తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం లోపాయికారి అవగాహనతోనే అభ్యర్థులను పెడుతున్నాయని బీఆరెస్ మాజీ మంత్రి జి.జగదీశ్రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు
లిక్కర్ కేసులోఆధారాలున్నాయన్న కిషన్రెడ్డినే ఈడీ విచారించాలి
విధాత : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం లోపాయికారి అవగాహనతోనే అభ్యర్థులను పెడుతున్నాయని బీఆరెస్ మాజీ మంత్రి జి.జగదీశ్రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో నల్లగొండ, భువనగిరి బీఆరెస్ ఎంపీ అభ్యర్థులు కంచర్ల కృష్ణారెడ్డి, క్యామ మల్లేశ్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో బలం లేని రెండు పార్టీలు లోపాయికారి అవగాహానతో కలిసి పనిచేస్తున్నాయన్నారు. బీఆరెస్ను దెబ్బతీసే రాజకీయంలో ఆ రెండు పార్టీ కలిసి పావులు కదుపుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వసూళ్లకు పాల్పడుతు ఆ పార్టీ ఢిల్లీ పెద్దలకు ముడుపులు కడుతుందని విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో గతంలో కవితను విచారణ చేసి, ఏమి తేలలేదని చెప్పిన కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పుడు ఎన్నికల సమయంలో అరెస్టు చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కవిత కేసులో తన దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నారని, ఈడీ ముందుగా కిషన్ రెడ్డిని కూడా విచారణ చేయాలని కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వేల ఎకరాల పంటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయని చెప్పారు. రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అందుకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలన్న సోయి విస్మరించి రాజకీయాల్లో మునిగితేలుతుందన్నారు. మంత్రులు పాలన గాలికొదిలేశారని విమర్శించారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పంటల పరిస్థితి ఘోరంగా ఉందన్నారు. గతంలో కేఆర్ఎంబీ అడ్డు చెప్పినా తాము పొలాలకు నీళ్లు ఇచ్చామని చెప్పారు. నాగార్జున సాగర్ కట్ట మీదకు వెళ్లడానికి మంత్రులకు లాగులు తడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సోయి లేకుండా మాట్లాడుతున్నారని, రైతుల సమస్యలపై దాటవేత వైఖరి అనుసరిస్తున్నారని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ, భువనగిరి సీట్లలో బీఆరెస్ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు.