మెడికల్ కాలేజీలతోపాటు నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు: సీఎం రేవంత్‌

మెడికల్ కాలేజీ ఉన్న ప్రతీ చోట నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు

మెడికల్ కాలేజీలతోపాటు నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు: సీఎం రేవంత్‌

– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి

– వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష

విధాత: మెడికల్ కాలేజీ ఉన్న ప్రతీ చోట నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సోమవారం సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి సమీక్షించారు. మంత్రి దామోదర రాజ నర్సింహ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖ అధికారులు హాజరయ్యారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ నర్సింగ్, పారా మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కామన్ పాలసీని తీసుకురావాలని తెలిపారు. కొడంగల్ లో మెడికల్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్ లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చేలా పరిశీలించాలని అన్నారు. ఎయిమ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్న సీఎం.. తద్వారా ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రులపై భారం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.


ఎయిమ్స్ ను సందర్శించి పూర్తిస్థాయి నివేదిక తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎయిమ్స్ లో పూర్తిస్థాయి వైద్య సేవల కోసం అవసరమైతే తానే స్వయంగా కేంద్రమంత్రిని కలిసి వివరిస్తానని చెప్పారు. కాగా ఉస్మానియా ఆసుపత్రి విస్తరణలో సమస్యలను అధికారులు సీఎం కు వివరించారు. మంగళవారం కోర్టులో బెంచ్ పైకి ఉస్మానియా హెరిటేజ్ భవనం ఇష్యూ వస్తుందని, కోర్టు డైరెక్షన్స్ ఆధారంగా ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రాంతాల వారీగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో కొన్నింటిని గుర్తించి వాటికి సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలన్న సీఎం సూచించారు. మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో హౌస్ కీపింగ్ మెయింటెనెన్స్ నిర్వహణ బాధ్యత పెద్ద ఫార్మా కంపెనీలకు అప్పగించాలని తెలిపారు. నిర్వహణ ఖర్చు వారే భరించేలా చూడాలని, ఇందుకు ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో ఏదో ఒక ఆసుపత్రిలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ఆదేశించారు.

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు తీరు, నిధులకు సంబంధించి వివరాలు సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా వున్న టీచింగ్ హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్స్ కు పెండింగ్ ఆరోగ్యశ్రీ బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ప్రతీ నెల 15వ తేదీలోగా ప్రభుత్వ ఆసుపత్రులకు, ప్రతీ మూడు నెలలకోసారి విధిగా ప్రైవేటు ఆసుపత్రుల ఆరోగ్యశ్రీ బిల్లులు విడుదల చేయాలని సీఎం సూచించారు.