విధాత : బీహార్ ప్రభుత్వం దిగ్విజయవంతంగా పూర్తి చేసి ప్రకటించిన కుల గణన ప్రక్రియ క్రమంగా మిగతా రాష్ట్రాలకు కూడా పాకుతుంది. ఈ క్రమంలో తాజాగా రాజస్థాన్లోని అశోక్ గేహ్లాట్ ప్రభుత్వం కుల గణన నిర్వాహణకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బీహార్ తర్వాతా కులగణన చేపట్టే రెండో రాష్ట్రంగా రాజస్థాన్ నిలువనుంది.
త్వరలోనే రాజస్థాన్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో గేహ్లాట్ సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనకు నిర్ణయం తీసుకోవడం బీజేపీని ఇరకాటంలోకి నెట్టింది. ఎన్నికల ప్రచార పర్వంలో కాంగ్రెస్ విసిరిన కుల గణన అస్త్రాన్ని బీజేపీ ఎలా తిప్పికొట్టనుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ కుల గణనను కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కుల గణన డిమాండ్ను ఎన్నికల ఎజెండాగా మార్చుకుని ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మార్చేసి ప్రధాన ప్రత్యర్ధి బీజేపీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ నేపధ్యంలో చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో కుల గణనను కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాస్ర్తంగా మలుచుకుంది.
ఇండియా కూటమికి పెద్దన్నగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కుల గణనకు డిమాండ్ చేస్తుండగా జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య దీనిపై వివాదం మరింత తీవ్రమవుతుంది. ఇప్పటికే కులాల వారిగా లెక్కింపు కుదరదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రధాని మోడీ చత్తీస్ఘడ్ జగ్దల్పూర్ సభలో కుల గణనకు వ్యతిరేకంగా మాట్లాడారు.
ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే కాంగ్రెస్ కులగణను ముందుకు తెచ్చిందన్నారు. కులగణనతో జనాభా ఆధారంగా వనరులను పంచాలనడంలో కాంగెస్ ఉద్దేశం ఏమిటని..తద్వారా ముస్లింలు, మైనార్టీల హక్కులను తగ్గించాలనుకుంటుందా..అధిక జనాభా ఉన్న హిందువులే ముదుకొచ్చి హక్కులన్ని తమకే కావాలని డిమాండ్ చేయాలని కాంగ్రెస్ ఆశీస్తుందా అంటూ మండిపడ్డారు.
కుల మతాలకు నిమిత్తం లేకుండా వనరులపై తొలిహక్కు పేదలకే చెందాలన్నదే తన అభిమతమన్నారు. ఈ నేపధ్యంలో ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాలలో కుల గణన పై జనాభిప్రాయం ఏ విధంగా ఉండనుంది..ఆ రాష్ట్రాల ప్రజలు ఎవరి వాదనకు సై అంటారన్నది ఎన్నికల్లోనే తేలనుంది.