TRS తొలి జెండా రైతు నాగలి యాదిలో..

  • By: sr    news    Mar 18, 2025 6:44 PM IST
TRS తొలి జెండా రైతు నాగలి యాదిలో..

విధాత ప్రత్యేక ప్రతినిధి: బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సందర్భంగా 25 యేళ్ళ క్రితం నాటి ఉద్యమ జ్ఞాపకాలను నాటి టీఆర్ఎస్ రైతు నాగలి గులాబీ జెండా గుర్తు చేసింది. వరంగల్ జిల్లా నర్సంపేట, నల్లబెల్లి స్థానం నుంచి జెడ్పీటీసీగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. ఆ సమయంలో క్లాత్ మీద బ్రష్‌తో రాయించిన ప్రచార బ్యానర్‌ను, పార్టీ 25 ఏండ్ల సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా సోమవారం బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా హైదరాబాద్ లో పునరావిష్కరించారు.

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం 27 ఏప్రిల్ 2001లో జరిగింది. పార్టీ ఆవిర్భవించిన రెండు నెలల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. తెలంగాణ సాధన లక్ష్యంగా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. జనం తీర్పుకోసం తొలిసారిగా స్థానిక ఎన్నికల్లో పాల్గొనాలని నిర్ణయించింది. ఆ నిర్ణయం మేరకు, 2001 జూలై 3న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను నిలిపింది. తెలంగాణ సమాజం టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టింది. ఆ ఎన్నికల్లో 82 మంది టీఆర్ఎస్ జిల్లా పరిషత్ సభ్యులు విజయం సాధించారు.

ఈ సందర్భంగా నాటి పార్లమెంటరీ పంథా జ్ఞాపకాలను పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇతర పార్టీ నేతలు మరోసారి గుర్తు చేసుకున్నారు. ఉద్యమ సందర్భాన్ని ఎంతో ప్రాముఖ్యతతో భద్రపరిచిన పెద్ది సుదర్శన్ రెడ్డి బృందాన్ని అధినేత కేసీఆర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి తదితర ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు పాల్గొన్నారు