లోక్సభ ఎన్నికల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్న ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్గాంధీలు.. వాటిపై బహిరంగ చర్చకు రావాలని మాజీ న్యాయమూర్తులు మదన్ బీ లోకుర్, ఏపీ షా, ప్రముఖ పాత్రికేయుడు ఎన్ రామ్ ఆహ్వానించారు
ప్రజలు మీ పరస్పర విమర్శలే వింటున్నారు
కానీ.. వాటికి అర్థవంతమైన స్పందన వినడం లేదు
మీరిద్దరూ ఒక వేదికపై చర్చిస్తే ప్రజలకు ఉపయోగం
అధికార, ప్రతిపక్ష నేతలకు ఆహ్వానం పలికిన
మాజీ న్యాయమూర్తులు, సీనియర్ పాత్రికేయుడు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్న ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్గాంధీలు.. వాటిపై బహిరంగ చర్చకు రావాలని మాజీ న్యాయమూర్తులు మదన్ బీ లోకుర్, ఏపీ షా, ప్రముఖ పాత్రికేయుడు ఎన్ రామ్ ఆహ్వానించారు. విమర్శలు మాత్రమే వింటున్నా, వాటికి అర్థవంతమైన ప్రతిస్పందనలు ఉండటం లేదనేది ప్రజల అభిప్రాయంగా ఉన్నదని మోదీ, రాహుల్కు రాసిన లేఖలో వారు పేర్కొన్నారు.
‘18వ లోక్సభ ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకున్నది. మన రాజ్యాంగ ప్రజాస్వామ్యం కీలక అంశాలపై అటు అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచార సభల్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తారు. రిజర్వేషన్లు, ఆర్టికల్ 370, సంపద పునఃపంపిణీపై ప్రధాని మోదీ కాంగ్రెస్ను సవాలు చేస్తున్నారు. రాజ్యాంగ విధ్వంసం, ఎలక్టో రల్ బాండ్ల పథకం, చైనా విషయంలో కేంద్ర ప్రభుత్వ స్పందన వంటి అంశాలపై ప్రధానిని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నిస్తున్నారు. బహిరంగ చర్చకు రావాలని సవాలు కూడా విసిరారు’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
పక్షపాతం లేని, వాణిజ్యపరమైనది కాని వేదిక నుంచి తమ రాజకీయ నాయకుల బహిరంగ చర్చ వినడం ద్వారా ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని మేం విశ్వసిస్తున్నాం. ఇరుపక్షాల విమర్శలతోపాటు.. వాటికి వారి ప్రతిస్పందనలు కూడా ప్రజలు వినడం సమంజసంగా ఉంటుంది. ఇది మన ప్రజాస్వామ్య ప్రక్రియను మరింత బలోపేతం చేసేసేందుకు సహకరిస్తుందనే అభిప్రాయంతో ఉన్నాం’ అని ఆ లేఖలో తెలిపారు. మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమని, యావత్ ప్రపంచం మన ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తున్న నేపథ్యంలో ఇది ప్రాధాన్యం కలిగి ఉంటుందని పేర్కొన్నారు.
ఇదొక గొప్ప సంప్రదాయాన్ని నెలకొల్పుతుందని, ప్రజలను చైతన్యవంతులను చేయడమే కాకుండా, ఆరోగ్యకరమైన, చురుకైన ప్రజాస్వామ్య అసలు దృశ్యాన్ని ప్రజల ముందు ఉంచుతుందని పేర్కొన్నారు. వేదిక, వ్యవధి, మాడరేటర్లు, చర్చ జరిగే పద్ధతి మోదీ, రాహుల్ అంగీకారం మేరకు నిర్ణయించుకోవచ్చని వారు ఆ లేఖలో తెలిపారు. వారు ఈ చర్చలో పాల్గొనే అవకాశం లేనిపక్షంలో వారు నామినేట్ చేసే ప్రతినిధులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు.
మదన్ బీ లోకుర్ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి. ఏపీ షా ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్. ఎన్ రామ్ సీనియర్ జర్నలిస్టు, హిందూ పత్రిక మాజీ ఎడిటర్.
చర్చకు వస్తారా?
ఇద్దరు మాజీ న్యాయమూర్తులు, ఒక సీనియర్ పాత్రికేయుడు పంపిన ఆహ్వానాన్ని మన్నించి మోదీ, రాహుల్ చర్చకు వస్తారా? అన్న చర్చలు సాగుతున్నాయి. రాహుల్గాంధీ మీడియాతో అనేక సందర్భాల్లో మాట్లాడారు. పెస్మీట్లు పెట్టారు. మీట్ ది ప్రెస్ వంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. కానీ.. మోదీ ఈ పదేళ్లలో ఒక్కసారి కూడా మీడియా సమావేశాల్లో పాల్గొనలేదు. ఒక్కసారి అమెరికా పర్యటన సందర్భంగా మీడియా ప్రశ్నను మోదీ ఎదుర్కొనాల్సి వచ్చింది. ఆ సందర్భంగా మోదీని ప్రశ్న అడిగిన జర్నలిస్టును బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ట్రోల్ చేసిన విషయం తెలిసిందే.
ఇది మినహాయిస్తే.. మోదీ వివిధ సందర్భాల్లో అనేక చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అవన్నీ కూడా మోదీకి ఇబ్బంది లేని ప్రశ్నలు అడిగే విధంగా రూపొందించారనే విమర్శలు ఉన్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో మోదీ బహిరంగ చర్చకు సిద్ధమవుతారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఒక సత్సాంప్రదాయాన్ని నెలకొల్పేందుకు మాజీ న్యాయమూర్తులు, సీనియర్ పాత్రికేయుడు చొరవ చేయడాన్ని పలువురు అభినందిస్తున్నారు.