పెరుగుతున్నజనాభా, తరుగుతున్న అడవులు, వన్యప్రాణుల జీవితాలకు పెను ముప్పుగా తయారైంది. క్రమంగా అడవి జంతువులు కనుమరుగై పోతున్నాయి
భోపాల్ : పెరుగుతున్నజనాభా, తరుగుతున్న అడవులు, వన్యప్రాణుల జీవితాలకు పెను ముప్పుగా తయారైంది. క్రమంగా అడవి జంతువులు కనుమరుగై పోతున్నాయి. ఇటువంటి సమయంలో మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లోకి కొత్తగా ఆరుగురు అతిథులు వచ్చారనే శుభవార్త తెలిసింది. మరీ ముఖ్యంగా జంతు ప్రేమికులను ఆనందానికి గురి చేసింది.
ఆఫ్రికా ఖండం నుంచి తీసుకొచ్చిన చిరుతలను మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లా కునో ఇంటర్నేషనల్ పార్కులో కాపాడుతున్న విషయం తెలిసిందే. అందులో ‘గామిని’ అనే చిరుత ఐదు కూనలకు జన్మనిచ్చిందని తొలుత వార్తలు వచ్చినా.. ఐదు కాదు.. ఆరు కూనలకు జన్మనిచ్చిందని నేషనల్ పార్క్ అధికారులు మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేశారు. దీంతో ఇక్కడి చీతాల సంఖ్య 27కు పెరిగింది.
కునో నేషనల్ పార్క్లో దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన ‘గామిని’ అనే చిరుత.. వారం క్రితం 5 కూనలకు జన్మనిచ్చినట్లు వార్తలు బయటికివచ్చాయి. దాంతో దేశంలో పెద్ద పులుల సంఖ్య పెరిగి 26కి చేరుకుందని అధికారులు తెలిపారు. ఈ వార్త వెలువడిన కొద్దిరోజులకే మరో వార్త వచ్చింది. గామిని జన్మనిచ్చింది ఐదు కూనలకు కాదని, ఆరు కూనలకని దాంతో ప్రస్తుతం దేశంలో చిరుతల సంఖ్య 27కు చేరుకుందని పార్క్ అధికారులు తెలిపారు. చిరుత ప్రసవించిన వారం రోజుల తర్వాత అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించగా మొత్తం ఆరు పులి కూనలు ఉన్నట్లు కనుగొన్నారు.
ఈ విషయంపై అధికారులు తమ ఆనందాన్ని వ్యక్తం జేస్తూ పలు సోషల్ మీడియా వేదికలపై జరిగిన గామినీ ఉదంతాన్ని ఉల్లేఖిస్తూ పోస్టులు పెట్టారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తూ కునో పార్క్ చరిత్రలో ఒక ఆడ చిరుత, ఆరు కూనలకు జన్మనివ్వడం ఇదే తొలిసారి అని తెలిపారు. గామిని చిరుతకు తన అభినందనలు తెలియజేశారు. గామినికి ప్రత్యేక సౌకర్యాలు, ఆహార సదుపాయాలు కల్పించాలని ఆయన కునో అధికారులను ఆదేశించారు.