సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీలోని ఏక్నాథ్ షిండేలతోనే ముప్పు ఉందని, నల్లగొండ, ఖమ్మం బాంబులతోనే తప్ప బీఆరెస్తో ఎలాంటి ప్రమాదం లేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు
లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలోకి రేవంత్
నల్లగొండ లోక్సభ నియోజకవర్గ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్
విధాత: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీలోని ఏక్నాథ్ షిండేలతోనే ముప్పు ఉందని, నల్లగొండ, ఖమ్మం బాంబులతోనే తప్ప బీఆరెస్తో ఎలాంటి ప్రమాదం లేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు వ్యాఖ్యానించారు. లక్ష రుణమాఫీ పొందిన రైతులు బీఆరెస్కు ఓటు వేయాలని, రెండు లక్షల రుణమాఫీ పొందినవారు కాంగ్రెస్కు ఓటేయాలని అన్నారు. సోమవారం నల్లగొండ లోక్సభ నియోజకవర్గ నాయకుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత తన కేసుల కోసమో, రాజకీయ అవసరాల కోసమో స్వయానా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. బీజేపీలోకి వెళ్లడం తథ్యమని అన్నారు. పదేళ్ల నిజానికి, 100 రోజుల మోసానికి మధ్య తేడాను ప్రజలు గ్రహిస్తున్నారని చెప్పారు. గట్టిగా ప్రయత్నిస్తే ఉమ్మడి నల్లగొండలోని రెండు లోక్సభ స్థానాల్లోనూ బీఆరెస్ గెలుస్తుందని అన్నారు. భువనగిరి, నల్లగొండ లోక్సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు చొప్పున బీఆరెస్ ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ.. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో రెండు ఎంపీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకున్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావిస్తూ.. అదే పద్ధతిలో బీఆరెస్ ఎంపీలు గెలిచే అవకాశం ఉందన్నారు. నల్లగొండ జిల్లా పార్టీలో జోష్ నెలకొన్నదని చెప్పుకొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బాధ పడొద్దని, రెట్టింపు ఉత్సాహంతో పోరాటం చేద్దామని పార్టీ శ్రేణులకు భరోసానిచ్చారు.
బీఆరెస్ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వలేని విధంగా లక్షా 70 వేల ఉద్యోగాలు ఇచ్చిందని, చివరకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు పంపిణీ చేసిన ఉద్యోగాలను కూడా గత ప్రభుత్వమే ఇచ్చిందని చెప్పారు. ఇచ్చిన ఉద్యోగాలను, చేసిన పనులను చెప్పుకోలేకపోవడంతో పాటు ప్రజలు కాంగ్రెస్ అబద్ధాలు నమ్మడంతో ఓటమిపాలు కావాల్సి వచ్చిందన్నారు. నిరుద్యోగులను, ఉద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్ లాభం పొందిందన్నారు. కేసీఆర్ ఉన్నన్నినాళ్లు అన్నదాతలకు స్వర్ణయుగం అయిందని కేటీఆర్ అన్నారు. నల్లగొండలలో చివరి భూములకు కూడా నీళ్లిచ్చిన ఘనత కేసీఆర్దేనని చెప్పారు. ఇకనైనా మనం చేసిన పనులను ప్రజలకు చెప్పుకుందామని అన్నారు. ఉమ్మడి నల్గొండలో 3 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామని చెప్పారు. కాంగ్రెస్ చెప్పిన అబద్ధాలకు ప్రజలు బోల్తా పడ్డారన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, మళ్ళీ ఊర్లలో బోరు బండ్ల మోతలు వినబడుతున్నాయని చెప్పారు. రైతుల రుణమాఫీ చేస్తాం అని కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు.
ఇవాళ బ్యాంకులు అన్నదాతలను పీడిస్తున్నాయని విమర్శించారు. రైతుబంధు ఇవ్వకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అన్నదాతలను చెప్పుతో కొడతాం అని కోమటిరెడ్డి అంటాడు. రైతు బంధు దుబారా అని ఉత్తమ్కుమార్రెడ్డి అంటున్నాడు. ఇప్పుడు అన్నదాతలు కాంగ్రెస్ వాళ్ళను చెప్పుతో కొట్టాలి. ఎంపీ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డిని 420 హామీలు నెరవేర్చే దాకా వదలమని స్పష్టం చేశారు. వాటి అమలుకు పోరాడుతామని తెలిపారు.
బద్నాం చేసుడే కాంగ్రెస్ పని
తెలంగాణ ప్రభుత్వానికి కనీస సోయి లేదని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. అన్నదాతలు చస్తున్నా పట్టింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెట్టుడే కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిందన్నారు. ‘కేసులతో మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు.. కాంగ్రెస్ దొంగలు ఫోన్ ట్యాపింగ్ అంటూ నానా యాగీ చేస్తున్నారు. ఒక్కటి కూడా నిజం కాదు.. బద్నాం చేసుడే కాంగ్రెస్ నైజం’ అని జగదీశ్రెడ్డి విమర్శించారు. కేసీఆర్పై అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశార. ‘కాంగ్రెస్ వాళ్ళను ఎక్కడా తిరగనియ్యం. ఎక్కడికక్కడ నిలదీస్తాం.ఇక కేసీఆర్ ప్రతాపం చూస్తారు’ అని చెప్పారు. కేసీఆర్ అంటేనే భరోసా, ధైర్యం అన్న జగదీశ్రెడ్డి.. కేసీఆర్ భరోసా ఇవ్వగానే అన్నదాతలు చాలా ధైర్యంగా ఉన్నారని చెప్పారు.
పనికిరాని చెత్తే పార్టీ నుంచి పోతున్నది
పనికి రాని చెత్త ఇప్పుడు పార్టీ నుండి బయటకు పోతున్నదని జగదీశ్రెడ్డి అన్నారు. ఎవ్వరు పార్టీ మారినా ఏమీ నష్టం లేదని స్పష్టం చేశారు. సాగునీళ్లు ఇవ్వాలంటే కాంగ్రెస్ నాయకులు తప్పించుకుని తిరుగుతున్నారని, సాగర్ డ్యామ్ పైకి పొయ్యే దమ్ము లేదని అన్నారు. కాంగ్రెస్ నాయకులకు చెప్పులతో సమాధానం చెప్పేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారరని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీ లింగయ్య యాదవ్.. నల్గొండ బీఆరెస్ ఎంపీ అభ్యర్థి కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
రైతులను కలిసిన కేటీఆర్
నల్లగొండ జిల్లా ముషంపల్లి గ్రామ రైతు గన్నెబోయిన మల్లయ్యను కేటీఆర్, జగదీశ్రెడ్డి కలిశారు. తమ పంటలు అన్నీ ఎండిపోయి, అప్పుల పాలయ్యామని, కేసీఆర్ ఉన్నన్ని రోజులు రైతులు బాగున్నారని, మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలని మల్లయ్య వీడియో చేసి, సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వీడియోను చూసి చలించి పోయిన కేటీఆర్.. నల్లగొండ వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తానని ఎక్స్లో తెలిపారు. సోమవారం నల్లగొండ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో.. ఇచ్చిన మాట మేరకు ముషంపల్లి గ్రామంలో మల్లయ్యను కలిశారు.