Narcotics Control Bureau | ఇంటర్నేషనల్‌ డ్రగ్స్‌ కార్టెల్‌ నెట్‌వర్క్‌ను ఛేదించిన ఎన్‌సీబీ..! పరారీలో సూత్రధారి సినీ నిర్మాత..!

ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌తోకలిసి భారీ ఇంటర్నేషనల్‌ డ్రగ్స్‌ కార్టెల్‌ నెట్‌వర్క్‌ను ఛేదించినట్లు నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో తెలిపింది.

Narcotics Control Bureau | ఇంటర్నేషనల్‌ డ్రగ్స్‌ కార్టెల్‌ నెట్‌వర్క్‌ను ఛేదించిన ఎన్‌సీబీ..! పరారీలో సూత్రధారి సినీ నిర్మాత..!

Narcotics Control Bureau | ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌తోకలిసి భారీ ఇంటర్నేషనల్‌ డ్రగ్స్‌ కార్టెల్‌ నెట్‌వర్క్‌ను ఛేదించినట్లు నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో తెలిపింది. ఈ సందర్భంగా ముగ్గురిని అరెస్టు చేయడంతో పాటు డ్రగ్స్‌ తయారీకి వినియోగించే 50 కిలోల సూడోపెడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అరెస్టయిన నిందితుల్లో ముగ్గురు తమిళనాడుకు చెందిన వ్యక్తులున్నారు.


ఈ డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ భారత్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, మలేషియాలో విస్తరించినట్లు ఎన్‌సీబీ పేర్కొంది. ఆపరేషన్‌లో ఢిల్లీలో ముగ్గురిని అరెస్టు చేసి 50 కిలోల సూడోఎఫెడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నామని ఎన్‌సీబీ ప్రతినిధి పేర్కొన్నారు. సూడోఎఫెడ్రిన్‌ను మెథాంఫెటమైన్‌ తయారీలో ఉపయోగిస్తుంటారు. హెల్త్ మిక్స్ పౌడర్, ఎండుకొబ్బరి తదితర ఆహార ఉత్పత్తుల ముసుగులో దాచిపెట్టి సముద్ర మార్గం ద్వారా అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.

సూత్రధారి తమిళ నిర్మాత


ముఠా సూత్రధారిలో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతను గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. సూడోఎఫెడ్రిన్ మూలాన్ని గుర్తించేందుకు వీలుగా నిర్మాతను పట్టుకునేందుకు గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ నెట్‌వర్క్ గురించి న్యూజిలాండ్ కస్టమ్స్, ఆస్ట్రేలియా పోలీసుల నుంచి సమాచారం అందిందని పేర్కొన్నారు. ఎండు కొబ్బరి పొడిలో దాచి పెద్ద ఎత్తున సూడోపెడ్రిన్‌ను ఆయా దేశాలకు పంపుతున్నట్లుగా ప్రతినిధి పేర్కొన్నారు. యూఎస్‌ డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి సమాచారం ఆధారంగా ఢిల్లీ డ్రగ్స్‌కు మూలమని సూచిస్తున్నాయని చెప్పారు.


సూడోఎఫెడ్రిన్‌తో తయారైన మెథాంఫెటమైన్ డ్రగ్‌ ప్రపంచవ్యాప్తంగా భారీగా డిమాండ్‌ ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో కిలో రూ.1.5 కోట్లకు విక్రయిస్తున్నట్లు ఎన్‌సీబీ ప్రకటనలో పేర్కొంది. డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను పట్టుకునేందుకు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, ఎన్‌సీబీ ఆధ్వర్యంలో సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేసినట్ుల పేర్కొన్నారు. ఎన్‌సీబీ, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ బృందాలు నాలుగు నెలల పాటు సాంకేతిక, క్షేత్రస్థాయిలో తీవ్ర నిఘా పెట్టిందని తెలిపింది. ముఠా నిర్వాహకులు మళ్లీ ఢిల్లీలో ఉన్నారని, మరో డ్రగ్స్‌ను ఆస్ట్రేలియాకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారని తేలిందని ప్రకటనలో పేర్కొంది.

రూ.2వేలకోట్ల డ్రగ్స్‌ రవాణా..


ఈ క్రమంలో నిందితుల ఢిల్లీ పోలీస్‌ ప్రత్యేక విభాగం 24గంటల పాటు నిఘా పెట్టి.. చివరకు ఢిల్లీలోని బసాయి దారాపూర్‌లోని గోడౌన్‌లో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఆ తర్వాత లింక్‌లపై విచారణ జరుపగా.. 15న పశ్చిమ ఢిల్లీలోని బసాయి దారాపురా ప్రాంతంలోని ఒక గోదాముపై దాడి చేసి, అక్కడ బస్తాల్లో నిల్వ ఉంచిన 50 కిలోల సూడోపెడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రతినిధి పేర్కొన్నారు.


ముఠాలోని ముగ్గురిని అక్కడికక్కడే అరెస్టు చేశామని, విచారణ అనంతరం గత మూడేళ్లలో మొత్తం 45సార్లు పంపామని.. అందులో దాదాపు 3500 కిలోల సూడోఎఫెడ్రిన్ ఉందని, దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.2వేల కోట్లకుపైగా ఉంటుందని ఎన్‌సీబీ తెలిపింది. నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ఆయా దేశాల్లో ఉన్న కార్యకర్తలను అరెస్టు చేసేందుకు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అధికారులను సంప్రదించిందని ఎన్‌సీబీ ప్రతినిధి వివరించారు.