ప్రధానిని సీఎం కలిస్తే తప్పేంటి: ఎంపీ బండి సంజయ్
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఓ రాష్ట్ర సీఎం ప్రధానిని కలిస్తే తప్పేమిటని అందులో మంచిని చూడాలి కానీ.. ప్రతిదీ రాజకీయం చేయడం సరికాదని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు

- రాష్ట్రాభివృద్ధి కోణంలోనే చూడాలి
- కేసీఆర్లా కాకుండా రేవంత్ ఇదే పంథా కొనసాగించాలి
విధాత: రాష్ట్ర ప్రయోజనాల కోసం ఓ రాష్ట్ర సీఎం ప్రధానిని కలిస్తే తప్పేమిటని అందులో మంచిని చూడాలి కానీ.. ప్రతిదీ రాజకీయం చేయడం సరికాదని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా కరీంనగర్ జిల్లా కేశవపట్నంలో తాటి కల్లు తాగారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ ప్రధాని పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ ఇదే పంథాను కొనసాగిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. గతంలో రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ వస్తే.. కేసీఆర్ ఓ దొంగల దాక్కున్నాడని విమర్శించారు.
కనీసం రాష్ట్ర ప్రయోజనాల కోసం, వచ్చే నిధుల గురించి కూడా ఆలోచన చేయలేదని ధ్వజమెత్తారు. బీఆరెస్ ప్రభుత్వం హయాంలో కరీంనగర్ పూర్తిగా ఆర్థికంగా దోపిడీకి గురైందని అన్నారు. మళ్లీ ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని కేసీఆర్ కరీంనగర్లో సభ పెడుతున్నాడని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీకి దోస్తీ ఉందని కొందరు ప్రచారం చేయడం హాస్యాస్పదమన్నారు. భవిష్యత్తులో కూడా ఆ పార్టీతో తమకు పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆరెస్ల మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని, అది ప్రజలకు కూడా తెలుసని పేర్కొన్నారు.
కుటుంబ, వారసత్వ అవినీతి పార్టీలైన కాంగ్రెస్, బీఆరెస్లతో దేశానికి, రాష్ట్రానికి నష్టమన్నారు. బూటకపు హామీలతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజలను పూర్తిగా మభ్యపెడుతోందని అరోపించారు. నిరుపేదలకు ఇళ్లు, మహిళలకు రూ. 2,500 ఆర్థిక సాయం, పెన్షన్ రూ. 4 వేలకు పెంపు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రదాని అభ్యర్థి ఎవరో ఇప్పటి వరకు వారికే క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. కేంద్రంలో మళ్లీ ప్రధాని మోడీ ప్రభుత్వం అధికారంలో రాబోతుందని, తెలంగాణలో 17సీట్లలో తమ పార్టీ గెలుస్తుందని సంజయ్ జోస్యం చెప్పారు.