ఫీనిక్స్ పక్షి లెక్క తిరిగి పుంజుకుంటాం.. లోక్‌సభ ఎన్నికల ఓటమిపై.. కేటీఆర్ ట్వీట్

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, బీఆరెస్ ఓటమి తమను తీవ్ర నిరాశ పరిచాయని, మళ్లీ త్వరలోనే ఫీనిక్స్ పక్షి లెక్క తిరిగి పుంజుకుంటామని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.గెలుపు ఓటములకు అతీతంగా తెలంగాణ ప్రజల కోసం పోరాడుతాం. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు

ఫీనిక్స్ పక్షి లెక్క తిరిగి పుంజుకుంటాం.. లోక్‌సభ ఎన్నికల ఓటమిపై.. కేటీఆర్ ట్వీట్

విధాత : లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, బీఆరెస్ ఓటమి తమను తీవ్ర నిరాశ పరిచాయని, మళ్లీ త్వరలోనే ఫీనిక్స్ పక్షి లెక్క తిరిగి పుంజుకుంటామని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. పార్టీ స్థాపించిన 24 ఏళ్ల సుదీర్ఘమైన ప్రస్థానంలో ఎన్నో రకాల ఎత్తుపల్లాలను చూశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొన్న అనుభవం పార్టీకి ఉందన్నారు. బీఆరెస్‌ పార్టీగా తమకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటాన్ని మించిన గౌరవం, విజయం మరేది లేదని గుర్తు చేశారు. గతంలోనూ ఇలాంటి ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ ప్రజాదరణతో బీఆరెస్‌ పుంజుకున్న సందర్భాలెన్నో ఉన్నాయన్నారు. తెలంగాణ సాధించటంతో పాటు ఒక ప్రాంతీయ పార్టీగా రెండుసార్లు అద్భుతమైన మెజార్టీ 2014 లో 63 సీట్లు, 2018 లో 88 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. ప్రస్తుత శాసనసభలోనూ మూడో వంతు సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా బీఆరెస్‌ కొనసాగుతుందన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆరెస్‌ స్వల్ప తేడాతోనే ఓటమి పాలైందని గుర్తు చేశారు. ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు నిరాశ కలిగించినప్పటికీ లోక్ సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు ఎంతో శ్రమించారన్నారు. వారందరికీ పార్టీ తరఫున కృతజ్ఞతలు చెప్పారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమేనని, గెలిచినప్పుడు పొంగిపోవద్దు, ఓడినప్పుడు కుంగిపోవద్దని మా పార్టీ అధినేత కేసీఆర్ ఎప్పుడు చెబుతుంటారని, ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి వారి బాధ్యతను గుర్తు చేస్తూ ప్రజా సమస్యలపై ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజాక్షేత్రంలో తెలంగాణ ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటామన్నారు. తెలంగాణ ప్రజల గొంతుక బీఆరెస్‌ అని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పైన, తెలంగాణ ప్రయోజనాల కోసం అటు కేంద్రంతోనూ పోరాటం కొనసాగిస్తూనే ఉంటామన్నారు. రానున్న రోజుల్లో మరింతగా కష్టపడి మళ్లీ ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని, ఫినిక్స్ పక్షిలాగా తిరిగి పుంజుకుంటామని కేటీఆర్ తెలిపారు.