నన్ను నవమాసాలు మోసి కన్న నా తల్లిని అవమానించేలా ఎంపీ బండి సంజయ్ మాట్లాడారని, రాజకీయాలకు సంబంధం లేని తల్లిని అవమానిపరిచేవిధంగా మాట్లాడి తప్పు చేశాడని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.
విధాత, హైదరాబాద్ : నన్ను నవమాసాలు మోసి కన్న నా తల్లిని అవమానించేలా ఎంపీ బండి సంజయ్ మాట్లాడారని, రాజకీయాలకు సంబంధం లేని తల్లిని అవమానిపరిచేవిధంగా మాట్లాడి తప్పు చేశాడని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ తల్లి అయినా నవ మాసాలు మోసి బిడ్డను కంటుందన్నారు. బండి సంజయ్ మాట్లాడిన వీడియో చూస్తే నీ తల్లి అని స్పష్టంగా చెప్పిన తరువాత కూడా నేను ప్రశాంతంగా ఉండటం మంచిది కాదని స్పందించానన్నారు.
ఎవరి తల్లినైనా అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు. తల్లి మీద అనుచితంగా మాట్లాడిన బండి సంజయ్ తీరును ఖండించాలని తెలంగాణ ప్రజలను, బీజేపీ నాయకత్వాన్ని కోరుతున్నానన్నారు. కరీంనగర్ ఎంపీగా, లోక్సభ నియోజకవర్గంలో, హుస్నాబాద్ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశావో తెలంగాణ బిడ్డగా బండి సంజయ్ని తాను అడిగానన్నారు. దానికి సమాధానం చెప్పకుండా తల్లిని అవమానించడం, రాముడిని ముందు పెట్టి మాట్లాడటం ఎందుకని ప్రశ్నించారు.
రాముడి జన్మ గురించి నేను మాట్లాడి ఉంటే సజీవ దహనానికి సిద్ధమన్నారు. రాముణ్ణి ఆరాధించే వ్యక్తినన్నారు. నేను వెజిటేరియన్ హిందువుని..పెద్ద భక్తుడినని, నీవు ప్రొద్దున లేస్తే మాంసం మందు లేనిది బతుకవని, నేను మందు తాగాను మాంసం తిననన్నారు. నాతల్లి ఈ రోజు కూడా ఆశీర్వదించిందని, రోజుకు నాలుగు సార్లు మాట్లాడుతుందని బిడ్డ తిన్నావా అని అడుగుతుందన్నారు. నా తల్లిని అవమాన పరుస్తావా అని మండిపడ్డారు.
ఎంపీగా బండి గెలిస్తే మంత్రి పదవికి నన్ను రాజీనామా చేస్తావా అంటున్నాడని, నీకు సిగ్గు ఉందా అని.. ఎమ్మెల్యేగా నాలుగుసార్లు ఓడిపోయిన సంగతి మరిచిపోయావా అన్ని పొన్నం ఎద్దేవా చేశారు. నన్ను రాజీనామా అడిగే ముందు నువ్వు ఎంపీకి రాజీనామా చేశావా అని ప్రశ్నించారు. నువ్వు ఒక్కసారి ఎంపీగా గెలిచావని, నేను నీకన్నా ముందు ఎంపీ అయ్యానన్నారు. ఒకసారి మార్కఫెడ్ చెర్మన్ అయ్యానని, నా దయదాక్షిణ్యాలతో గతంలో కాంగ్రెస్ ప్యానల్లో అర్బన్ బ్యాంకు డైరెక్టర్ అయిన బండి సంజయ్ నాపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. ఇకనైనా బండి సంజయ్ తన మాటతీరు మార్చుకోని పక్షంలో తగిన బుద్ది చెబుతామని ప్రభాకర్ స్పష్టం చేశారు.