ప్రస్తుత ట్రెండ్స్ బట్టి ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య హోరాహోరీ పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన రాజస్ధాన్, కర్ణాటక, యూపీ, మహారాష్ట్ర రాష్ట్రాలలో ఈసారి గణనీయంగా సీట్లు కోల్పోతున్నట్టు కనిపిస్తున్నది
ప్రస్తుత ట్రెండ్స్ బట్టి ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య హోరాహోరీ పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన రాజస్ధాన్, కర్ణాటక, యూపీ, మహారాష్ట్ర రాష్ట్రాలలో ఈసారి గణనీయంగా సీట్లు కోల్పోతున్నట్టు కనిపిస్తున్నది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం బీజేపీ 2014, 2019లో వలె సొంతంగా మెజారిటీ మార్క్ను చేరుకోవడం సాధ్యం కాదని స్పష్టమైంది. ఒకవేళ బీజేపీకి 240 కంటే తక్కవ సీట్లు వస్తే ఎన్డీఏ కూటమిలో పెద్ద పార్టీ అయిన టీడీపీ కీలక పాత్ర పోషించనున్నది. అంతేకాదు బీజేపీకి 240-250 సీట్ల కంటే తక్కువగా వస్తే ఏమైనా జరగొచ్చు అనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తత ట్రెండ్స్ ఇలా ఉన్నాయి
ఢిల్లీని బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం మొత్తం ఏడు లోక్ సభ సీట్లలో కాంగ్రెస్, ఆప్ ఇండియా కూటమిపై బీజేపీ ఆరు స్థానాల్లో ముందంజలో ఉన్నది.
– 80 స్థానాలున్నయూపీ ఎన్డీయే కూటమి ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 37 సీట్లలో ముందంజలో ఉన్నది. ఆరంభ ట్రెండ్స్ ప్రకారం.. 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఇండియా కూటమి ఇక్కడ మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రామ మందిర నిర్మాణం ప్రచారం బీజేపీకి గణనీయంగా ఓట్లు రాలుస్తాయని అనుకున్నది. కానీ అఖిలేశ్ ప్రచారం చేసిన పీడీఏ వెనుకబడిన, దళిత, మైనారిటీ నినాదం ఫలిస్తున్నట్టు కనిపిస్తున్నది. యూపీలో బీజేజే చేసిన భావోద్వేగ ప్రచారం కంటే స్థానిక సమస్యలే ప్రభావం చూపనట్టు తెలుస్తోంది.
బెంగాల్ లో పోరు హోరాహోరీగా కొనసాగుతున్నది. ఈ రాష్ట్రాన్ని బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విషయం విదితమే. మొత్తం 42 స్థానాలుండగా.. ఎన్డీయే 16, ఇండియా కూటమి 26 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
లైంగిక దౌర్జన్యం కేసుతో కర్ణాటక రాజకీయాలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం.. అక్కడ ఎన్డీయే కూటమి 17 స్థానాల్లో ముందంజలో ఉన్నది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 11 స్థానాల్లో ఆధిక్యం కనిపిస్తున్నది.
25 స్థానాలున్న రాజస్థాన్ గత ఎన్నికల్లో ఎన్డీయే కూటమి పూర్తిగా క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి మాత్రం ఇరు కూటముల మధ్య హోరాహోరీ పోరు సాగుతున్నది. ఎన్డీయే 13, ఇండియా 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది.