ఫైనల్ ఫోబియా భారత జట్టుకి చాలా ఉందని మరోసారి నిరూపించారు. సీనియర్ జట్టు మాదిరిగానే యువ జట్టు కూడా ఫైనల్ ఫోబియాతో ఓటమి పాలైంది. ఆదివారం (ఫిబ్రవరి 09) జరిగిన అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ లో భారత్ చతికిలపడి టోర్నీని అందుకోలేకపోయింది. టోర్నీలో అన్ని మ్యాచ్లు గెలిచిన భారత జట్టు ఫైనల్లో మాత్రం దారుణంగా విఫలమైపోయింది.ఆస్ట్రేలియా విధించిన 254 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలింది. దీంతో ఆరోసారి విశ్వవిజేతగా నిలవాలన్న టీమిండియా కల చెదిరిపోయింది.దీంతో క్రికెట్ అభిమానులు చాలా నిరాశలో ఉన్నారు. గతేడాది నవంబర్ 19న వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో సీనియర్ ఆటగాళ్ల ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటారనుకుంటే.. కుర్రాళ్లూ కూడా సేమ్ రిపీట్ చేశారు.
ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా బ్యాటింగ్ పూర్తిగా ఒత్తిడికి గురై ఫ్లాప్ కావడంతో ఓటమి చెందాల్సి వచ్చింది. ఈ సిరీస్లో అద్భుతంగా రాణించిన సహారన్, ముషీర్ ఖాన్, సచిన్ దాసా ఫైనల్ లో విఫలం కావడంతో భారత్కి ఓటమి తప్పలేదు. 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటయి 79 పరుగుల తేడాతో ఓటమి పాలవ్వడంతో అభిమానులతో పాటు క్రికెటర్స్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. ఇక ఫైనల్ మ్యాచ్లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణ కుర్రాళ్లు అరవెల్లి అవనీష్ రావు, మురుగణ్ అభిషేక్ తెలుగులో మాట్లాడుకోగా, ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. వికెట్ కీపర్ అయిన అవనీష్ రావు.. స్పిన్ ఆల్రౌండర్ అయిన అభిషేక్ కొన్ని బౌలింగ్ సూచనలు చేశాడు.
‘సేమ్ బాల్ వేయ్రా.. బాగుంది. స్వీప్ కొట్టినా ఏం కాదు. రెండే షాట్స్ ఆడుతాడు. ఏం కాదు.’అని అవనీష్ రావు తెలుగులో అనడంతో ఈ మాటలు స్టంప్ మైక్లో రికార్డ్ అవ్వగా.. ఈ వీడియోని స్టార్ స్పోర్ట్స్ తెలుగు ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకోగా, ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. క్రికెట్ గ్రౌండ్లో తెలుగులో మాట్లాడుకుంటున్న క్రికెటర్స్ని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అవనీష్ రావుది సిరిసిల్ల కాగా.. మురుగన్ అభిషేక్ది హైదరాబాద్. ఈ ఇద్దరూ అండర్ 19 ప్రపంచకప్ ఎంపికవ్వగా.. వారికి తెలంగాణ మాజీ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ట్విటర్ వేదికగా అభినందనలు కూడా తెలిపారు.
ఇద్దరు క్రికెటర్లు గ్రౌండ్ లో తెలుగులో మాట్లాడుతుంటే వినడానికి హాయిగా ఉంటుంది కదూ.!!