గతంలో నేరాలకు పాల్పడిన వారు నేర ప్రవృత్తిని వీడి సమాజంలో మంచి నడవడికతో కొనసాగాలని, హుందాగా జీవించాలని రామగుండం పోలీస్ కమిషనర్
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: గతంలో నేరాలకు పాల్పడిన వారు నేర ప్రవృత్తిని వీడి సమాజంలో మంచి నడవడికతో కొనసాగాలని, హుందాగా జీవించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచించారు. తొందరపాటులో నేరాలు చేసినా వారి కుటుంబ సభ్యులు సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్లోని మంచిర్యాల పోలీస్ స్టేషన్ ఆవరణలో మంచిర్యాల జిల్లాలోని రౌడీషీటర్లలో మార్పు కోసం కౌన్సిలింగ్ సదస్సు నిర్వహించారు. సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ దర్యాప్తు పద్ధతులలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని, నేరస్థులు ఎవరూ చట్టం నుంచి తప్పించుకోవడం అసాధ్యమని చెప్పారు. చట్టం ముందు అందరూ సమానులేనని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. నేరం చేసే ముందు, మీరు (రౌడీ షీటర్లు) మీ కుటుంబాలు, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలని సూచించారు. నేరాల నియంత్రణలో మీరు భాగస్వామ్యులు కావాలని కోరారు. రౌడీ షీటర్ ఉన్న ప్రతీ ఒక్కరిపై ప్రత్యేక బృందాల ద్వారా ప్రత్యేక నిఘా ఉంటుందని, చట్ట వ్యతిరేక పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నేరప్రవృత్తిని మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నామని, ఒకవేళ మారకపోతే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించారు. గత పది సంవత్సరాల నుండి ఎలాంటి నేరాలకు పాల్పడకుండా మంచి సత్ప్రవర్తన కలిగి ఉండి పూర్తిగా మారితే రౌడీ షీట్ తొలగించేందుకు కూడా అవకాశం ఉందని అన్నారు. కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ బన్సీలాల్, మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.