YS Sharmila | వైసీపీ ముసుగు మళ్ళీ తొలగింది: ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

YS షర్మిలా రెడ్డి వైసీపీపై తీవ్ర విమర్శలు: NDA అభ్యర్థికి మద్దతు ఇచ్చి పార్టీ ముసుగు మళ్ళీ తొలగిందని ఆరోపించారు.

YS Sharmila | వైసీపీ ముసుగు మళ్ళీ తొలగింది: ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

YS Sharmila | అమరావతి : ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ కూటమి నిలబెట్టిన బీజేపీ అభ్యర్థి సీ.పీ.రాధాకృష్ణన్ కు మద్దతు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించుకోవడం ద్వారా ఆ పార్టీ ముసుగు మళ్లీ తొలగిందని..లోనున్న కాషాయ కండువా మరోసారి బయటపడిందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిలా రెడ్డి విమర్శించారు. వైసీపీ తన నిర్ణయంతో మరోసారి బీజేపీకి ఆ పార్టీ బీ-టీం అని నిజ నిర్ధారణ జరిగిందని..మోదీకి జగన్ దత్తపుత్రుడే అని రాష్ట్ర ప్రజలకు కుండబద్దలు కొట్టినట్లు అర్ధం అయ్యిందని షర్మిల దుయ్యబట్టారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ముసుగులో ఉన్నది మోదీ పక్షమేనని తేటతెల్లమైందని.. వైపీసీ కూడా బీజేపీ కోసమే పనిచేసే పక్షమేనని రుజువైందన్నారు. అందుకే బీజేపీ అంటే బాబు(చంద్రబాబు), జగన్, పవన్ అని..ఈ ముగ్గురు మోదీ తొత్తులేనని, బీజేపీకి ఊడిగం చేసే బానిసలేనని విమర్శించారు. టీడీపీ, జనసేన పార్టీలది తెరమీద పొత్తు అయితే..వైసీపీది తెరవెనుక అక్రమ పొత్తు అని ఆరోపించారు. వైసీపీ తీరు రాష్ట్రంలో కూటమి పక్షాలతో కుస్తీ..ఢిల్లీలో మతపిచ్చి బీజేపీతో దోస్తీ మాదిరిగా ఉందన్నారు.

అవినీతి కేసులకు భయపడి బీజేపీకి జగన్ మళ్ళీ దాసోహం అన్నారన్నారు. 5 ఏళ్లు దోచుకుతిన్నది దాచుకోడానికి బీజేపీకి జై కొట్టారని షర్మిల మండిపడ్డారు. ఈ దేశంలో ఓట్ చోరితో రాజ్యాంగం ఖూనీ అయ్యేది వైసీపీకి కనిపించదని, మోదీ ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తుంటే విమర్శించడానికి వైసీపీకి నోరు పెకలదని విమర్శించారు. మణిపూర్, గోద్రా అల్లర్లలో ఆర్ఎస్ఎస్ చేసిన రక్తపాతం మీద మౌనం వహిస్తారని, – మోదీ అక్రమాలు బయటపెట్టే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురించి మాత్రం ఉవ్వెత్తున లేస్తారని జగన్ పై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి ఆపద వచ్చిందంటూ జగన్ అండగా నిలబడతారని, ఈ దేశ ప్రతిపక్షాలన్నీ కలిసి రాజకీయాలతో సంబంధం లేని ఒక తెలుగు బిడ్డ, న్యాయ నిపుణుడిని నిలబెడితే, బీజేపీ నిలబెట్టిన ఆర్ఎస్ఎస్ వాదికి మద్దతు ఇస్తారా ? అని..ఇది తెలుగు ప్రజలకు చేసిన ద్రోహం కాకపోతే మరేంటి ? దీనిపై రాష్ట్ర ప్రజలకు వైసీపీ, జగన్ లు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.