సేంద్రియ పద్ధతుల్లో ‘వైల్డ్ ఫ్లేవర్స్’ తేనె
ఆరోగ్య పరిరక్షణ పోషకాల కోసం ప్రజలు సేంద్రియ ఉత్పత్తులను ఆదరించాలని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు.

- అందుబాటులోకి తెస్తున్న ములుగు ఫారెస్ట్ కాలేజీ
- సేంద్రియ ఉత్పత్తులను ఆదరించండి
- అటవీశాఖ మంత్రి కొండా సురేఖ
విధాత : ఆరోగ్య పరిరక్షణ పోషకాల కోసం ప్రజలు సేంద్రియ ఉత్పత్తులను ఆదరించాలని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (ఎఫ్ సి ఆర్ ఐ) ఆధ్వర్యంలో శాస్త్రీయంగా పెంచుతున్న తేనెటీగల కేంద్రం నుంచి తయారు చేసిన ఆర్గానిక్ (సేంద్రియ) తేనెను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సేంద్రియ ఉత్పత్తులను ఆదరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
రైతులకు తేనెటీగల పెంపకం, ఆదాయ అభివృద్దిపై శిక్షణను ఇచ్చేందుకు హైదరాబాద్ శివారు ములుగులో ఉన్న ఫారెస్ట్ కాలేజీలో ప్రత్యేక తేనెటీగల పెంపకం, ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పారని గుర్తు చేశారు. రైతులతో పాటు ఔత్సాహిక వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, మహిళలకు తేనెటీగల పెంపకంపై వారం రోజుల శిక్షణా కార్యక్రమాలను ఫారెస్ట్ కాలేజీ అందిస్తున్నదని తెలిపారు.
సెంటర్ ఆధ్వర్యంలో పూర్తి సేంద్రియ పద్ధతుల్లో అభివృద్ధి చేసిన తేనెను ‘వైల్డ్ ఫ్లేవర్స్’ బ్రాండ్ పేరుతో ఫారెస్ట్ కాలేజీ అందుబాటులోకి తెస్తున్నదని వెల్లడించారు. ములుగు ఫారెస్ట్ కాలేజ్లో త్వరలో ఒక తేనె విక్రయ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు డీన్ ప్రియాంక వర్గీస్ తెలిపారు. కార్యక్రమంలో అటవీశాఖ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్, ఫారెస్ట్ కాలేజీ డీన్ ప్రియాంక వర్గీస్ పాల్గొన్నారు.