విధాత ప్రతినిధి, ఉమ్మడి నిజామాబాద్: కామారెడ్డిలో కొంతకాలంగా రాజకీయ కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే మాచారెడ్డి జడ్పీటీసీ రాంరెడ్డిపై దాడి జరిగినట్లు భావిస్తున్నట్లు రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి లక్ష్మీదేవి గార్డెన్లో మీడియాతో మాట్లాడారు. బాధ్యత కలిగిన వ్యక్తి మరొక బాధ్యత కలిగిన వ్యక్తిపై దాడి చేయడం సరికాదన్నారు. అంతర్గత కుమ్ములాటల్లో కమ్యూనిటీపై ప్రభావం చూపవద్దన్నారు. వ్యక్తిగత విబేధాలు ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమవుతాయి తప్ప దాడులు చేసుకుంటే కావన్నారు.
ఎంపీపీ తనకు పలుకుబడి ఉందని రెచ్చిపోతే రెడ్డి సామాజిక వర్గం ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే భవిష్యత్తులో ఎంపీపీ బయట తిరగలేరన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే, ఇంచార్జిలు చొరవ తీసుకుని ఎంపీపీని సస్పెండ్ చేయించాలన్నారు. పార్టీపరంగా తాము మాట్లాడటం లేదని, కేవలం తమ ఐక్య వేదిక ద్వారానే మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. గతంలో ఇద్దరు రెడ్డిలు కొట్లాడితే, ఒక రెడ్డిని సస్పెండ్ చేసినట్టు… ఇప్పుడు కుడి ఎంపీపీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన రెడ్డి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని తాము బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎంపీపీపై చర్యలు తీసుకున్న తర్వాతే సమ్మేళనం చేపట్టాలని కోరారు.