చంచల్గూడ జైలు నుంచి ఏసీబీ కస్టడీకి ఏసీపీ ఉమామహేశ్వర్రావు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో చంచల్గూడ జైలు నుంచి సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్రావును విచారణ నిమిత్తం ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది

విధాత: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో చంచల్గూడ జైలు నుంచి సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్రావును విచారణ నిమిత్తం ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. ఈ నెల 22న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఉమామహేశ్వరరావును కస్టడీ కోరుతూ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ ను మంగళవారం ఏసీబీ కోర్టు విచారించింది. నిందితుడిని కస్టడీలోకి తీసుకుంటే అక్రమాస్తుల వివరాలన్నీ బయటపడే అవకాశం ఉందని, 10 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోర్టును కోరారు. ఈ క్రమంలో న్యాయస్థానం 3 రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో బుధవారం ఉమామహేశ్వర్రావును ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.
ఇప్పటివరకు ఉమామహేశ్వరరావుకు చెందిన రూ.3.95 కోట్ల ఆస్తులు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఉమామహేశ్వరరావును గతవారం అదుపులోకి తీసుకున్న అధికారులు.. నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ను చంచల్ గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఉమామహేశ్వరరావు ఇంట్లో దొరికిన డాక్యుమెంట్స్ లో పేర్కొన్న అంశాలపై ఏసీబీ విచారించనున్నది. పలువురు పోలీసులతో కలిసి 50కోట్ల మేరకు ఆర్ఎస్ కన్స్ట్రక్షన్లో ఉమామహేశ్వరరావు పెట్టుబడులు పెట్టారని గుర్తించిన ఏసీబీ ఈ కోణంలో కస్టడీలో ఆయనను ప్రశ్నించనున్నారు.