సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన పాపాలే ఆయనకు ఇప్పుడు చుట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.
విధాత, హైదరాబాద్ : సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన పాపాలే ఆయనకు ఇప్పుడు చుట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో మీడియాతో చిట్చాట్లో ఆయన మాట్లాడారు. యాదగిరిగుట్ట పేరును మార్చడమే కేసీఆర్ చేసిన మొదటి తప్పు అని, యాదాద్రి ఆలయ నిర్మాణంలో అవినీతితో ఆయన పతనం నిర్ణయమైందని, పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆలయ నిర్మాణ అవినీతిపై విచారణ చేపడతామని తెలిపారు. యాదాద్రి పేరును మళ్లీ యాదగిరిగుట్టగా మారుస్తామన్నారు.
కేసీఆర్ చేసిన పాపాల వల్ల కరవు వచ్చిందని, కాంగ్రెస్ అధికారంలో ఉంటే వర్షాలు పడుతాయని, వర్షం అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే వర్షం అని చెప్పారు. దేవుడి పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సర్వనాశనం చేశారని విమర్శించారు. గేట్లు తెరవకముందే కాంగ్రెస్ లోకి ఇతర పార్టీల నేతలు వస్తున్నారని, ఒక్క గేటు తెరిస్తేనే ఇంతమంది వస్తున్నారని, కేసీఆరే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని గుర్తు చేశారు. నల్గొండ జిల్లాను కేసీఆర్ పదేళ్ల పాలనలో నాశనం చేశారని, జిల్లాలోని ఒక్క పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయలేదని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని అక్కడికి వస్తారని ప్రశ్నించారు.
కాశీం రజ్వీల కంటే గొప్పోల్లు ఫోన్ ట్యాపర్లు
కాశీం రజ్వీ కంటే గొప్పోల్లు కేసీఆర్ వద్ద ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్లని కోమటిరెడ్డి చురకలేశారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కేటీఆరే ఒప్పుకున్నారన్నారని, ఆయన చెప్పిన ఇద్దరి ముగ్గురి ట్యాపింగ్ చేస్తే చేసిండొచ్చన్న వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసు బుక్ చేయాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై కేసు ప్రూవ్ అయితే కేటీఆర్కు పదేళ్ల జైలు శిక్ష పడుతుందన్నారు. కేటీఆర్ యూస్ లెస్ ఫెల్లో అన్నారు. మూడు పిల్లర్లు కుంగితే ఏమవుతుంది అంటున్నాడని మండిపడ్డారు. సినిమా వాళ్ళ ఫోన్స్ కూడా ట్యాపింగ్ చేశారని తెలిసిందన్నారు.
సినిమా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనకు ఇప్పటి వరకూ ఎలాంటి ఫిర్యాదులూ రాలేదన్నారు. తనకు ఫిర్యాదు చేస్తే అప్పుడు ఆలోచన చేస్తామని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో అధికారులతో పాపపు పనులు చేయించారని, దీంతో వారిప్పుడు భయంతో నిద్రపోవడం లేదని, ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ రాష్ట్రంలోనూ చూడలేదని, కేసీఆర్ ప్రతిదీ రాజకీయం చేశారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆరెస్ పార్టీ పరిస్థితి గందరగోళంగా మారిందని, క్లిష్ట సమయంలో వరుసగా కీలక నేతలంతా ఆ పార్టీని వీడుతున్నారని, కొందరైతే ఇచ్చిన టికెట్లు కూడా కాదనుకొని ఇతర పార్టీల్లో చేరడానికి సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు.
ఎంపీ అభ్యర్తుల ఎంపికలో నా జోక్యం లేదు
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చిందన్నారు. ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ అభ్యర్థుల ఎంపిక విషయంలో మరోసారి ఢిల్లీ వెళ్లి సీఈసీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొని తుది నిర్ణయం తీసుకోనున్నారని వెల్లడించారు. ఎంపీ టికెట్ల విషయంలో తాను కలుగజేసుకోనని, పార్టీ అధిష్టానం ఎవరికైతే టికెట్లు కేటాయిస్తుందో వారి గెలుపు కోసం పని చేస్తామని స్పష్టం చేశారు. ఒక్క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తప్ప, ఏనాడు తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండా ఎంపీకి పోటీ కష్టమేనని భావిస్తున్నట్టు తెలిపారు. ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి… ఇంకో పార్టీలో ఎంపీగా పోటీ అంటే లీగల్ సమస్యలు వస్తాయని అభిప్రాయపడుతున్నట్టు పేర్కొన్నారు. కొత్త వాళ్ళకు టికెట్ ఇవ్వడం అంటే గెలిచే వాళ్లకు ఇస్తున్నారని తెలిపారు. అలాగని అది పాత వాళ్లకు అన్యాయం కాదన్నారు. వారికి తామంతా ఉన్నామన్నారు. హైదరాబాద్ లాంటి వీక్ ఉన్న స్థానాల్లో గెలిచే వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారని కోమటిరెడ్డి తెలిపారు.
