Onion : దేశంలో ఉల్లిగడ్డ ధరలు క్రమంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై ఇప్పటికే కొనసాగుతున్న నిషేధాన్ని మరింత పొడిగించింది. దేశీయ మార్కెట్లో పెరుగుతున్న ఉల్లి ధరలను అదుపు చేయడానికి, తగిన నిల్వలను అందుబాటులో ఉంచడానికి ఈ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే ఉల్లి ఎగుమతులపై విధించిన నిషేధం గడువు మార్చి 31వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో నిషేధాన్ని మరికొన్నాళ్లు పొడిగించినట్లు కేంద్ర సర్కారు ప్రకటించింది. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ నిషేధం కొనసాగుతుందని ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT)’ తన నోటిఫికేషన్లో తెలిపింది.
కాగా, ఉల్లి ధరలను నియంత్రించడానికి కేంద్రం గతంలో అనేక చర్యలు చేపట్టింది. గత ఏడాదిలో అక్టోబర్ 28 నుంచి డిసెంబర్ 31 వరకు ఉల్లిపాయల ఎగుమతులపై టన్నుకు కనీస ఎగుమతి ధర (MEP) ను 800 డాలర్లుగా నిర్ణయించింది. ఆగస్టులో వీటిపై 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. తర్వాత డిసెంబర్ 8న కేంద్రం ఎగుమతులపై నిషేధం విధించింది. బఫర్ స్టాక్ను విడుదల చేసింది.
ఆ సమయంలో ‘నేషనల్ కో-ఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ (NCEL)’ ద్వారా యూఏఈ (UAE), బంగ్లాదేశ్లకు 64,400 టన్నుల ఉల్లిని ఎగుమతి చేయడానికి ప్రభుత్వం అనుమతించింది.