టీటీడీలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమద్దీకరణ చేయాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేయాలని తీర్మానించింది
విధాత: టీటీడీలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమద్దీకరణ చేయాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేయాలని తీర్మానించింది. సోమవారం చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన ధర్మకర్తల మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. స్విమ్స్ ఆసుపత్రిలో రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు 479 నర్సు పోస్టులు క్రియేట్ చేసేందుకు ఆమోదం తెలిపింది. టీటీడీ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థినీ విద్యార్థులందరికీ ఎలాంటి సిఫారసు లేకుండా హాస్టల్ వసతి కల్పించాలని ని ర్ణయించిన ధర్మకర్తల మండలి అందుకు అవసరమైన హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. వీటితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఈ సమావేశం నిర్ణయం తీసుకున్నది. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలవలవన్, ఈవో ఎవి.ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మంతో పాటు పలువురు బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
టీటీడీ తీసుకున్న నిర్ణయాలు ఇవే…
-రూ.1.88 కోట్లతో తిరుమలలో భక్తుల సౌకర్యార్థం పిఏసి-1 లో 10 లిఫ్టులు ఏర్పాటుకు టెండరు ఆమోదం.
– రూ.1.50 కోట్లతో బాలాజి నగర్ తూర్పువైపున, అదేవిధంగా, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం ఔటర్ కార్డన్ ప్రాంతంలో మిగిలిపోయిన ఫెన్సింగ్ ఏర్పాటుకు ఆమోదం.
– రూ.14 కోట్లతో తిరుమలలో టీటీడీ ఉద్యోగుల పాత సి టైప్, డి టైప్, కొత్త సి టైప్, డి టైప్ క్వార్టర్లలో మిగిలి ఉన్న 184 క్వార్టర్ల అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆమోదం.
– తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని భాష్యకార్ల సన్నిధిలోని మకర తోరణానికి, శ్రీ పార్థసారథిస్వామి, శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి తిరువాభరణాలకు బంగారు పూత పూసేందుకు ఆమోదం.
– టీటీడీ ఐటీ సేవల కోసం టైర్ 3 డేటా సెంటర్, డిజాస్టర్ రికవరీ సెంటర్ ఉన్నాయి. ఐటి స్టాండర్డ్ ప్రోటోకాల్ ప్రకారం లైఫ్సైకిల్ మేనేజ్మెంట్ ప్రక్రియలో భాగంగా ప్రతి ఏడు సంవత్సరాలకోసారి టెక్ రీప్లేస్మెంట్ చేయాలి. ఇందులోభాగంగా ఐదేళ్ల పాటు డేటా సెంటర్ల మెయింటెనెన్స్ కోసం రూ.12 కోట్లు మంజూరుకు ఆమోదం.
– టీటీడీ ఆధ్వర్యంలో 15 చారిత్రాత్మక, పురాతన ఆలయాలు, 13 టీటీడీ నిర్మించిన ఆలయాలు, 22 ఆధీనంలోకి తీసుకున్న ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లో అవసరమైన అభివృద్ధి పనులను శ్రీవాణి ట్రస్టు నిధుల ద్వారా చేపట్టేందుకు పాలన అనుమతికి ఆమోదం.
– ఇటీవల ఘాట్ రోడ్డులో ప్రమాదవశాత్తు మరణించిన తిరుమల శ్రీవారి ఆలయ పరిచారిక శ్రీయతిరాజన్ నరసింహన్ కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నాం.