోడ్లకు నిధులు విడుదల చేసిన మంత్రి వెంకట్రెడ్డి
రోడ్లు , భవనాల మంత్రిగా వెంకట్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తొమ్మిది పనులకు మంజూరీ ఇస్తూ సంతకాలు చేశారు. వాటిలో నల్గొండ జిల్లాలో నల్గొండ నుండి ముషంపల్లి మీదుగా ధర్మాపురం వరకు రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా మార్చేందుకు రూ. 100 కోట్లు కేటాయించారు.
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజక వర్గంలో లింగంపల్లి నుండి దుగ్యాల రోడ్డును రూ. 4 .15 కోట్ల వ్యయంతో విస్తరించడం, రాష్ట్రంలో 14 స్టేట్ రోడ్లను జాతీయ రహదారులుగా అప్-గ్రేడ్ చేయడానికి వెంకట్ రెడ్డి ఆమోదం తెలిపారు. వీటిలో మల్లెపల్లి నల్గొండ రహదారి, రీజినల్ రింగ్ రోడ్ సౌత్ వైపు ఉన్న చౌటుప్పల్,- ఆమనగల్ -షాద్నగర్-సంగారెడ్డి రహదారి తదితర రోడ్లు ఉన్నాయి.
హైదరాబాద్ – విజయ వాడ నేషనల్ హై- వే ను ఆరులైన్ల రోడ్డుగా మార్చడం. నకిరేకల్-నాగార్జున సాగర్ మార్గంలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడం. హైదరాబాద్-కల్వకుర్తి జాతీయ రహదారి 765 లోని ఒక సెక్షన్ మార్గాన్ని నాలుగు లైన్లుగా మార్చడం.తెలంగాణా రాష్ట్రానికి కేంద్ర రోడ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధులను అధికంగా కేటాయించేందుకు ప్రతిపాదనలు, మరో రెండు పరిపాలనా సంబంధిత ఫైళ్లకు వెంకట్రెడ్డి సంతకం చేశారు.
హరీశ్ రావు విమర్శలు అర్ధరహితం
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే ఏం చేశారని హరీశ్రావు విమర్శించడం అర్ధరహితమని, 10 ఏళ్లుగా బీఆరెస్ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. గత పదేళ్లుగా రహదారుల మీద శ్రద్ద పెట్టలేదని, ఎవరి మీదా.. కావాలని కక్ష సాధింపులు ఉండవని, తప్పులుంటే మాత్రం చర్యలు తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను వంద రోజుల్లోగా వీలైనంత త్వరగా అమలు చేస్తామన్నారు.