చిప్ప కూడు తిన్న సిగ్గు రాలే.. రేవంత్ రెడ్డిపై మండిపడ్డ సీఎం కేసీఆర్
జైల్లో చిప్పకూడు తిన్న సిగ్గు రాలేదు రేవంత్ రెడ్డికి అని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు.

కొడంగల్ : జైల్లో చిప్పకూడు తిన్న సిగ్గు రాలేదు రేవంత్ రెడ్డికి అని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని తుక్కు తుక్కు ఓడగొట్టాలని కేసీఆర్ కొడంగల్ ఓటర్లకు పిలుపునిచ్చారు. కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణకోసం మనం కొట్లాడిన రోజు ఆంధ్రోళ్ల సంకలో ఉండే రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమకారుల మీదికి తుపాకి పట్టుకుని బయలెళ్లిండు తుపాకీ రాముడిలా. నాకు అడ్డం వచ్చేది ఎవడ్రా కాల్చు చంపుతానని బెదిరించిండు. తెలంగాణ వచ్చింది. మంచిగా నడుపుకుంటున్నాం. ఏం చేసిండు రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని అస్థిరపరచడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి నగదు 50 లక్షలు ఇచ్చుకుంటా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. పోలీసోళ్లు పట్టుకువెళ్లి జైల్లో వేసిండ్రు. చిప్పకూడు తిన్న సిగ్గు రాలేదు. దొంగ నోట్ల కేసులో దొరకడం మెడల్ లాంటిది అని రేవంత్ అంటున్నరు. ఏం మాట్లాడాలి ఇక.
ఒకడు వంకర పుట్టిండు అట. ఎందుకు వంకర పుట్టినవు అంటే సక్కగా ఉన్నోన్ని వెక్కిరించేందుకు అని చెప్పిండట. ఇట్లున్నది రేవంత్ రెడ్డి వ్యవహారం. ఇంతకన్న ఘోరం ఉంటదా..? 50 లక్షలు ఇచ్చుకుంట నిటారుగా దొరికిపోతివి. ఇప్పుడు సత్యహరిశ్చంద్రునిలాగా మాట్లాడితే ఎట్ల. ఉస్మానియా విద్యార్థులు అడ్డా కూలీలు, తాగుబోతులు అని మాట్లాడుతడు. జర్నలిస్టులు మాట్లాడితే పండవెట్టి తొక్కుతా అంటడు. ఏకాన పని చేయని రేవంత్ రెడ్డి వల్ల కొడంగల్కు గౌరవం పెరగదు అని కేసీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ గెలిస్తే కదా..? రేవంత్ ముఖ్యమంత్రి అయ్యేది..?
ఇవాళ కాంగ్రెస్ పార్టీలో 15 మంది మోపైండ్రు.. నేను సీఎం అంటే నేను సీఎం. వీళ్లు సీఎం అయ్యేది ఎన్నడు కాంగ్రెస్ గెలిస్తే కదా.. కాంగ్రెస్కు 20 సీట్లు కూడా రావు.. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది లేదు. మన్ను అయ్యేది లేదు. వట్టిదే గ్యాస్. సీఎం అయితడని మోసపోయి ఓట్లు వేస్తే ఉన్న నరేందర్ రెడ్డి పోతడు. కథ మొదటికి వస్తది. రేవంత్ రెడ్డి సీఎం కాడు మన్ను కాడు. అది గ్యాస్. కానీ ఈసారి నరేందర్ రెడ్డికి ప్రమోషన్ వస్తది. తప్పకుండా అవకాశం వస్తది. ఫాల్త్ రేవంత్ మాటలు, మందు సీసాలకు నోట్ల కట్లకు ఏ మాత్రం మోసపోవద్దు. రేవంత్ రెడ్డికి నీతి, నిజాయితీ, పద్దతి లేదు. ముఖ్యమంత్రిని పట్టుకుని పిండం పెడుత అంటడు. ఇలాంటి నాయకులేనా రాజకీయంలో ఉండాల్సింది.. వీరితోని కొండగల్ గౌరవం పెరుగుతదా..? అని కేసీఆర్ ప్రశ్నించారు.
కామారెడ్డిలో రేవంత్ను తుక్కుతుక్కు ఓడగొడుతున్నరు
రేవంత్ రెడ్డి కొండంగల్లో ఇంత పొడుగున ఉన్నదని చెప్పి కామారెడ్డిలో నా మీదకు పోటికి వచ్చిండు. తుక్కు తుక్కు ఓడగొడుతున్నారు. అక్కడ అంగీ పోయేదాకా చంపుతున్నరు.. మీరు ఇక్కడ లాగు పోయేదాకా చంపాలి. మనకు వీళ్ల పీడ పోవాలి. కొడంగల్కు, ఈ తెలంగాణకు ఈ దరిద్రుల పీడ వదిలించుకోవాలి. వీరు రాజకీయాల్లో ఉండదగ్గ మనషులు కాదు. ఒక నీతి, నిజాయితీ, పద్దతి, ప్రజల మీదు ప్రేమ ఉన్నోడు అయితే రాజకీయాల్లో ఉండాలి. భూములు కబ్జా పెట్టే వ్యక్తులు రాజకీయాల్లో అవసరమా..? అని కేసీఆర్ అడిగారు.