ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు కూడా రావని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ అన్నారు. బీజేపీ, ఆరెస్సెస్ ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చివేయాలని చూస్తున్నాయని విమర్శించారు.
రాజ్యాంగాన్ని మార్చేందుకు 400 సీట్లు అడుగుతున్న బీజేపీ
దానికి కాపాడుకునేందుకే ఈ ఎన్నికలు
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్
భోపాల్: ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు కూడా రావని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ అన్నారు. బీజేపీ, ఆరెస్సెస్ ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చివేయాలని చూస్తున్నాయని విమర్శించారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. ఎన్డీయే చార్సౌ పార్ టార్గెట్ను ప్రస్తావించిన రాహుల్.. ‘అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తామని బీజేపీ నేతలు స్పష్టంగా చెబుతున్నారు. వారు ఇప్పుడు ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ అని నినాదం ఇచ్చారు. 400 సంగతి వదిలేయండి.. వాళ్లకు కనీసం 150 సీట్లు కూడా రావు’ అని ఆయన తేల్చి చెప్పారు.
మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ జిల్లా రత్లం ఝబువా నియోజకవర్గ పరిధిలోని జొబాత్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల ప్రయోజనం కోసం రిజర్వేషన్లపై 50శాతం పరిమితిని ఎత్తివేస్తామని చెప్పారు. కుల గణన అంశాన్ని ప్రస్తావించిన రాహుల్.. దీని ద్వారానే దేశ ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులు స్పష్టమవుతాయని అన్నారు. దేశ రాజకీయాలను కుల గణన మార్చివేస్తుందని చెప్పారు. ‘ఈ ఎన్నికలు దేశ రాజ్యాంగ రక్షణ కోసం జరుగుతున్నాయి.
రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ, ఆరెస్సెస్ ప్రయత్నిస్తుంటే ప్రతిపక్ష ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీ దానిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి’ అని అన్నారు. బీజేపీ 400 సీట్లు కోరేది రాజ్యాంగాన్ని మార్చడం కోసమేనని చెప్పారు. కంపెనీల్లో ఏడాదిపాటు యువతకు అప్రెంటిస్షిప్ కల్పించేందుకు ‘పెహ్లీ నౌకరి పక్కీ’ అనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభిస్తుందని తెలిపారు. శిక్షణా సమయంలో నెలకు 8,500 చొప్పున ఏడాదికి లక్ష రూపాయలు అందిస్తామని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి పేద మహిళ ఖాతాలో నెలకు 8,500 జమ చేయడం ద్వారా ఏడాదిలో వారిని లక్షాధికారులను చేస్తామని ప్రకటించారు.