తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు కేసీఆర్ నాయకత్వంలో పని చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది
విధాత: రేవంత్రెడ్డి తనను సుతిమెత్తగా పొగుడుతూనే అదేస్థాయిలో వార్నింగ్ ఇస్తున్నారన్నారు ఆరెస్ ప్రవీణ్ కుమార్. సోమవారం తెలంగాణ భవన్లో అధినేత కేసీఆర్ సమక్షంలో బీఆరెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికినట్లు, తాను ఆ పదవిని తిరస్కరించినట్లు చెబుతున్నారు. ఆ మాట వాస్తవమే. ప్రజాక్షేత్రంలోనే ఉండాలనుకున్నాను. కాబట్టి సీఎం ఆఫర్ను తిరస్కరించాన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లోకి వెళ్తే తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలంటూ సీఎం మరోవైపు బెదిరిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదా..? ఏ వేదిక మీద పని చేయాలి. ఎక్కడ పని చేయాలనే స్వేచ్ఛ తెలంగాణ ప్రజలకు లేదా..?
గేట్లు తెరిస్తే చాలా మంది పిరికిపందలు, స్వార్థపరులు, అసమర్థులు కాంగ్రెస్లోకి వెళుతున్నారన్నారు. ప్రవీణ్ నిజమైన, నిఖార్సుగా, నిజాయితీగా పని చేసే వ్యక్తి. ఆ గొర్రెల మందలో ప్రవీణ్ కుమార్ ఒకడు కాలేదని రేవంత్ రెడ్డి అక్కసుతో మాట్లాడుతున్నారని ఆరెస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు కేసీఆర్ నాయకత్వంలో పని చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ భవన్కు సాదరంగా ఆహ్వానించి, అక్కున చేర్చుకున్న బీఆర్ఎస్ నాయకత్వానికి హృదయపూర్వక వందనాలు తెలియజేశారు. తనను నమ్మి చివరి వరకు తనతో ప్రయాణం చేసేందుకు వచ్చిన ఆప్తులకు కూడా ధన్యవాదాలు తెలిపారు. నన్ను అక్కున చేర్చుకుని ఇంత దూరం నడిపించిన తెలంగాణ ప్రజానీకానికి పాదాభివందనాలు అని పేర్కొన్నారు.
తెలంగాణ వాదం, బహుజన వాదం రెండూ ఒక్కటే. ప్రాణహిత, గోదావరి నదులు కలిసినట్లు, కృష్ణా, తుంగభద్ర నదులు ఏ విధంగా కలుస్తాయో.. ఆ మాదిరిగానే తెలంగాణ వాదం, బహుజన వాదం ఒక్కటే అని, తరతరాలుగా అణిచివేతకు గురైన తెలంగాణకు కేసీఆర్ విముక్తి కల్పించారన్నారు. బహుజనులు కూడా అణిచివేతకు గురయ్యారు. వారికి విముక్తి కల్పించి వారిని వెలుగు వైపు నడిపించింది బహుజన వాదమన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ గత పదేండ్లలో స్వర్ణయుగాన్ని చూసిందన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం గొప్ప పునాది వేయబడింది. కేసీఆర్ అధికారంలో లేరు కానీ ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు. చాలా మంది చాలా మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ను వీడి వెళ్లిపోతున్నారు. కానీ మీరు బలగంగా వచ్చారని బీఆర్ఎస్ సీనియర్లు అన్నారని వెల్లడించారు. బహుజన వాదం అంటే స్వార్థపరులు ఉండేది కాదు. బహుజనులు స్వార్థం కోసం రారన్నారు. సంపాదన కోసం రారు, బహుజన వాదులంతా కేసీఆర్ వెంట నడవాలని నిర్ణయించుకున్నారన్నారు. తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని నిర్ణయించుకుని వచ్చామని పేర్కొన్నారు.
నా గుండెల్లో బహుజన వాదం ఉంది, మహనీయుల త్యాగాలు ఉన్నాయన్నారు. తెలంగాణ అమరవీరుల త్యాగాల సారాంశం ఉన్నదని, వారు చూపించిన దిశ వైపే నడుస్తానన్నారు. నాలో ఎలాంటి స్వార్థం లేదు, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నా గుండెల్లో త్యాగధనులు చూపించిన దిశనే ఉంది, ఆ దిశలోనే నడుస్తానన్నారు.
సోషల్ మీడియాలో ఎంత ప్యాకేజీ తీసుకున్నావని అంటున్నారన్నారు. ప్యాకేజీలకు ఆశపడే వాడిని అయితే అధికార పార్టలోనే చేరేవాడినని, ఒక యజ్ఞం కోసం బీఆర్ఎస్లో చేరానన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం వచ్చాను, తన ఆస్తులను రక్షించుకోవడానికి భయంతో పారిపోయిన పిరికిపందను కానన్నారు. ఉద్యోగాన్ని వదులకోని రాజకీయ రంగంలోకి వచ్చాను. కేసీఆర్ ఇచ్చిన అవకాశంతో పదేండ్లలో పది లక్షల మంది విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దానన్నారు. పైసలు అవసరం లేదు.. ప్రజా సేవ కోసమే వచ్చానని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి దచయేసి బెదిరించడం మానుకోవాలన్నారు. తన లోపల కూడా నడిగడ్డ గాలే ఉందని, వార్నింగ్లు ఇచ్చి హోదాను తగ్గించుకోకండని ఆరెస్ ప్రవీణ్ కుమార్ సూచించారు.