ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఓటు అనే వజ్రాయుధాన్ని నాయకులకు బుద్ధి చెప్పేందుకు వాడారు
విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఓటు అనే వజ్రాయుధాన్ని నాయకులకు బుద్ధి చెప్పేందుకు వాడారు. ప్రజలకున్న ఏకైక ఆయుధం ఓటుతో గుద్దితే.. నోటిదూల ఉన్న నేతలు ఇండ్లకే పరిమితమయ్యారు. ‘ప్రజలకు మంచి పరిపాలన అందించాల్సిన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు తమకు ఇచ్చిన పరిపాలన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తే.. ప్రజలు తమకు సమయం వచ్చినప్పుడు నేతలకు కర్రు కాల్చి వాత పెడతారు’.. సరిగ్గా ఈ తరహాలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. నోటి దుల ఉన్న ఎమ్మెల్యేలను ఇంటికి పరిమితం చేసింది.
ప్రజారంజక పాలన అందించాల్సిన ఎమ్మెల్యేలు ప్రజలతో ఎలా మెలగాలో తెలుసుకోకపోవడం, తల పొగరు, అహంకారంతో వ్యవహరించడంతో ఓటుతో ప్రజలు బుద్ధి చెప్పారని జిల్లాలో చర్చ జరుగుతోంది. ఆదివారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో ప్రజలు తమ అసంతృప్తిని ఏస్థాయిలో వెళ్ళగక్కారో స్పష్టమైంది. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రజలతో సార్ అనిపించుకోవడం.. సంక్షేమ పథకాలు అడిగితే అసహనం వ్యక్తం చేయడం.. భార్యాభర్తల పంచాయితీలను ఎమ్మెల్యేలే తీర్చడం.. వినకపోతే పోలీసు కేసులు పెట్టడం.. కొట్టి చంపుతా? గుద్ది సంపుతా? అంతు చూస్తా అని ఒకరు.. మేము వేసిన రోడ్లపై నడువద్దంటూ మరొకరు హుకుం జారీ చేయటం జీర్ణించుకోలేని ప్రజలు.. అట్టి ఎమ్మెల్యేలను ఓటుతో గుద్దితే గూటికే పరిమితమయ్యారు.
కొన్ని నియోజకవర్గాల్లో దళితులపై దాడులు చేయించడం.. సమస్యలపై మాట్లాడిన యువతను బెదిరించడం కూడా ఎమ్మెల్యేలపై ప్రజల్లో పూర్తి అసంతృప్తిలోకి నెట్టేసాయి. దీంతో ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులకు ఎన్నికల్లో 50 వేల మెజారిటీతో గెలిపించారు. ఎమ్మెల్యేలపై అసంతృప్తితో రగిలిపోయిన ప్రజలు ఎన్నికల్లో సరైన విధంగా గుణపాఠం చెప్పారని చర్చ నడుస్తోంది. ఎన్నికల ఫలితాలపై రాజకీయ విశ్లేషకులు, ప్రజల అభిప్రాయాలను పరిశీలిస్తే…
నల్గొండ: ఎమ్మెల్యేగా కంచర్ల భూపాల్ రెడ్డి ప్రతి ప్రసంగంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టార్గెట్గా వ్యవహరించారు. 20 ఏళ్లు పరిపాలించిన కోమటిరెడ్డి నల్గొండను పట్టించుకోవడంలేదని ప్రచారం చేశారు. అనేకసార్లు ప్రజలపై, సొంత పార్టీ నేతలపై నోటికొచ్చినట్లు మాట్లాడడం కంచర్లపై తీవ్ర వ్యతిరేకతను తెచ్చిపెట్టింది. నల్గొండ జిల్లాకేంద్రంలో అభివృద్ధి కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నప్పటికీ, ప్రజలు ఎమ్మెల్యేగా భూపాల్ రెడ్డి మరోసారి గెలిపించేందుకు సాహసం చేయలేదు. అనేక సందర్భాల్లో కార్యకర్తలపై, కౌన్సిలర్లపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోవడం, అడ్డగోలుగా మాట్లాడడం, పలువురిని బూతులు తిడుతూ బెదిరించడం లాంటి సంఘటనలు ఆయనకు తీరని నష్టం చేకూర్చాయి. ఇదిలాఉంటే జిల్లాకేంద్రంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తున్నట్టే చేసి, కొంతమంది సీనియర్లుగా ముద్ర వేసుకున్న వారికి అక్రమంగా కోట్ల రూపాయల భూమిని అప్పనంగా అప్పజెప్పడం ఆయనకు మరింత మైనస్ అయింది. ఇలా భూపాల్ రెడ్డి ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. దీంతో ప్రజలు పాత కాపు బెటర్ అని కోమటిరెడ్డికి విజయం అందించారు.
మిర్యాలగూడ: ఎమ్మెల్యేగా భాస్కరరావు కూడా నోరును అదుపులో పెట్టుకోలేకపోయారు. తద్వారా ఘోర పరాభవం చవిచూసారు. వేములపల్లిలో అభివృద్ధి పనులకు వచ్చిన ఆయనను ఓ మహిళ డబుల్ బెడ్ రూమ్ కోసం నిలదీయగా అసహనానికి గురైన భాస్కర్ రావు ఆమెను మహిళ అని చూడకుండా బూతు పురాణం మొదలుపెట్టాడు. దాన్ని ఈడ్చి పారేయండి.. దాని అంతు చూడండి అంటూ పోలీసులతో ఆమెను బయటకు నెట్టి వేయించాడు. అదేవిధంగా మిర్యాలగూడ పట్టణంలో జరిగిన ఓ సభలో అంగన్వాడీలు తమ సమస్యను విన్నవించుకునేందుకు పోగా, వారిని కూడా భాస్కరరావు అసభ్య పదజాలంతో తిట్టడమే కాకుండా తాను తలుచుకుంటే తట్టాపార ఇచ్చి కూలి పనికి పంపిస్తానంటూ బహిరంగంగానే బెదిరించడం ఆయనకు వ్యతిరేకతను తెచ్చిపెట్టింది. ఇక దామరచర్లలో కొందరు కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారని తెలిసి, కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా వెళ్తే తాను వేసిన రోడ్లపై నడువద్దంటూ హుకుం జారీ చేయడం వివాదాస్పదమైంది. దీంతో స్థానిక ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మారెడ్డికి భారీ మెజార్టీతో పట్టంకట్టారు.
