బెంగాల్లో ఏసీ బస్సులో మంటలు.. 30 మంది ప్రయాణికులకు గాయాలు
ఒడిశాకు చెందిన ఏసీ లగ్జరీ బస్సులో మంటలు చెలరేగాయి. 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

విధాత: ఒడిశాకు చెందిన ఏసీ లగ్జరీ బస్సులో మంటలు చెలరేగాయి. 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ్ మెదినీపూర్ జిల్లాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. కోల్కతాలోని బాబుఘాట్లో సాయంత్రం 5 గంటలకు ఒడిశాలోని పారాదీప్కు బయలుదేరిన బస్సు రాత్రి 10 గంటల ప్రాంతంలో మదబ్పూర్ ప్రాంతానికి చేరుకోగానే మంటలు చెలరేగాయి.
బస్సులోని ప్రయాణికులు పక్క అద్దాలను పగులగొట్టి వాహనంలోంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. వీరిలో కొందరు రోడ్డు పక్కన ఉన్న గోతిలో పడిపోయారు. మంటలను గమనించి వాహనాన్నిడ్రైవర్ నిలిపివేశాడు. ఈ ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప దవాఖానలకు తరలించారు. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అయితే అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.