BRS | జనగామ సెంటర్ లో ముత్తిరెడ్డి నిరసన ప్రదర్శన పల్లా పైన ముత్తిరెడ్డి అనుచరుల మండిపాటు ‘స్టేషన్’లో రాజయ్య అనుచరుల ధర్నాలు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పైన తీవ్ర ఆగ్రహం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల అగ్గి రాజుకుంది. అధికారికంగా టికెట్ల ప్రకటన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో? చెప్పలేముగానీ, ప్రస్తుతం జనగామ, స్టేషన్ ఘన్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ తాటికొండ […]
BRS |
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల అగ్గి రాజుకుంది. అధికారికంగా టికెట్ల ప్రకటన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో? చెప్పలేముగానీ, ప్రస్తుతం జనగామ, స్టేషన్ ఘన్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ తాటికొండ రాజయ్య అనుచరులు రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలకు దిగారు. పార్టీలోని తమ ప్రత్యర్థ్యులతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.
తాము ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ, ఘన్ పూర్ సెగ్మెంట్ లలో ఎమ్మెల్సీలుగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరిలు టికెట్ తమదే అంటూ ప్రచారం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సెగ్మెంట్లలో ఎమ్మెల్సీల అతి జోక్యం చేసుకోవడాన్ని తీవ్రంగా మండిపడుతున్నారు. అసమ్మతిని పెంచి పోషిస్తున్నారని ఆగ్రం వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం వైఖరిని ప్రత్యక్షంగా విమర్శించకుండా తమ కంట్లో నలుసులా మారిన ఎమ్మెల్సీలపై ఎమ్మెల్యేలు విరుచుకపడ్డారు.
జనగామలో భారీ నిరసన ప్రదర్శన
గత వారం రోజులుగా జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ లో అధికార బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న వర్గపోరుతో అట్టుడుకుతోంది. సిటింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అసమ్మతిని పెంచిపోషిస్తున్నారు. జనగామ నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యేకు తెలువకుండా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో ముత్తిరెడ్డి పల్లా పై తీవ్ర ఆగ్రహం కనబరుస్తున్నారు.
ఇప్పటికే హైదరాబాద్ లో తన సెగ్మెంట్ కు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులతో భారీ సమావేశం నిర్వహించి పల్లా రాజేశ్వర్ రెడ్డి తీరును దుయ్యబట్టారు. అధిష్టానానికి ఆ సమావేశం నుంచి అప్పీలు చేశారు. తాజాగా శనివారం జనగామ జిల్లా కేంద్రంలో అనుచరులు, ప్రజాప్రతినిధులతో పల్లా రాజేశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్ చౌరస్తాలో ధర్నా చేపట్టి పల్లా పైన నిప్పులు చెరిగారు. పల్లా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆయన అనుచరులు పల్లా పై మండిపడ్డారు. పెద్ద సంఖ్యలో ముత్తిరెడ్డి అనుచరులు ఈ నిరసనలో భాగస్వామ్యమయ్యారు.
కార్పొరేట్ పద్ధతిలో పల్లా కుట్ర: ముత్తిరెడ్డి
జనగామ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కార్పొరేట్ పద్ధతిలో కుట్రకు పాల్పడ్డారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్సీగా ఏడేండ్లలో ఎప్పుడూ ఈ సెగ్మెంట్ లో ముఖం చూపెట్టని పల్లా ఇప్పుడు తనకు వ్యతిరేకంగా గోతులు తీస్తున్నారని విమర్శించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా నేను ఉండగా ఇక్కడి ప్రజాప్రతినిధులకు డబ్బులిచ్చి కొనాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు. తనకే టికెట్ వచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ముత్తిరెడ్డి కన్నీరుపెట్టుకున్నారు. టికెట్లు ప్రకటించకముందే ఈ తప్పుడు విధానాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నియోజకవర్గం హద్దులు కూడా పల్లాకు తెలియదని ఎద్దేవా చేశారు. ఉద్యమంలో లేని పల్లా నీచమైన పద్ధతిని అనుసరిస్తున్నారని అన్నారు. తన కుటుంబంలో చిచ్చుపెట్టారని, తన బిడ్డను రోడ్డుకీడ్చారని విమర్శించారు.
జనగామ ఉద్యమాల గడ్డ అంటూ గుర్తుచేశారు. జనగామను మరో హుజురాబాద్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మూడు నెలల నుంచి తన కాలేజీ స్టాఫ్ తో గ్రామాల్లో పోలీస్ స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారని విమర్శించారు. బ్యాక్ డోర్ పాలిటిక్సుకు తెరతీశారని, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కొడుకుతో జత కలిశారని విమర్శించారు. తనకే టికెట్ వస్తుందని ముత్తిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
స్టేషన్ ఘన్ పూర్ లో నిరసనలు
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అనుచరులు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తీరుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. శుక్రవారం నియోజకవర్గంలో తన అనుచరులతో నిర్వహించిన సమావేశంలో కడియం మాట్లాడుతూ ఎమ్మెల్యే మార్పు తప్పదని, అధినేత తనకు అవకాశం కల్పిస్తే దీవించాలంటూ చేసిన ప్రకటనతో రాజయ్య అనుచరులు భగ్గుమన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు చేపట్టారు. కడియం దిష్టిబొమ్మల దగ్ధానికి పిలుపు నిచ్చారు. దీంతో రాజయ్య అనుచరులు ఆందోళనకు దిగారు. కరుణాపురం వద్ద కడియం దిష్టిబొమ్మ దగ్ధానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.