‘ఈ ఎన్నికల్లో మనమే నెంబర్ వన్. బ్యాలెట్ పేపర్ లో కూడా 1వ స్థానం మనదే. వచ్చే నెల 13న జరిగే ఎన్నికల్లో ఎండలను లెక్క చేయకుండా ప్రతి ఒక్కరూ,కదిలి వచ్చి బ్యాలెట్ పేపర్ లోని 1వ నెంబర్ పక్కనున్న పువ్వు గుర్తుపై బటన్ నొక్కి
*కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరో మీకు తెలుసా?
*కార్యకర్తలకే తెలియని వ్యక్తికి ఓటేసి లాభమేంది?
*ఎన్నికలప్పుడు తప్ప ఎన్నడూ కన్పించిన బీఆర్ఎస్ అభ్యర్ధి
*వాళ్లిద్దరూ రావులు… ఓట్లేస్తే మీకు ఏమీ రావు…
*ముగ్గురు అభ్యర్థులను బేరీజు వేయండి..
*మీకోసం పోరాడే వాళ్లకు ఓటేయండి
*మంచిర్యాల చౌరస్తా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో బండి సంజయ్ వ్యాఖ్యలు
విధాత బ్యూరో, కరీంనగర్: ‘‘ఈ ఎన్నికల్లో మనమే నెంబర్ వన్. బ్యాలెట్ పేపర్ లో కూడా 1వ స్థానం మనదే. వచ్చే నెల 13న జరిగే ఎన్నికల్లో ఎండలను లెక్క చేయకుండా ప్రతి ఒక్కరూ,కదిలి వచ్చి బ్యాలెట్ పేపర్ లోని 1వ నెంబర్ పక్కనున్న పువ్వు గుర్తుపై బటన్ నొక్కి ఓటేసి బంపర్ మెజారిటీతో గెలిపించండి’’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధుల చరిత్రను బేరీజు వేసి ఎవరు మేలు చేస్తారో ఆలోచించి తీర్పు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ తనదైన శైలిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులపై సెటైర్లు వేశారు. ‘‘కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థి రాజేందర్ రావు… బీఆర్ఎస్ అభ్యర్ధి వినోద్ రావు. రాజేందర్ రావు ఎవరో కాంగ్రెస్ కార్యకర్తలకే తెలవదు. నాన్ లోకల్ వినోద్ రావు ఎన్నికలప్పుడు తప్ప ఎన్నడూ ప్రజలకు కన్పించరు. ఈ ఇద్దరు రావులకు పొరపాటున ఓటేస్తే…. మీకు ఏమీ రావు…. అన్నారు. దేశమంతా నరేంద్రమోదీ గాలి వీస్తుంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే రిజర్వేషన్లపై పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేయడం దుర్మార్గమన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ కరీంనగర్ లోని మంచిర్యాల చౌరస్తాలో జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కు వచ్చారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి సంజయ్ ప్రసంగించారు.
శ్రీరాముడి ఆక్షింతలను కూడా కించపర్చే స్థాయికి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు దిగజారారు. అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ట విషయాన్ని ప్రజలు మర్చిపోవాలని మోదీపై ఆ పార్టీల నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నరేంద్రమోదీ చేసిన పాపమేంది? 140 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించి ప్రాణాలు కాపాడినందుకు తిడుతున్నారా? 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం అందిస్తున్నందుకు తిడుతున్నారా? 30 కోట్ల టాయిలెట్లు కట్టించినందుకు తిడుతున్నారా? 11 కోట్లకుపైగా గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా అందించినందుకు తిడుతున్నారా? దేశాన్ని సురక్షితంగా ఉంచుతున్నందుకు తిడుతున్నారా? చెప్పాలన్నారు.
కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరో ఆ పార్టీ కార్యకర్తలకే తెలియదు. మరి ప్రజలు ఆయనకు ఎట్లా ఓటేస్తారు? బీఆర్ఎస్ అభ్యర్ధి ఎన్నికలప్పుడు తప్ప ఎన్నడూ ప్రజలను కలిసిన దాఖలాల్లేవు. ఎన్నడూ ప్రజల పక్షాన పోరాడిన దాఖలాల్లేవన్నారు.
ఇదే మంచిర్యాల చౌరస్తాలో ప్రజల పక్షాన కొట్లాడిన. కోర్టు చౌరస్తా, రాంపూర్ చౌరస్తా, గీతాభవన్ చౌరస్తా, కమాన్ చౌరస్తా సహా కరీంనగర్ లో మీ పక్షాన పోరాడిన. తెలంగాణ ప్రజలకు ఏ కష్టమొచ్చినా అండగా ఉన్నా. వాళ్ల పక్షాన కొట్లాడి జైలుకు పోయిన. నేను మీ కోసం కొట్లాడి గత 5 ఏళ్లలో 7 సార్లు జైలుకు పోయిన. కేసీఆర్ హయాంలో ప్రజల పక్షాన కొట్లాడితే 109 కేసులు నాపై పెట్టి వేధించారు. జైలుకు పంపారు. మూడేళ్లు నరకం చూపారు. మా కార్యకర్తల కాళ్లు, తలకాయలు పగలకొట్టారు. అయినా భయపడలే. మీ కోసం అన్నీ భరించా అన్నారు.
నేనడుగుతున్నా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు మీకోసం ఎన్నిసార్లు కొట్లాడారు? ఎన్ని కేసులను ఎదుర్కొన్నారు. ఎన్నిసార్లు జైలుకు పోయారు? అసలు ఎన్నడైనా ఆ అభ్యర్ధులు మిమ్ముల్ని కలిసి మీ కష్టాలను పంచుకున్నారా? ఎన్నడైనా మిమ్ముల్ని పలకరించారా? పోలీసులు వస్తేనే 5 కి.మీల దూరం పారిపోయే నేతలు కాంగ్రెస్ నేతలు. జైలు పేరు వింటేనే భయపడి పారిపోయేటోళ్లు మీకోసం ఏం చేస్తారని? ప్రశ్నించారు.
అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ మహిళలకు నెలనెలా రూ.2500లు ఎందుకు ఇవ్వలేదు? రైతులకు రూ.15 వేలు ఎందుకు ఇవ్వలేదు? విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఎందుకివ్వలేదు? వ్రుద్దులకు నెలనెలా రూ.4 వేల పెన్షన్ ఇస్తానని ఎందుకు మోసం చేశారు. వడ్లకు రూ.500 బోనస్ ఇస్తానని మోసం చేశారు. ఇవన్నీ ఎందుకు అమలు చేయడం లేదని నేను మీ కోసం ప్రశ్నిస్తుంటే… నన్ను ఓడించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై కుట్రలు చేస్తున్నాయని చెప్పారు.