విధాత: వాట్సప్ (WhatsApp)పై ఎప్పుడూ ఏదో ఒక ఆరోపణ రావడం.. దానికి సంస్థ ప్రతినిధులు వివరణ ఇవ్వడం ఈ మధ్య కాలంలో తరచుగా జరుగుతోంది. తాజాగా ఓ ట్విటర్ ఇంజినీర్ చేసిన ట్వీట్.. వాట్సప్ యూజర్లు ఉలిక్కిపడటానికి కారణమయింది. అసలేం జరిగింది? ట్వీట్తో గోల మొదలు తాను ఫోన్ వాడకున్నా పొద్దున్న 4.20 నుంచి 6.53 వరకు మైక్రోఫోన్ను వాట్సప్ యాక్సెస్ చేసుకుందని, మన మాటలన్నీ వాట్సప్ వింటోందనడానికి ఇదే సాక్ష్యమని ఫోద్ దబిరి అనే ట్విటర్ […]
విధాత: వాట్సప్ (WhatsApp)పై ఎప్పుడూ ఏదో ఒక ఆరోపణ రావడం.. దానికి సంస్థ ప్రతినిధులు వివరణ ఇవ్వడం ఈ మధ్య కాలంలో తరచుగా జరుగుతోంది. తాజాగా ఓ ట్విటర్ ఇంజినీర్ చేసిన ట్వీట్.. వాట్సప్ యూజర్లు ఉలిక్కిపడటానికి కారణమయింది. అసలేం జరిగింది?
ట్వీట్తో గోల మొదలు
తాను ఫోన్ వాడకున్నా పొద్దున్న 4.20 నుంచి 6.53 వరకు మైక్రోఫోన్ను వాట్సప్ యాక్సెస్ చేసుకుందని, మన మాటలన్నీ వాట్సప్ వింటోందనడానికి ఇదే సాక్ష్యమని ఫోద్ దబిరి అనే ట్విటర్ ఇంజినీర్ ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్నూ ట్వీట్కు జత చేశారు. దీనిని మరింత చర్చలోకి తీసుకువచ్చేలా మస్క్ ఆ ట్వీట్ను రీ ట్వీట్ చేశారు. వాట్సప్ను నమ్మడానికి లేదంటూ వ్యాఖ్యానించారు.
స్పందించిన వాట్సప్
మైక్రోఫోన్ ట్వీట్పై జరుగుతున్న రచ్చను చూసి వాట్సప్ అప్రమత్తమైంది. ఈ సమస్యకు కారణం ఆండ్రాయిడ్ ఓఎస్లో ఉంది తప్ప.. తమ దగ్గర లేదని ట్వీట్ చేసింది. తమ ప్రైవసీ పాలసీ ప్రకారం యూజర్కు అవసరమైనప్పుడే మైక్రోఫోన్ ఆన్ అవుతుందని తెలిపింది.
సదరు యూజర్ గూగుల్ పిక్సల్ ఫోన్ ఉపయోగిస్తున్నందున్న దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని గూగుల్కు తెలిపినట్లు వెల్లడించింది. వాట్సప్ ద్వారా జరిపే సంభాషణలు, సందేశాలు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ద్వారానే జరుగుతాయని వినియోగదారులు భయపడాల్సిన పనిలేదని మరోసారి స్పష్టం చేసింది.
Users have full control over their mic settings
Once granted permission, WhatsApp only accesses the mic when a user is making a call or recording a voice note or video – and even then, these communications are protected by end-to-end encryption so WhatsApp cannot hear them
— WhatsApp (@WhatsApp) May 9, 2023
అది ఒక బగ్: గూగుల్
ఈ మైక్రోఫోన్ సమస్యకు ఆండ్రాయిడ్లో ఉన్న ఒక బగ్ కారణమని గూగుల్ ప్రతినిధి ధ్రువీకరించారు. మా దర్యాప్తు ప్రకారం.. గూగుల్ ఆండ్రాయిడ్లో ఉన్న ఒక బగ్ వాట్సప్ యూజర్లను తప్పుదోవ పట్టిస్తున్నట్లు తెలిసింది. దీని వల్లే వాట్సప్ యూజర్లు తప్పుడు హెచ్చరికలను పొందుతున్నారు. దీనిపై పని చేయమని మా సిబ్బందిని ఆదేశించాం. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది అని ఆయన తెలిపారు.
రంగంలోకి భారత ప్రభుత్వం
మైక్రోఫోన్ను వాట్సప్ రహస్యంగా ఉపయోగించుకుంటోందన్న వార్తలపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేస్తూ.. ‘ఇది క్షమించరాని నిబంధనల ఉల్లంఘన. దీనిపై వాట్సప్తో సంప్రదింపులు జరుపుతున్నాం. వినియోగదారుల డేటాకు ఇలాంటి ముప్పు రాకూడదనే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ను తీసుకొస్తున్నాం’ అని తెలిపారు.