జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పిఠాపురంలో ఈసారి భారీ మెజార్టీతో గెలవబోతున్నారా? గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిన పవన్
విధాత ప్రత్యేక ప్రతినిధి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పిఠాపురంలో ఈసారి భారీ మెజార్టీతో గెలవబోతున్నారా? గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిన పవన్, ఈసారి పిఠాపురంలో రికార్డుస్థాయి మెజార్టీ దిశగా రాజకీయాలు చేస్తున్నారా? ఒక మీడియా సంస్థ సర్వేలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లు స్పష్టమైంది. మార్చి ఒకటో తేదీ నుంచి 21వ తేదీ వరకూ పిఠాపురంలో మూడుసార్లు జరిపిన సర్వేలో వైసీపీకి, జనసేనకు మధ్య ఓట్లలో భారీ వ్యత్యాసం నమోదైందని సమాచారం. తాజా సర్వేలో జనసేనకు 61 శాతం ఓటర్లు జై కొడితే, వైసీపీకి 31 శాతం ఓటర్లు మాత్రమే మొగ్గు చూపుతున్నట్లు తేలింది. ఈ లెక్కన పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు వచ్చే ఎన్నికల్లో 50 వేల పైచిలుకు మెజార్టీ ఖాయమని చెబుతున్నారు.
2019 ఎన్నికల్లో జనసేన, టీడీపీ విడివిడిగా పోటీచేశాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచిన పెండెం దొరబాబుకు 44.71 శాతం ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం తరఫున పోటీ చేసిన వర్మకు 36.68 శాతం ఓట్లు పడగా, జనసేన తరఫున పోటీ చేసిన మాకినీడు శేషకుమారికి 15 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు టీడీపీ, జనసేన పొత్తు వల్ల 2009లో రెండుపార్టీలకు పోలైన ఓట్ల శాతం కలిపితేనే 51.68 శాతం దాటిపోతున్నది. ఇక స్వయంగా పవన్ కళ్యాణ్ అభ్యర్థి కావడంతో మరో 10 నుంచి 12 శాతం ఓట్లు అధికంగా గ్లాసు గుర్తుకు పడనున్నట్లు సర్వేల్లో స్పష్టంగా వ్యక్తమవుతోంది.
కాపులు 36 శాతం, మాలలు 13.5 శాతం, శెట్టి బలిజలు 8.23 శాతం, వాడ బలిజలు 5.12 శాతం, పద్మశాలిలు 4.88 శాతం ఈ సర్వేలో అభిప్రాయాలు పంచుకున్నట్లు పేరు రాయడానికి ఇష్టపడని సర్వే సంస్థ తెలిపింది.
2009లో ప్రజారాజ్యం అభ్యర్థే నేడు పవన్ ప్రత్యర్థి
2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన వంగా గీత ప్రస్తుతం పవన్ కళ్యాణ్పై వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. 2009 ఎన్నికల్లో వంగా గీతకు మద్దతుగా పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేశారు. ఇప్పుడు ఆమెతోనే పోటీ ఎదుర్కొంటున్నారు. 2009లో పిఠాపురం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచిన వంగా గీతకు 31.19 శాతం ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థికి 30.50 శాతం ఓట్లు వచ్చాయి. 2009 ఎన్నికల్లో, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హవాలో పిఠాపురం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ముద్రగడ పద్మనాభం ఘోరంగా ఓడిపోయారు. టీడీపీ అభ్యర్థి కంటే కూడా తక్కువ శాతం ఓట్లతో ఆయన మూడో స్థానంలో ఉండిపోయారు.