భువనగిరి: ఎమ్మెల్యేగా పైల శేఖర్ రెడ్డి పూర్తిగా కార్పొరేట్ స్టైల్ లో పాలన అందించడం ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యంగా త్రిబుల్ ఆర్ రోడ్డు పనుల్లో భాగంగా భూములు కోల్పోయిన రైతులు ఉద్యమాలు చేస్తే వారికి సంకెళ్లు వేసి జైల్లో పెట్టడాన్ని అక్కడి రైతులు జీర్ణించుకోలేకపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యే, ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. ఇలాంటి కారణాలతో కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కి గొప్ప విజయాన్ని చేకూర్చారు.
ఆలేరు: గొంగడి సునీత మహేందర్రెడ్డి ఎమ్మెల్యేగా ఏకపక్షంగా వ్యవహరించడం, ప్రజలతో మమేకమవ్వకపోవడంతో ప్రజలందరూ సమయం కోసం ఎదురు చూశారు. ఏ పథకమైనా, పని అయినా కేవలం భర్త మహేందర్ రెడ్డి చూసుకోవడం, నేరుగా ఆమెను కలిసే అవకాశం లేకపోయింది. మరోవైపు ప్రజలతో వారు దురుసుగా వ్యవహరించడం ఓటమికి ప్రధాన కారణంగా చర్చించుకుంటున్నారు.
హుజూర్ నగర్: శానంపూడి సైదిరెడ్డి ఎమ్మెల్యే హోదాలో నియోజకవర్గ కేంద్రాన్ని పట్టించుకోకపోవడం స్థానికుల్లో కోపం పెంచింది. ఇంకా దుమ్మూధూళి, గతుకుల రోడ్లు ఒకవైపు అయితే, మరోవైపు ఆయన ప్రజలతో మమేకం కాకపోవడం, సమస్యలను పట్టించుకోకపోవడం విమర్శలపాలైంది. కేవలం భూ దందాలు, సెటిల్మెంట్లకే ప్రాధాన్యత కల్పిస్తున్నారని ఆరోపణలు అనేకం ఉన్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడడం, అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడంలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందుకే ప్రజలు అక్కడ ఉత్తంకుమార్ రెడ్డిని గెలిపించారు.
నాగార్జునసాగర్: నోముల భగత్ ఏకపక్షంగా వ్యవహరించడం, కనీసం తమ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులను, ప్రజలను, సీనియర్లను పట్టించుకోకపోవడం ఆయనకు మైనస్ అయింది. తన మామ సంపత్ అన్ని రాజకీయాలు, పోలీస్ స్టేషన్లో పంచాయితీలు, సెటిల్మెంట్లు చేయడం, వ్యతిరేకంగా ఉన్నవారిని అణిచివేసే ధోరణి అవలంభించడం భగత్ ను ఓడించాయి. ఎమ్మెల్యే హోదాలో ఉన్న భగత్ కనీసం జర్నలిస్టులను కూడా అడ్డమీది కూలీలుగా చూడడం, అసలు ప్రజలకు సమయం కేటాయించకపోవడంతో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న ఆయన ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యారు. దీంతో మొదటిసారి పోటీ చేసిన కుందూరు జైవీర్ రెడ్డిని భారీ మెజార్టీతో జనం గెలిపించారు.
దేవరకొండ: ఎమ్మెల్యేగా ఉన్న రామావత్ రవీంద్ర కుమార్ గిరిజన సామాజిక వర్గం నుంచి వచ్చినప్పటికీ అట్టడుగు వర్గాల ప్రజలను కలుపుకోకపోవడం విమర్శలపాలైంది. కనీసం వారి సమస్యలను వినకపోవడం పట్ల తీవ్ర వ్యతిరేకతను తెచ్చింది. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలతో దుర్భాషలాడడంతో పాటు తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని పోలీస్ స్టేషన్లో పెట్టి అణిచివేయడం స్థానికంగా ఎంతో వ్యతిరేకతను తెచ్చిపెట్టింది. దీంతో అక్కడి గిరిజనులు అంతా కాంగ్రెస్ అభ్యర్థి బాలునాయక్ ను 30 వేల మెజారిటీతో గెలిపించారు.
కోదాడ, నకిరేకల్: ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్న బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్యలు తమ నోటితో ప్రజలకు దూరమయ్యారు. ఇతర పార్టీ నేతలపై నోరు పారేసుకోవడమే కాకుండా, ప్రతి చిన్న పంచాయితీ తామే చేయాలనుకోవడం, భార్యాభర్తల పంచాయితీలు కూడా తమ వద్దకు రావాలనుకోవడం వారిపై వ్యతిరేకతను పెంచాయి. దీంతో ప్రజలు ఓటు ఆయుధంతో వారిని గూటికి పరిమితం చేశారు. దీంతో నకిరేకల్ లో వేముల వీరేశంకు అత్యధికంగా 68 వేల ఓట్ల మెజారిటీ ఇవ్వగా, కోదాడలో పద్మావతికి 50 వేల మెజార్టీతో ప్రజలు గెలిపించారు.