తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మిస్తాం.. మహారాష్ట్రను ఒప్పించండి
మోడీకి ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

- ప్రధానికి మోదీకి సీఎం రేవంత్రెడ్డి వీడ్కోలు
- 11 అభివృద్ధి అంశాలపై వినతి పత్రం
విధాత, హైదరాబాద్ : తెలంగాణలో రెండు రోజుల పర్యటన ముగించుకుని ఢిల్లీ బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్రెడ్డి బేగంపేట్ ఏయిర్ పోర్టులో వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి 11అభివృద్ధి అంశాలపై మొమోరాండాలను సీఎం రేవంత్రెడ్డి స్వయంగా ప్రధానికి అందించారు. గతంలో ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధానిని కలిసినప్పుడు అందజేసిన విజ్ఞప్తులకు తోడుగా మరికొన్ని విజ్ఞప్తులతో కూడిన వినతి పత్రాలను మోదీకి రేవంత్ అందజేశారు.
అభివృద్ధి పనులతో పాటు పలు ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం నుంచి సహకారాన్ని సీఎం రేవంత్ వినతులలో అభ్యర్థించారు. తాజాగా అదిలాబాద్లో జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీతో పాటు పాల్గొన్న సీఎం రేవంత్రెడ్డి ప్రధాని మాకు పెద్దన్న లాంటి వారని, కేంద్రంతో తాము ఘర్షణ పడబోమని, ఎన్నికలప్పుడే రాజకీయాలని, గుజరాత్ తరహాలో తెలంగాణ అభివృద్ధికి మోదీ సహకారం అందించాలని కోరారు. ఈ మేరకు 11అంశాలపై వినతులు అందించారు.
1. ఎన్టీపీసీలో 4000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉంటే గత ప్రభుత్వం 1600 మెగావాట్లు మాత్రమే సాధించింది. మిగిలిన 2400 మెగావాట్ల ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని అనుమతులు ఇస్తాం.
2. హైదరాబాద్ మెట్రో విస్తరణ అభివృద్ధికి, మూసీ ప్రక్షాళన రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సహకరించండి.
3. తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భూసేకరణ, నీటి వాటాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేంందుకు ప్రధాని జోక్యం చేసుకోవాలి.
4. హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై అమ్రాబాద్ ఫారెస్ట్ ఏరియా మీదుగా ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి సహకరించాలి. 2022–23లోనే కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ తయారీకి రూ,3 కోట్లు మంజూరు చేసింది. రూ.7700 కోట్ల అంచనా ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును మంజూరు చేయాలి. ఈ కారిడార్ తో అటు శ్రీశైలం వెళ్లే యాత్రికులతో పాటు హైదరాబాద్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లా వరకు 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దక్షిణ తెలంగాణ వైపు రవాణ మార్గాలు విస్తరిస్తాయి.
5. రాష్ట్రంలో నూటికి నూరు శాతం ఇంటింటికీ నల్లా నీటిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలి. దాదాపు పది లక్షల కుటుంబాలకు ఇప్పటికీ నల్లా నీళ్లు అందటం లేదు. సమీపంలోని నీటి వనరుల ద్వారా గ్రామాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల జీవన్ మిషన్ నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
6. తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్య , పోలీస్ కమిషనరేట్ల సంఖ్యకు అనుగుణంగా ఐపీఎస్ క్యాడర్ రివ్యూ చేయాలి. కేంద్ర హోంశాఖ 2016లో తెలంగాణకు 76 ఐపీఎస్ కేడర్ పోస్టులను మంజూరు చేసింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, పెరిగిన జనాభాను బట్టి రాష్ట్రంలో పోలీసు అధికారుల అవసరం పెరిగింది. అత్యవసరంగా 29 పోస్టులను అదనంగా కేటాయించాల్సి ఉంది. ఐపీఎస్ క్యాడర్ రివ్యూను అత్యవసర అంశంగా పరిగణించాలి. వీలైనంత త్వరగా పోస్టులు మంజూరు చేయాలి.
7. హైదరాబాద్– రామగుండం, హైదరాబాద్–నాగ్పూర్ రహదారిపై రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. వీటితో పాటు కారిడార్ల నిర్మాణానికి కంటోన్మెంట్ ఏరియాలో 178 ఎకరాలు, 10 టీఎంసీల కేశవపురం రిజర్వాయర్ నిర్మాణానికి పొన్నాల గ్రామ సమీపంలోని 1350 ఎకరాల మిలిటరీ డెయిరీ ఫామ్ ల్యాండ్స్ (తోఫెఖానా) రాష్ట్రానికి బదిలీ చేయాలి. లీజు గడువు ముగిసిన శామీర్ పేటలో ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ (1038 ఎకరాల) భూములను తిరిగి అప్పగించాలి.
8. ఐఐటీ, నల్సార్, సెంట్రల్ యూనివర్సిటీ తో పాటు ఎన్నో పేరొందిన పరిశోధన, ఉన్నత విద్యా సంస్థలు హైదరాబాద్ లో ఉన్నాయి. అత్యున్నత విద్యా సంస్థలు అందరికీ అందుబాటులో ఉండాలని ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐఎం నెలకొల్పాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. అందులో భాగంగా హైదరాబాద్లో ఐఐఎం (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్) నెలకొల్పాలి. అందుకు అవసరమైనంత స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది.
9. నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తున్నాం. 5259 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ప్రభుత్వం నిర్వహిస్త్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర వాటాగా రాష్ట్రానికి రావాల్సిన రూ.347.54 కోట్లను వెంటనే విడుదల చేయాలి.
10. భారత్ మాల పరియోజన జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా తెలంగాణకు ప్రయోజనంగా ఉండే ఎనిమిది ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి. కల్వకుర్తి–కొల్లాపూర్, గౌరెల్లి–వలిగొండ, తొర్రూర్–నెహ్రూనగర్, నెహ్రూనగర్–కొత్తగూడెం, జగిత్యాల–కరీంగర్ ఫోర్ లేన్, జడ్చర్ల–మరికల్ ఫోర్ లేన్, మరికల్–డియసాగర్ నిలిచిపోయిన టెండర్ల ప్రక్రియకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలి.
11. తెలంగాణలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం సహకారాన్ని కోరుతున్నాం. ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ప్రధాన పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. సెమీ కండక్లర్లు, డిస్ ప్లే మ్యానుఫ్యాక్షరింగ్ రంగంలో కొత్త శకానికి నాంది పలికేందుకు ఇండియా సెమీ కండకర్ల మిషన్లో భాగంగా కేంద్రం సాయం అందించాలని ప్రధానికి విన్నవించారు.