ఎస్సారెస్పీ నీళ్ల విడుదలపై మాట తప్పిన ప్రభుత్వం
ప్రభుత్వం రైతులకు ఎస్సారెస్పీ ఫేస్ 2 ద్వారా నీళ్లు ఇస్తామంటేనే పంటలు వేశారని, హామీ ఇచ్చి పంటలకు నీరు ఇవ్వకుండా కాంగ్రెస్ రైతాంగాన్ని మోసం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విరుచుకుపడ్డారు.

- ప్రభుత్వ మాటలు నమ్మి నష్టపోయిన రైతాంగం
- రైతు సమస్యలపై కాంగ్రెస్ నిర్లక్ష్యం
- మంత్రివర్గం సమీక్షా..సహాయంతో రైతులకు భరోసానివ్వాలి
- మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీశ్రెడ్డి
విధాత: ప్రభుత్వం రైతులకు ఎస్సారెస్పీ ఫేస్ 2 ద్వారా నీళ్లు ఇస్తామంటేనే పంటలు వేశారని, హామీ ఇచ్చి పంటలకు నీరు ఇవ్వకుండా కాంగ్రెస్ రైతాంగాన్ని మోసం చేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీశ్రెడ్డి విరుచుకుపడ్డారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎండిన పంటలను, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను వరుసగా ఐదవ రోజు గురువారం కూడా పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు. సూర్యాపేట మండలం యార్కారం,దుబ్బ తండ , రెఖ్యా నాయక్ తండాలో ఎండిన పొలాల పరిశీలించారు.
ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎస్సారెస్పీ ఫేస్2 రైతులకు నీళ్లు అందస్తామన్న ప్రభుత్వ మాటలు నమ్మి ఒక్కో రైతు 25 నుండి 30 వేల పెట్టుబడి పెట్టి ఆగమయ్యారని అన్నారు. ప్రభుత్వమే మాట ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘటన చరిత్రలో ఏనాడు లేదని, మాట ఇచ్చి రైతన్నల నడ్డి విరిచిన అపకీర్తి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని మండిపడ్డారు. ప్రభుత్వం అవగాహన రాహిత్యం వలన ఎస్సారెస్పీ రైతులు రోడ్డున పడ్డారని ఆరోపించారు. బీఆరెస్ ప్రభుత్వం హయాంలో మొన్నటి వరకు జాలువారిన పంట పొలాలు నేడు మోడువారడానికి కారణం నూటికి నూరు శాతం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమేనన్నారు. పోరాడి సాధించిన తెలంగాణలో కేసీఆర్ రైతాంగాన్ని సస్యశ్యామలం చేస్తే మూడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసిందని దుయ్యబట్టారు.
బీఆరెస్ను బద్నాం చేసేందుకు కాళేశ్వరం ఎత్తిపోతల బంద్
కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయడానికి మూడు పిల్లర్ల కుంగుబాటుకు సంబంధం లేనప్పటికీ గత ప్రభుత్వాన్ని అభాసు పాలు చేసేందుకు రైతాంగానికి నీళ్లు ఇవ్వడం లేదన్నారు. రైతుబంధు రాలేదని ప్రశ్నించిన రైతును మంత్రి చెప్పు తీసుకొని కొడతాననడం దుర్మార్గమని విమర్శించారు. బీఆరెస్ ప్రభుత్వ హయాంలో రైతు తప్పిదం వలన ఒక్క మడి ఎండిపోతేనే నాన్న హంగామా చేసిన డిప్యూటీ సీఎం విక్రమార్క ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
రాష్ట్రవ్యాప్తంగా పంట పొలాలు ఎండిపోతున్నప్పటికీ మంత్రులు కనీసం సమీక్ష చేయకపోవడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న మొసలి కన్నీళ్ళకు నిదర్శనమన్నారు. పంట నష్టంపై మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించి తక్షణమే సహాయ చర్యలు చేపట్టి రైతులకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.