Triple IT భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు 48 గంటల లోపు లిఖిత మృతిపై నివేదిక ఇవ్వాలని గవర్నర్ ఆదేశం విధాత, ఉమ్మడి ఆదిలాబాద్ ప్రతినిధి: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటిలో లిఖిత అనే పియుసి స్టూడెంట్ మృతి చెందిన నేపథ్యంలో విద్యార్థినికి న్యాయం చేయాలని ఏబీవీపి ఆధ్వర్యంలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ముట్టడికి ప్రయత్నించారు. బాసర ట్రిపుల్ ఐటీ వద్ద నేడు మళ్లీ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరణించిన విద్యార్థులకు న్యాయం చేయాలని […]
Triple IT
విధాత, ఉమ్మడి ఆదిలాబాద్ ప్రతినిధి: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటిలో లిఖిత అనే పియుసి స్టూడెంట్ మృతి చెందిన నేపథ్యంలో విద్యార్థినికి న్యాయం చేయాలని ఏబీవీపి ఆధ్వర్యంలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ముట్టడికి ప్రయత్నించారు. బాసర ట్రిపుల్ ఐటీ వద్ద నేడు మళ్లీ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరణించిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సుమారు 20 మంది ఏబీవీపీ కార్యకర్తలు బాసర ట్రిపుల్ ఐటీ ప్రధాన ద్వారం వద్ద ముట్టడికి ప్రయత్నించారు.
ట్రిపుల్ ఐటీ ముట్టడికి ప్రయత్నించిన 20 మంది ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి బాసర స్టేషన్ కు తరలించారు. నేడు 48 గంటల లోపు బాసర క్యాంపస్ లో ఆత్మహత్య చేసుకున్న లిఖిత మరణం పై పూర్తిస్థాయి దర్యాప్తు నివేదిక ఇవ్వాలని గవర్నర్ తమిళసై విసీకి ఆదేశాలు జారీ చేశారు.
గత రెండు రోజుల క్రితం దీపిక అనే విద్యార్థిని చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగిన 48 గంటల లోపే మరో పియూసి ప్రథమ సంవత్సరం చదువుతున్న బూర లిఖిత అనే విద్యార్థిని అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో నాలుగంతస్తుల భవనం పై నుండి కింద పడి మృతి చెందింది. అయితే ఇది ఆత్మహత్య కాదు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
బూర లిఖిత స్వస్థలం సిద్దిపేట జిల్లా గజ్వేల్. అయితే కింద పడి ఉన్న లిఖితను గమనించిన భద్రతా సిబ్బంది ట్రిపుల్ ఐటి క్యాంపస్ లోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అపస్మారక స్థితిలో ఉన్న లిఖితను భైంసా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు విద్యార్థిని పరీక్షించి ఆమె మృతి చెందినట్లు ధృవీకరించారు.
అనంతరం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా వరుస సంఘటనల నేపథ్యంలో నిర్మల్ లోని జిల్లా ఆసుపత్రికి వచ్చిన ఇంచార్జ్ విసి వెంకటరమణ ను బిజెపి, కాంగ్రెస్, విద్యార్థి సంఘాల నాయకులు ఘెరావ్ చేశారు. వీసీ వాహనాన్ని అడ్డుకొని వీసీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో విసి ఏమి మాట్లాడకుండానే పోలీసుల రక్షణలో బయటకు వెళ్ళిపోయారు.
నిన్న నిర్మల్ ఆసుపత్రి వద్ద కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. అయితే విద్యార్థిని మొబైల్ ఫోన్ చూస్తూ కిందపడిపోయిందని చెబుతున్నారు. మరోవైపు ట్రిపుల్ ఐటిలో వరుసగా జరుగుతున్న ఆత్మహత్యల నేపథ్యంలో బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, ఇతర నాయకులు ట్రిపుల్ ఐటిని ముట్టడించారు. దీంతో బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు ట్రిపుల్ ఐటి వద్ద భారీకేడ్లను ఏర్పాటు చేసి బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రధాన గేటును మూసివేశారు.
ముట్టడికి వచ్చిన జిల్లా అధ్యక్షురాలు రమాదేవితో పాటు ఇతర భాజపా నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదిలా ఉంటే విద్యార్థినుల ఆత్మహత్యలకు ట్రిపుల్ ఐటీ వీసి, డైరెక్టర్ ఇద్దరు బాధ్యత వహించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. విసి, డైరెక్టర్ లను ఆ పదవుల నుండి తప్పించడంతోపాటు విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలని, రెగ్యులర్ విసిని నియమించాలని డిమాండ్ చేశారు.