సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. భారీ అంచనాలతో థియేటర్స్లోకి వచ్చిన ఈ సినిమాకి మిక్సడ్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా బాగానే డ్రాప్ అయ్యాయి. అయితే ఈ సినిమా చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయిందని చెప్పాలి. చిత్రంలో మహేష్ బాబు యాటిట్యూడ్, శ్రీలీల డ్యాన్స్ మాత్రం ప్రతి ఒక్కరిని కట్టి పడేసింది అని చెప్పాలి. మహేష్ మాస్ అవతార్ చూసి ప్రేక్షకులు పూనకంతో ఊగిపోయారు.
ఇక థమన్ మ్యూజిక్కి కూడా ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘కుర్చీని మడతపెట్టి.. ‘ సాంగ్ కి మాములు క్రేజ్ రాలేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ పాటకి తెగ రీల్స్ చేస్తున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఈ పాటకి స్టెప్పులేయడంతో ఆ పాట ఇప్పటికీ ట్రెండింగ్లో ఉంది. ఇక తాజాగా ఈ పాటకి భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన సతీమణి బాలీవుడ్ అందాల భామ అనుష్క శర్మ కలిసి చిందులు వేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. అయితే ఇది నిజంగా వారు ఆ పాటకి వేసిన స్టెప్పులు కాదు. విరాట్, అనుష్కలు వేరే పాటకి డ్యాన్స్ చేయగా దానిని కుర్చీ మడత పెట్టి సాంగ్ హుక్ స్టెప్ వేసినట్టుగా క్రియేట్ చేశారు.
మహేష్ సాంగ్ తో విరాట్, అనుష్క డ్యాన్స్ చేస్తున్నట్టు ఎడిట్ చేసిన తీరు పట్ట ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ముందుగా ఎడిట్ చేసిన వారిని ప్రశంసిస్తూ ఆ తర్వాత కోహ్లీ, అనుష్కలని అభినందిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే అనుష్క, కోహ్లీ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. కాగా, గతంలో కూడా అనుష్క శర్మతో పాటు భారత క్రికెటర్లతోనూ విరాట్ కోహ్లీ డాన్సు చేసి రచ్చ చేయడం మనం చూశాం. ఎప్పటికప్పుడు తనదైన శైలితో కోహ్లీ వార్తలలో నిలుస్తూ ఉంటాడు.