Ban on TikTok | టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తేస్తారా? కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ క్లారిటీ

భారత్‌ చైనా మధ్య సంబంధాలు ((India-China Relations)) తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్న నేపథ్యంలో గతంలో టిక్‌టాక్‌పై (TikTok) విధించిన నిషేధాన్ని ఎత్తేస్తారా? అన్న చర్చలు జరుగుతున్నాయి. వాటికి కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) స్పష్టతనిచ్చారు.

Ban on TikTok | టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తేస్తారా? కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ క్లారిటీ

Ban on TikTok | టిక్‌ టాక్‌! దేశంలో గతంలో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన షార్ట్‌ వీడియోస్‌ ఫార్మాట్‌. భారత్‌, చైనా మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారతదేశం టిక్‌టాక్‌ను నిషేధించింది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో TikTokపై నిషేధం ఎత్తివేస్తారా? అనే అంశంలో సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. గత నెలలో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ వంటి కొన్ని నెట్‌వర్క్‌లలో టిక్‌టాక్‌ అందుబాటులోకి రావడం ఈ ఊహాగానాలకు ఆజ్యంపోసింది. ఇదే సమయంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఏడేళ్ల తర్వాత చైనాలో పర్యటించారు. షాంఘై సహకార సంఘం (SCO) సిఖరాగ్ర సదస్సలో పాల్గొన్నారు. ఈ సదస్సులో కీలక వ్యాఖ్యలు చేసిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌.. ఏనుగు (India) – డ్రాగన్ (China) స్నేహితులుగా మారాలని వ్యాఖ్యానించారు.

  • భారత్‌లో టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేసే విషయంలో కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి అశ్విని వైష్ణవ్‌ క్లారిటీ ఇచ్చారు. ఈ ఊహాగానాలపై ఆయన స్పందిస్తూ..
  • ‘ఇప్పటివరకు టిక్‌టాక్‌ నిషేధం ఎత్తివేతపై ప్రభుత్వంలో ఎలాంటి చర్చ జరగలేదు’ అని చెప్పారు.
  • ‘ప్రస్తుతం ఎలాంటి ప్రతిపాదన లేదు. దీనిపై ఎప్పుడైనా నిర్ణయం తీసుకుంటే.. అత్యంత పారదర్శకత్వంతో దేశ ప్రజలతో దాన్ని పంచుకుంటాం. భారతదేశం ఎంతో పాదర్శకత కలిగిన దేశం’ అని చెప్పారు.

గత ఆగస్టులో కొందరు వినియోగదారుల ఫోన్లలో టిక్‌టాక్‌ తిరిగి పనిచేస్తున్నట్టు కనిపించిందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. అప్పడు కూడా స్పందించిన కేంద్రం.. అటువంటిదేమీ లేదని స్పష్టం చేసింది. “టిక్‌టాక్‌ నిషేధం ఎత్తివేయలేదు. అలాంటి వార్తలు తప్పు, తప్పుదారి పట్టించేవి.. అని అధికార వర్గాలు వెల్లడించాయి.

టిక్‌టాక్‌ నిషేధం వెనుక!

సరిహద్దుల్లోని గల్వాన్‌ లోయలో 202 జూన్‌ నెలలో భారత్‌, చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీనితోపాటు అనంతరం మోదీ ప్రభుత్వం డిజిటల్‌ స్ట్రైక్‌లో భాగంగా చైనాకు చెందిన 50 యాప్‌లను నిషేధించింది. వాటిలో టిక్‌టాక్‌ కూడా ఒకటి. జాతీయ భద్రతా సమస్యలతోపాటు కస్టమర్ల డాటీ ప్రైవసీపై నెలకొన్న తీవ్ర ఆందోళనలే ఈ నిర్ణయానికి కారణమని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. టిక్‌టాక్‌ వంటి యాప్‌ల ద్వారా భారతదేశ డాటాను గూఢచర్యం కోసం చైనా వాడుకునే ప్రమాదం ఉందనే అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. తొలుత తాత్కాలికంగా నిషేధించగా.. 2021లో పర్మినెంట్‌గా బ్యాన్‌ చేశారు. ఆ సమయానికి భారతదేశంలో టిక్‌టాక్‌కు 20 కోట్ల మంది వినియోగదారులు ఉండేవారు.