థియేటర్లపై రైడ్స్ చేపడుతాం
త్వరలో సినిమా థియేటర్ల పై రైడ్స్ జరుగుతాయని కోమటిరెడ్డి తెలిపారు. ఇష్టం వచ్చినట్లు సినిమా హాల్లో రేట్లు పెంచి వసూలు చేస్తున్నారన్నారు. మా డిపార్ట్మెంట్ టీంలు సినిమా హళ్లపై నిఘా ఉంచాయన్నారు. తేడా వస్తే థియేటర్లను సీజ్ చేస్తామన్నారు. సినిమా ప్రమోషన్ల కు, క్లాపింగ్లకు తాను రానని ఇండ్రస్టీలో ఉన్న వారికీ చెప్పానన్నారు. సినిమా టికెట్ల ధర పెంచడం కాదని అన్నారు. సినిమా హాల్లో స్నాక్స్ రేట్లు పెంచి ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.
మాశాఖ అధికారులకు థియేటర్ కి వెళ్లి టికెట్, స్నాక్స్ కొని బిల్లులు తెమ్మని చెప్పామని, ఆ బిల్లులు రాగానే వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయని వెంకట్రెడ్డి వెల్లడించారు. బడ్జెట్ పెంచుకుని సినిమాలు తీసి.. టికెట్ రేట్లు పెంచండి అంటే ఎలా? అని ప్రశ్నించారు. చిన్న సినిమాలు తీసిన వారికి కనీసం థియేటర్లు దొరకడం లేదని, వాళ్లకు తీరని నష్టం జరుగుతోందన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతోనే కాంగ్రెస్ పోటీ
పార్లమెంటు ఎన్నికల్లో మాకు.. బీజేపీ పార్టీ మధ్యనే పోటీ ఉంటుందని వెంకట్రెడ్డి చెప్పారు. బీఆరెస్ దుకాణం బంద్ అయిపోయిందన్నారు. భువనగిరి టికెట్ గురించి నేను అడగలేదని, రాజగోపాల్ రెడ్డి కూడా అడగలేదన్నారు. మా అన్న వాళ్ళ అబ్బాయి కూడా మాకు చెప్పకుండా దరఖాస్తు చేశాడని, ఇప్పటికే మన ఇంట్లో మంత్రి… ఎమ్మెల్యేలు ఉన్నామని, కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలి కదా అని చెప్పి మా కుటుంబ సభ్యులకు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించలేదన్నారు. ప్రభుత్వాన్ని బీజేపీ కులగొడతాం అంటే ప్రజలు ఊరుకుంటారా? అని ఇదేమైనా.. మధ్యప్రదేశ్.. మహారాష్ట్ర కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం తిరుగుబాటు చేస్తారన్నారు. అవసరం అయితే బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లోకి వస్తారన్నారు.
కేసీఆర్ అవినీతికి జైలులోనూ ప్రగతి భవన్ కట్టాలి
కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడితే డబుల్ బెడ్ రూమ్ సరిపోతుందని సీఎణ రేవంత్రెడ్డి అనుకున్నారని, కానీ ఒక్కోటి వెలుగు చూస్తున్న అవినీతి కేసులు చూస్తుంటే జైల్లో ప్రగతి భవన్ కట్టాల్సి వస్తుందేమోనని వెంకట్రెడ్డి సెటైర్లు వేశారు. యాదగిరిగుట్ట గోపురం కోసం బంగారం వసూలు చేశారన్నారు. అది ఎక్కడ ఉందో తెలియదన్నారు. గోపురంకి బంగారం తాపడం చేయించొచ్చని, ఇప్పటి వరకు పని చేసిన ఈఓ గీతా డిప్యూటీ సీఎం లెక్క వ్యవహారించారని, బయటకు పంపే వరకు అక్కడే ఉందన్నారు. కొందరు రిటైర్డ్ అయిన అధికారులు పొమ్మన్నా పోతలేరన్నారు.